రాయచోటి : సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సోమవారం రాయచోటిలో చేపట్టిన ‘జైలుభరో’ నిరసన కార్యక్రమం విజయవంతమైంది. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు బి.వి.రమణ అధ్యక్షతన తహసీల్దార్ కార్యాలయం నుంచి పోలీస్ స్టేషన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సుధీర్ కుమార్, అధ్యక్షులు సిద్దిగాళ్ల శ్రీనివాసులు, కేవీపీఎస్ జిల్లా కో–కన్వీనర్ డి.సి.వెంకటయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాల వల్ల రైతులు, కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని మండిపడ్డారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలని, వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించాలని, రైతాంగ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


