మదనపల్లె సిటీ: డిగ్రీ జనరల్ కోర్సులలో ప్రవేశానికి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కె.బ్రహ్మాచారి తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ కోర్లుల్లో ఆన్లైన్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైనట్లు తెలిపారు. ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. కాలేజీలో అత్యుత్తమ బోధనతో పాటు ఆధునిక సౌకర్యాలు ఉన్నాయని వివరించారు.
ప్రశాంతంగా టెట్
మదనపల్లె సిటీ: ఏపీ టెట్ పరీక్షలు మూడవ రోజు శుక్రవారం జిల్లాలో ప్రశాంతంగా జరిగాయి. మదనపల్లె సమీపంలోని ఆదిత్య, అంగళ్లులోని మిట్స్, రాయచోటిలోని శ్రీసాయి, భాస్కర్ ఇంజనీరింగ్ కాలేజీలో టెట్ పరీక్షలు జరిగాయి. 650 మందికి 542 మంది పరీక్షలు రాశారు. మిట్స్ ఇంజనీరింగ్ కాలేజీలో పరీక్షా కేంద్రాన్ని జిల్లా విద్యాశాఖ ఏడీ రవికుమార్,ఎంఈఓ ప్రభాకర్రెడ్డిలు తనిఖీ చేశారు. అభ్యర్థులకు కల్పించిన మౌళిక వసతులు, కంప్యూటర్ సిస్టమ్ లభ్యతను తనిఖీ చేశారు.
హుండీ ఆదాయం లెక్కింపు
రాయచోటి టౌన్ : రాయచోటి శ్రీభద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి ఆలయంలోని అన్ని ప్రధాన హుండీలను లెక్కించారు. శుక్రవారం దేవదాయశాఖ జిల్లా అధికారి విశ్వనాథ పర్యవేక్షణలో జరిగిన ఈ లెక్కింపులో మొత్తం రూ.31,76,546ల నగదుతో పాటు 20 గ్రాముల బంగారు, వెండి 1.922 కిలో ఉన్నట్లు వెల్లడించారు. ఈ మొత్తం నగదును డీసీసీ బ్యాంక్ ఖాతాలో జమచేసినట్లు ఆలయ పాలకమండలి అధ్యక్షుడు తిరుమల మనోజ్కుమార్, ఆలయ సహాయ కమిషనర్ , ఈవో డీవీ రమణారెడ్డి తెలిపారు. అలాగే అన్నదానం కోసం వచ్చిన మొత్తాన్ని స్టేట్బ్యాంక్లో ఆలయ ఖాతాలో జమ చేసినట్లు తెలిపారు. మొత్తం 135 రోజులకు గాను ఈ హుండీల లెక్కింపు చేశారు. ఆలయ పాలక మండలి సభ్యులు కారంశెట్టి గిరి, ఓ. సుబ్రహ్మణ్యం, జి.నాగేశ్వర్లు,డీసీసీ బ్యాంక్ సిబ్బంది, ఏఎస్ఐ టి. చంద్రశేఖర్ ఇతర ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
ముందస్తు ప్రణాళిక ముఖ్యం
– జిల్లా ప్రాజెక్టు మేనేజర్ బి.వెంకటమోహన్
రాయచోటి (చిన్నమండెం) : వర్షాభావ పరిస్థితులు, అధిక ఉష్ణోగ్రతలు, తక్కువ వర్షపాతం వంటి ఎల్నినో ప్రభావాలను దృష్టిలో ఉంచుకుని రైతులు ముందస్తు ప్రణాళికతో పంటలసాగు చేపట్టాలని పీఎండీఎస్ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ బి.వెంకటమోహన్ సూచించారు. శుక్రవారం చిన్నమండెం మండలం వండాడి గ్రామంలో నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమంలో జిల్లా ప్రాజెక్టు మేనేజర్ రైతులతో సమావేశమై ఎల్నినో ప్రభావం, దాని నివారణకు చేపట్టాల్సిన చర్యలు, ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించారు. బెట్టను తట్టుకునే అనప, బెండ, ఆముదం, అలసంద, కొర్రలు వంటి పంటలను సాగు చేయాలని సూచించారు. ఆర్ఎస్కే సిబ్బంది, మాస్టర్ ట్రైనర్ పద్మావతి, మండల టీం లీడర్ భూపాల్రెడ్డి, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, ఎఫ్ఎంటీస్, ఐసీఆర్పీలు, రైతులు పాల్గొన్నారు.
‘మిల్లెట్స్తో..
స్వయం ఉపాధి’పై శిక్షణ
కడప అగ్రికల్చర్: కడప కృషి విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం నాబార్జు ప్రాజెక్టు కింద సెల్ఫ్ క్రాప్టెడ్ కెరీర్ విత్ మిల్లేట్స్ అంశంపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ శిక్షణలో భాగంగా మిల్లెట్స్ పరిచయం, వివిధ రకాల మిల్లెట్స్ వాటి సాగు పద్ధతులపై అవగాహన కల్పించారు. అలాగే అంగ్రూలో అభివృద్ధి చేసిన మిల్లెట్ రకాలు, బయోఫోర్టిఫైడ్ మిల్లెట్ రకాలపై ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. అనంతరం మిల్లెట్స్తో తయారు చేసే సాంప్రదాయ ఆహార పదార్థాల తయారీలో ప్రాక్టికల్ హ్యాండ్స్–ఆన్ శిక్షణ అందించారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.


