మదనపల్లె టౌన్: కురబలకోట మండలంలోని అంగళ్లు భారత్ కల్యాణ మండపం వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.స్థానికుల కథనం ప్రకారం, వేగంగా వచ్చిన ఓ ట్రాక్టర్ అదుపుతప్పి ముందు వెళుతున్న మండలంలోని తెట్టు నాగలాపురానికి చెందిన గోపి(31), వెంకటరమణ(36) వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న ఇద్దరు వ్యక్తులు కిందపడి తీవ్ర గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న కురబలకోట 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు, గాయపడిన వారి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పుంగనూరు: బోయకొండ గంగమ్మను దర్శనం చేసుకుని ఇంటికి వెళ్తున్న భక్తుల ఆటోను ఆర్టీసీ బస్సు మండలంలోని కృష్ణాపురం వద్ద ఢీకొనడంతో ఐదుగురు గాయపడిన సంఘటన గురువారం సాయంత్రం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. మదనపల్లెకు చెందిన ఐదుగురు ఆటోలో బోయకొండకు వెళ్లి తిరిగి వెళ్తుండగా కృష్ణాపురం సమీపంలో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటో బోల్తాపడి, అందులో ప్రయాణిస్తున్న సతీష్, కుమార్, మల్లికార్జున, చంద్ర, శ్రీరాములు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో సతీష్ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. స్థానికులు గమనించి బాధితులను మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మదనపల్లె టౌన్: కురబలకోట మండలంలో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో సత్యసాయి జిల్లాకు చెందిన ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.స్థానికుల కథనం ప్రకారం.. సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గం లోని కొక్కంటి క్రాస్కు చెందిన సాయి కిరణ్ (28) బైక్పై సొంత పనిమీద మదనపల్లెకు బయలు దేరాడు. కురబలకోట మండలం, కంటేవారిపల్లి వద్దకు రాగానే, ఎదురుగా వస్తున్న వాహనానికి సైడ్ ఇచ్చే క్రమంలో అదుపు తప్పి కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో తలకు బలమైన గాయమై తీవ్ర రక్తస్రావం అయింది. వెంటనే స్థానికులు 108కు సమాచారం అందించారు. కురబలకోట 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రుడికి ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
స్కూటర్ ఢీకొని
వృద్ధ రైతుకు...
మదనపల్లె టౌన్: స్కూటర్ ఢీకొనడంతో ఓ వృద్ధ రైతు తీవ్రంగా గాయపడిన సంఘటన బుధవారం రాత్రి ములకలచెరువు మండలంలో చోటుచేసుకుంది. బాధిత రైతు కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని యేసువారిపల్లికి చెందిన రైతు రవణప్ప (65) సొంత పనిమీద తన బైకులో ములకలచెరువుకు బయలు దేరాడు. మార్గమధ్యంలోని చీకటిమనుపల్లి వద్దకు రాగానే, గుర్తుతెలియని స్కూటర్ వేగంగా వచ్చి బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రవణప్ప కిందపడి తల, కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబీకులు ఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన స్కూటర్ డ్రైవర్ పరారైనట్లు సమాచారం. ఘటనపై ములకలచెరువు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


