– బంగారు నగలు అపహరణ
గుర్రంకొండ: పట్టపగలే దొంగలు ఇంటి తాళాలు పగులగొట్టి బీరువాలో దాచి ఉంచిన 120 గ్రాముల బంగారు నగలను చోరీ చేసుకెళ్లిన సంఘటన మండలంలోని గుర్రంకొండ మేజర్ పంచాయతీ తలారివాండ్లపల్లెలో జగిరింది. గ్రామానికి చెందిన రాజన్న దంపతులు వ్యవసాయం చేసుకొంటూ జీవనం సాగిస్తున్నారు. గ్రామానికి పక్కనే పొలాలు ఉండడంతో ఉదయం పొలం వద్దకు వెళ్లి మధ్యాహ్నం ఇంటికి చేరుకొంటారు. ఈనేపథ్యంలో గురువారం పొలం వద్దకు వెళ్లి వ్యవసాయ పనులు ముగించుకొని ఇంటికి చేరుకొన్నారు. తలుపు తాళాలు బద్దలు కొట్టిన దృశ్యాలు కనిపించాయి. ఇంట్లోకి వెళ్లి పరిశీలించారు. బీరువాతలుపులు తెరచి లాకర్ను బద్దలు కొట్టినట్లు గుర్తించారు. లాకర్లో ఉన్నబంగారునగలు కనిపించక పోవడంతో బాధితులు ఆందోళన చెందారు. గుర్తుతెలియని దుండగులు ఇంట్లో చొరబడి 120 గ్రాముల బంగారు నగలు చోరిచేసుకెళ్లినట్లు బాధితులు పేర్కొన్నారు. ఈ సంఘటనపై స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
రొంపిచెర్ల: రొంపిచెర్ల గ్రామ పంచాయతీలోని జాండ్రవీధిలో నగదు, పట్టు చీరలు, బంగారు నగలు చోరీకి గురైనట్లు బాధితులు రొంపిచెర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. జాండ్రవీధికి చెందిన రామస్వామి, మునెమ్మ బుధవారం వ్యవసాయ పనుల కోసం స్వగ్రామం చెంచెంరెడ్డిగారిపల్లెకు వెళ్లారు. దీంతో ఇంట్లో ఎవరు లేరని తెలుసుకున్న దొంగలు బుధవారం రాత్రి ఇంటి తాళాలు పగలగొట్టి రూ.30 వేలు నగదు, నాలుగు గ్రాములు బంగారు నగలు, రూ.80 వేలు విలువ చేసే నాలుగు పట్టు చీరలు ఎత్తుకెళ్లారు. గురువారం సాయంత్రం ఇంటికి వచ్చిన దంపతులకు ఇంటి తాళాలు పగులగొట్టి ఉండటం గమనించారు.లోపలికి వెళ్లి చూడగా బీరువా పగల గొట్టి చోరీ చేశారని గుర్తించారు. అనంతరం రొంపిచెర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మధుసూధన్ తెలిపారు.
ఆర్టీసీ బస్సులో
బంగారు గొలుసు చోరీ
సదుం: మండలానికి చెందిన ఓ మహిళ బంగారు గొలుసు చోరీకి గురైంది. బాధితురాలి కథనం మేరకు..నడిగడ్డకు చెందిన సంపూర్ణమ్మ చంద్రగిరి బైపాస్ రోడ్డులో సదుం వచ్చేందుకు పుంగనూరుకు వెళ్లే ఏపీ03టీడీ8667 నంబరు గల ఆర్టీసీ బస్సు ఎక్కింది. రద్దీగా ఉండటంతో నిలుచుని ప్రయాణం చేసిన ఆమె మార్గ మధ్యంలో సీటు ఖాళీ కావడంతో కూర్చుంది. ఆమె పక్కన కూర్చున్న ఇద్దరు మహిళల్లో ఒకరు తనకు వాంతి అయ్యేలా ఉందని, జరగాలని చెప్పింది. సంపూర్ణమ్మ జరిగి కూర్చున్న కొద్ది సేపటికే వారిద్దరు బస్సు దిగారు. పాకాల సమీపంలో తన మెడలోని 28 గ్రాముల బంగారు బొట్టుగొలుసు కనిపించక పోవడంతో బస్సు ఆపాలని కండెక్టరును కోరింది. కానీ ఆమె బస్సు ఆపేందుకు నిరాకరించింది. మార్గమధ్యంలో ఏదో ఒక పోలీసు స్టేషన్ వద్ద ఆపాలని మొరపెట్టినా పట్టించుకోలేదని ఆమె కన్నీటి పర్యంతం అయింది. చివరకు సదుం పోలీసు స్టేషన్ వద్ద ఆపాలని కోరినా ఆపకుండా బస్టాండులో ఆపారని బాధితురాలు తెలిపింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పింది.


