మదనపల్లె: సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి, అభివృద్ధి కోసం విప్లవాత్మక సంస్కరణలు, సమాజంలో మార్పు తేవడం కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహానీయుడు జ్యోతిరావుపూలే అని కలెక్టర్ నిశాంత్కుమార్ అన్నారు. శనివారం కలెక్టరేట్లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పూలే జయంతిని నిర్వహించారు. పూలే చిత్రపటానికి కలెక్టర్, ఎమ్మెల్యే షాజహాన్బాషా, ఇన్చార్జి డీఆర్ఓ చంద్రశేఖర్రెడ్డి, పౌరసరఫరాల కార్పొరేషన్ డైరెక్టర్ పర్వీన్తాజ్, అధికారులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కలెక్టర్ మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం సామాజిక అసమానతలను రూపుమాపేందుకు జీవితాన్ని ధారపోసిన పూలే అడుగుజాడలే స్ఫూర్తిగా పయనిద్దామని పిలుపునిచ్చారు. 1848లో దేశంలో తొలి బాలికల పాఠశాలను స్థాపించడం ద్వారా మహిళా విద్యకు నాంది పలికారని అన్నారు. మహిళా విద్యపై అపోహలు, భయాలను తట్టుకుని ముందుకు సాగడం ఆయన పట్టుదలకు నిదర్శనమన్నారు. బీసీ సంక్షేమ శాఖ అధికారి తేజస్విని, జంగం కార్పొరేషన్ చైర్మన్ చంద్రశేఖర్, శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ భావన, పాలఏకరి చైర్మన్ నాగేశ్వర్ నాయుడు, బీసీ సంఘం నాయకులు బోడెం రాజశేఖర్, గంగులప్ప, సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.


