కురబలకోట: జిల్లాలోని అన్ని టమాటా మార్కెట్లు, మండీలలో 15 కేజీల టమాటా క్రేట్లనే అమలు చేయాలని అలాగే జాక్ పాట్ విధానాన్ని పూర్తిగా నిలిపివేయాలని అన్నమయ్య జిల్లా వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఏడీ టి.త్యాగరాజు సూచించారు. గురువారం అంగళ్లు మార్కెట్ కమిటీ కార్యాలయంలో నిర్వహించిన టమాటా మండీల నిర్వాహకులతో సమావేశంలో మాట్లాడారు. అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి, ములకలచెరువు, కలకడ, గుర్రంకొండ, చింతపర్తి మార్కెట్లలో ఇప్పటికే 15 కేజీల క్రేట్ల విధానాన్ని పాటిస్తున్నారన్నారు. ఇదివరలో వినియోగించిన 30 కేజీల పెద్ద క్రేట్ల వల్ల రైతులకు నష్టం వాటిల్లేదని దానిని నియంత్రించాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టిందన్నారు. చిన్న క్రేట్లు మోయడానికి రైతులు, కూలీలకు సులభతరంగా ఉంటాయన్నారు. కాయలు నలగకుండా నాణ్యతగా ఉంటాయన్నారు. ఇక నుంచి అంగళ్లు మార్కెట్లో కూడా చిన్న క్రేట్ల విధానాన్ని విధిగా పాటించాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు.
పెద్ద క్రేట్ల నష్టం ఎలా..?
చిన్న క్రేట్ల విధానం వల్ల తమ వద్ద ఏళ్లుగా ఉన్న పెద్ద క్రేట్లను ఏం చేయాలని అంగళ్లు మండీల నిర్వాహ కులు అధికారులను ప్రశ్నించారు. ఏడాది క్రితమే చెప్పి ఉండాల్సి ఉందన్నారు. ఈ నష్టం ఎవరు భరిస్తారన్నారు. చిన్న క్రేట్ల అమలుకై గడువు ఇవ్వాలని అధికారుల దృష్టికి తీసుకు వచ్చారు. అంగళ్లు, మదనపల్లి, ములకలచెరువు మార్కెట్ కమిటీల కార్యదర్శులు వి. మదన్మోహన్ రెడ్డి, జగదీష్, నవీన్కుమార్ రెడ్డితో పాటు మండీల నిర్వాహకులు సాయప్పీర్, శ్రీనివాసులరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి, ఆదినారాయణ, రైతులు అమరనాథరెడ్డి, శ్రీనివాసులు పాల్గొన్నారు.
జాక్ పాట్ నిర్వహిస్తే లైసెన్స్ రద్దు
అన్నమయ్య జిల్లా ఏడీ త్యాగరాజు


