లేని కల్తీ సృష్టికర్త చంద్రబాబే
● గత టీడీపీ పాలనలో
బోలే బాబా డెయిరీకి అనుమతి
● ఇప్పుడు కల్తీ అంటూ
కూటమి నేతల కుట్ర ఆరోపణలు
● కల్తీ లేదని తేలడంతో ఇప్పుడు
రసాయనాలని బరితెగింపు
● ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి
బి.కొత్తకోట : తిరుమల లడ్డూ ప్రసాదంలో లేని కల్తీని సృష్టించిన సీఎం చంద్రబాబు భక్తుల మనోభావాలతో చెలగాటమాడుతున్నారని తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ లడ్డూ ప్రసాదం నెయ్యిలో జంతువుల కొవ్వుతో కల్తీ జరిగిందని చంద్రబాబు, కూటమి నేతలు ఆరోపిస్తే అలాంటిదేమీ లేదని ల్యాబ్ రిపోర్టులు తేల్చిచెప్పాయన్నారు. దీనితో కూటమినేతల కల్తీ ఆరోపణల్లో పసలేదని తేలడంతో ఇప్పుడు రసాయనాలు కలిపారంటూ ఆరోపించడంతోనే వీరి కుట్రలను భక్తులు, ప్రజలు పసిగట్టారన్నారు.
నెయ్యిలో కల్తీ జరిగిందన్న కేసుకు చంద్రబాబు హయాంలో సరఫరా జరిగిన నెయ్యి ట్యాంకర్ల నుంచి తీసుకున్న శాంపిళ్లపై జరిపిన పరీక్షల చుట్టూనే ఈ కేసు సాగుతోందన్న విషయాన్ని అందరూ గుర్తించారన్నారు. కాబట్టి ఆరోపణలకు సమాధానం చెప్పాల్సింది చంద్రబాబేనన్నారు. 2024 జులై 6న వచ్చిన 2 ట్యాంకర్లు, జులై 12న వచ్చిన మరో 2 ట్యాంకర్ల నెయ్యి నాణ్యతపై టీటీడీ స్థానిక ల్యాబులో పరీక్షలు నిర్వహించి నాణ్యత ప్రమాణాలు పాటించలేదని నిర్దారించి వెనుక్కు పంపేయగా దొడ్డిదారిలో వాటినే తిరిగి టీటీడీకి పంపడం నిజంకాదా అని ప్రశ్నించారు. భోలే బాబా డెయిరీకి అవకాశం కల్పించిన చంద్రబాబు 2019 మార్చి 6న భోలేబాబాకు టెక్నికల్ క్వాలిఫై పర్మిషన్ ఇచ్చారని ఇది నిజం కాదా అని చంద్రబాబును ప్రశ్నించారు. అంటే కల్తీ నెయ్యి వచ్చింది చంద్రబాబు పాలనలోనేకదా దీనికి సమాధానం చెప్పాల్సింది ఆయనే కదా అని నిలదీశారు. ఈ ఆరోపణలపై నిజాలు తేల్చాలంటూ టిటిడి మాజీ చైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించగా చంద్రబాబు తీరును తప్పుపట్టింది నిజం కాదా అని అన్నారు. కల్తీ ఆరోపణలను సమర్దించుకునేందుకు జరిగిన మీడియా సమావేశంలో మంత్రి పయ్యావుల కేశవ్ వ్యాఖ్యలను పరిశీలించాలన్నారు. 2019 ఏడాది ప్రారంభంలో నెయ్యి టెండర్ల వ్యవహారాన్ని పటిష్టం చేశామని చెప్పుకొచ్చారు. అంటే ఇది అనుమానాలకు తావిచ్చినట్టే కదా, 2014 నుంచి 2019 దాక నెయ్యి టెండర్లుకు కఠినమైన నింబంధనలు లేవనేకదా దానర్థం, దానికి మంత్రే అంగీకరించినట్టు కాదా అని ప్రశ్నించారు. నెయ్యి కిలో రూ. 320లకు లభిస్తుందా అని ప్రశ్నిస్తున్న చంద్రబాబు, తన హయాంలోనే రూ.320, రూ. 321లకే చాలాసార్లు నెయ్యి సరఫరా అయ్యింది నిజం కాదా అని ప్రశ్నించారు. లేని ఆరోపణలు చేసి దాన్ని సమర్దించుకునేందుకు మళ్లీ మళ్లీ తప్పుడు ఆరోపణలతో ప్రజలను, భక్తులను తప్పుదోవ పట్టించడం చంద్రబాబు, కూటమి నేతలు మానుకోవాలని పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి కోరారు.


