తెలుగుపదానికి జన్మదినం.. జానపదానికి జ్ఞానపథం
అదివో అల్లదివో శ్రీవారి వాసము పదివేల శేషుల పడగలమయం..లాంటి కీర్తనలతో పదకవితాపితామహుడుగా తాళ్లపాక అన్నమాచార్యలు శ్రీవారి భక్తుల హృదయాల్లో చెరగని ముద్రవేసుకున్నాడు. అన్నమాచార్యుడు 617 జయంతి సందర్భంగా సాక్షి అందిస్తున్న ప్రత్యేక కథనం...
12 నుంచి జయంతి ఉత్సవాలు
రాజంపేట : పదకవితాపితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల 617 జయంతి ఉత్సవాలను ఈనెల 12 వతేది నుంచి 14వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు టీటీడీ స్ధానిక టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలాజీ ఒక ప్రకటనలో తెలిపారు. తాళ్లపాక, 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద ఉత్సవాలు జరుతాయన్నారు. 12న సంకీర్తన గోష్టిగానం,నగర సంకీర్తనలు ఉంటాయన్నారు. ఉదయం 10 నుంచి 1 గంట వరకు శ్రీవెంకటేశ్వరుని కల్యాణం జరుగుతుందని తెలిపారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. 13, 14న తాళ్లపాక, 108 అన్నమయ్య అడుగుల విగ్రహం వద్ద అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అన్నమయ్య జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలని టీటీడీ తరపున భక్తులకు పిలుపునిచ్చారు.
రాజంపేట : భాగవతసేవ పరాయణులైన నారాయణసూరి, లక్కమాంబలకు సంతానం లేకపోవడంతో ఏడుకొండలస్వామిని మొక్కుకున్నారు. తిరుమలకు చేరుకున్న ఈ దంపతులు స్వామి మందిరంలో ప్రవేశించారు.గురుడస్తంభం వద్ద సాగిలపడి మొక్కారు. వెంకటేశ్వరస్వామి తన నిజఖడ్గమైన నందకాన్ని ఆ పుణ్యదంపతులకు ప్రసాదించాడు. వాళ్లు పరమానంద భరితుల య్యారు.వెంకటపతిని దర్శించి స్తుతించారు.సంతోషంతో తాళ్లపాకకు తిరిగివచ్చారు. మే 9,1408న రాజంపేట మండలం తాళ్లపాకలో జన్మించాడు. తన ఎనిమిదో యేట అన్నమయ్యకు ఆయన గురువు ఘనవిష్ణుదీక్షనొసిగినప్పుడు అన్నమాచార్య నామం స్ధిరపడింది.
అన్నమయ్య తిరుమల పయనం..
అన్నమయ్య ఇంటిలో తల్లి సంగీతం, తండ్రి పాండిత్యం ఛాయలతో పెరిగాడు. ఉపవీత సంస్కారం పొందిన తర్వాత ఇంటి గురుకులంలో విద్యాభాస్యం కొనసాగింది.ఏకసంథాగ్రాహి అయినందున అనతికాలంలో ఉన్నత విద్యావంతుడయ్యాడు. తన పదహారో యేట అన్నమయ్యకు శ్రీ వెంకటేశ్వర దర్శనానుభూతి కలిగింది. అప్పటి నుంచి అన్నమయ్య అద్భుతమైన కీర్తనలు రచించసాగాడు. వేడుకుందామా వెంకటగిరి వెంకటేశ్వరుని..అంటూ భక్తబృందంతో కలిసి అన్నమయ్య తిరుమలకు పయనమయ్యారు. వెంకటేశ్వరుని కీర్తిస్తూ తిరుమలలోనే జీవితం గడిపాడు.
సంసారం..సంకీర్తనం
తిరుమల నుంచి తాళ్లపాకకు చేరుకున్న అన్నమయ్యకు తిమ్మక్క, అక్కమ్మ అనే పడతులతో వివాహం జరిగింది. వైవాహిక జీవితంలో పడిన అన్నమయ్య ఒకరోజు తన ఇద్దరు భార్యలతో తిరుమలకు చేరుకున్నారు. ఆ సమయంలోనే శ్రీ వెంకటపతిపై రోజుకొక సంకీర్తన వినిపించాలని సంకల్పించాడు. అప్పటి నుంచి అన్నమయ్య పుంఖానుపుంఖాలుగా కీర్తనలు చెప్పాడు. అతని శిష్యులు వాటిని గానం చేస్తూ తాళపత్రాలకు ఎక్కించారు.భార్యలతో కలిసి తీర్థయాత్రలకు బయలుదేరారు. ముందుగా తన స్వగ్రామంలోని చెన్నకేశవుని అర్చించారు.మార్గంలోని నందలూరు సౌమ్యనాథుడు, ఒంటమిట్టి రామయ్య, కడప వెంకటరమణుని, చాగలమర్రి చెన్నకేశవున్ని, అహోబిలం నృసింహాస్వామిలను దర్శించుకుని కీర్తనలు ఆలపించారు. కీర్తనలుఅంతటా ప్రసిద్ది చెందాయి.
అన్నమయ్య కీర్తనలు..రచనలు..
అన్నమయ్య సంకీర్తనా సేవ సంగీత, సాహిత్య, భక్తి పరిపుష్టం. తెలుగు వ్యవహారిక భాష, దేశి సంగీత విధానాలు రెండు అతని రచనల్లో ఉన్నాయి. లభించిన వాటిలో తొలి సంకీర్తనలు కనుక అన్నమయ్య సంకీర్తనాచార్యుడు, పదకవితాపితామహుడు అయ్యాడు. 32వేల కీర్తనలు ఆలపించారు. అలిమేలు మంగ, శ్రీనివాసుల కీర్తనలకు తన జీవితాన్ని అంకితం చేసిన పరమభక్తుడు అన్నమయ్య. సరళమైన మాటల్లో అధ్యాత్మిక సత్యాలను, వెంకటపతి తత్వాన్ని , జీవాత్మ పరమాత్మల తాదాత్మ్యాన్ని వినిపించాడు.లోకనీతిని, ధర్మాన్ని, విష్ణుతత్వాన్ని కీర్తించాడు. దక్షిణాపథంలో భజన సంప్రదాయానికి అన్నమయ్యే ఆద్యుడు.
తొలి తెలుగు వాగ్గేయకారుడు అన్నమయ్య
12 నుంచి జయంత్యుత్సవాలు
తాళ్లపాకలో శ్రీవారి కల్యాణం..


