
సేవ ముసుగులో దోపిడీ
● అవగాహన కార్యక్రమాలు పక్కన పెట్టి..
అవగాహన కార్యక్రమాలను ఎక్కడా నిర్వహించిన పాపాన పోలేదు. ప్రభుత్వ సూచనలను పక్కనపెట్టి ఆ సంస్థ యాజమాన్యం సిబ్బందిని నేరుగా హోటళ్ల దగ్గరకు పంపి.. అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తూ రశీదులు ఇవ్వడం గమనార్హం. ఈ దందా రాయచోటిలో ఆరు, ఏడు నెలలుగా కొనసాగుతున్నట్లు వ్యాపారులు వాపోతున్నారు. ఒక రాయచోటిలోనే లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారంటే జిల్లా వ్యాప్తంగా వీరి వసూళ్లు కోట్ల రూపాయలు ఉంటాయన్న వాదనలు వినిస్తున్నాయి. ఇలా చేస్తున్న వసూళ్లలో స్థానిక మున్సిపల్, ఫుడ్ షేప్టీ అధికారులకు తగిన మొత్తంలో మామూళ్లను అందిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
రాయచోటి: సేవ ముసుగులో ఓ స్వచ్ఛంద సంస్థ వసూళ్ల దందాకు పాల్పడుతోంది. సేవ చేస్తామని ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకొచ్చుకుంది. అయితే అక్రమ సంపాదనకు తెర తీసింది. ఈ ఆదాయంలో పై నుంచి కింది దాకా వాటాలు ఉన్నాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంస్థను పై స్థాయి నేతలే రంగంలోకి దింపారనే విమర్శలు ఉన్నాయి. ఇదొక ఆదాయ మార్గంగా ఎంచుకున్నారనే వాదన వినిపిస్తోంది.
దర్జాగా రశీదులు ఇస్తూ..
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో కిలో చికెన్పై పది రూపాయల దందా వసూలు అనే విషయాన్ని మరువకముందే.. రాయచోటిలో చికెన్, చికెన్ పకోడి కేంద్రాలు, హోటళ్ల నుంచి ప్రైవేటు సంస్థలకు వేలకు వేల రూపాయలు వాంతున్న లక్షలాది రూపాయలను వసూళ్లు చేస్తుండటంపై వ్యాపారులు బెంబేలెత్తిపోతున్నారు. ప్రైవేటు సంస్థల పేరుతో సాగుతున్న ఈ దందాపై స్థానిక మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదు చేసినా.. ఆగడం లేదని వ్యాపారస్తులు వాపోతున్నారు. ఇంత దోపిడీ జరుగుతున్నా ఫుడ్ షేప్టీ అధికారులు మాత్రం.. నిద్ర మత్తు నుంచి లేవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. వసూలు చేస్తున్న మొత్తంలో స్థానిక మున్సిపల్, ఫుడ్ షేప్టీ అధికారులకు వాటాలు ఇస్తున్నారని, అందువల్లనే వారి వైపు నుంచి చర్యలు లేవని వ్యాపారస్తులు ఆరోపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. అధికార పార్టీ పేరు చెప్పి అక్రమ వసూళ్ల దందా అధికమైందంటున్నారు. వ్యాపారాలు లేక ఆర్థికంగా చితికిపోతున్న వ్యాపారులు.. ప్రత్యేక వసూళ్ల దాడులతో కుదేలవుతున్నారు. ఒక్కొక్క షాపు నుంచి వేలకు వేల రూపాయలు అపరాధ రుసుం పేరుతో వసూలు చేయడమే కాకుండా.. తీసుకున్న డబ్బులకు సంస్థ పేరుతో దర్జాగా రశీదులు ఇస్తుండటం జిల్లా కేంద్రమైన రాయచోటిలో కనిపిస్తుంది.
కై వంజి బాబా గ్రామీణ వికాస్ ఆధ్వర్యంలో..
రాయచోటి మున్సిపాల్టీ పరిధిలో ఫాస్టాక్ ట్రైనింగ్ పార్ట్నర్ పేరుతో కై వంజి బాబా గ్రామీణ వికాస్ మండల ఆధ్వర్యంలో.. మాంసం దుకాణాలు, హోటళ్లు, పకోడి సెంటర్లు, టీ దుకాణాల దగ్గర వేలకు వేల రూపాయలు డబ్బులు వసూలు చేస్తూ రశీదులు ఇస్తున్నారు. ‘మేము చెప్పినంత డబ్బులు ఇవ్వకపోతే, మీపైన కేసులు బుక్ చేస్తామని, ఆపై మీరు కోర్టులకు తిరగాల్సి వస్తుంది’ అని భయబ్రాంతాలకు చేస్తున్నట్లు సమాచారం. అక్రమ వసూళ్లపైన మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో చేసేదిలేక.. వారు అడిగినంత డబ్బులు ఇచ్చి రశీదులు పొందుతున్నారు.
ఫిర్యాదులు వచ్చాయి
హోటళ్లు, చికెన్ సెంటర్ల దగ్గర అనధికారికంగా డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులు వచ్చాయి. ప్రభుత్వం సూచించిన మేరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి నామినల్ రుసుంతో పొందాల్సి ఉంది. ఫిర్యాదులపై మున్సిపల్ చైర్మన్ పయాజ్ బాషాతో కలిసి.. సంస్థ వారిని పిలిచి డబ్బులు వసూలు చేస్తే కేసులు పెడతామని హెచ్చరించాం. అయినా తిరిగి అక్కడక్కడా డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. తగిన చర్యలు చేపడతాం. – వాసు,
మున్సిపల్ కమిషనర్, రాయచోటి
ఇదీ వారి బాధ్యత
ఫాస్టాక్ ట్రైనింగ్ పార్ట్నర్ సంస్థ నిర్వాకం
హోటళ్లు, మాంసం దుకాణాల నుంచి వసూళ్లు
‘కూటమి’ అండదండలతో రెచ్చిపోతున్న వైనం
బెంబేలెత్తుతున్న వ్యాపారులు
ఫుడ్ షేప్టీ అధికారులు దుకాణాల యజమానులు, హోటళ్లలో పని చేస్తున్న కార్మికులకు మంచి ఆహారం, ఆరోగ్యం, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంది. ఆ శాఖ పరిధిలో తగినంత సిబ్బంది లేకపోవడంతో ప్రభుత్వం ఈ అవగాహన కార్యక్రమాల నిర్వహణ బాధ్యతను ప్రైవేటు సంస్థలకు అప్పగించింది. ఈ క్రమంలో వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల్లో కై వంజి బాబా గ్రామీణ వికాస్ మండల ఆధ్వర్యంలో ఏర్పాటైన ఫాస్టాక్ ట్రైనింగ్ పార్ట్నర్ సంస్థ.. హోటళ్లు, చికెన్ సెంటర్లు, టీ దుకాణాల యజమానులకు అందులో పని చేసే వర్కర్లను ఒక చోటికి పిలిచి అవగాహన కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది. ఇలా అవగాహన కార్యక్రమాలను నిర్వహించడానికి ఒక్కొక్క హోటల్, చికెన్ సెంటర్ల నుంచి రూ.300 నుంచి రూ. 500 వరకు చార్జ్ రూపంలో పొందడానికి అనుమతులు ఉన్నాయి.

సేవ ముసుగులో దోపిడీ

సేవ ముసుగులో దోపిడీ