
సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చక పోవడంతో పాటు, అన్ని రంగాల్లో విఫలమైన ప్రభుత్వంపై ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం బుధవారం (4వ తేదీ) నిర్వహించ తలపెట్టిన రాష్ట్ర వ్యాప్త శాంతియుత ర్యాలీలకు అనుమతి ఇవ్వాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర డీజీపీకి లేఖ రాసింది.
పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేరుతో విడుదలైన లేఖలో ముఖ్యాంశాలు ‘వెన్నుపోటు దినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుత ర్యాలీలు నిర్వహించి, ఆయా చోట్ల ఉన్నతాధికారులకు వినతి పత్రాలు సమర్పిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. ఈ కార్యక్రమం కోసం ముందస్తు అనుమతి కోరుతూ, చాలా రోజులకు ముందే స్థానికంగా ఆయా పోలీస్ స్టేషన్లలో దరఖాస్తు చేసినా, ఇప్పటి వరకు ఏ నిర్ణయం తీసుకోకుండా తాత్సారం చేస్తున్నారు. నిరంకుశంగా వ్యవహరిస్తూ, మా పార్టీ కార్యక్రమం నిర్వహించకుండా చేయాలని చూస్తున్నారు. ఇది కచ్చితంగా ఇండియన్ పోలీస్ యాక్ట్, సెక్షన్– 30 ఉల్లంఘన కిందకే వస్తుంది.
ప్రధాన విపక్షంగా ప్రజాస్వామ్య పద్ధతిలో పూర్తి శాంతియుతంగా తాము తలపెట్టిన రాష్ట్ర వ్యాప్త ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమానికి చట్ట ప్రకారం అనుమతి ఇవ్వాల్సి ఉన్నా, స్థానిక పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ, మా విజ్ఞప్తిని పట్టించుకోవడం లేదు. ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొనేలా, తాము ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా నిర్వహించే ర్యాలీలకు స్థానికంగా పోలీసు అధికారులు అనుమతి ఇచ్చేలా ఆదేశించాలివ్వాలని వైఎస్సార్సీపీ కోరుతోంది. ఆ విధంగా ప్రభుత్వం పట్ల ప్రజలు తమ భావాన్ని వ్యక్తం చేసే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తోంది’ అని పేర్కొన్నారు.