
రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ మహిళా విభాగం నిరసనలు
సాక్షి, అమరావతి/నెట్వర్క్: రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు నిరసనగా వైఎస్సార్సీపీ చేపట్టిన ఆందోళనల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. మంగళవారం ‘సేవ్ ఉమెన్.. సేవ్ ఆంధ్రా’ నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ మహిళా విభాగం నిరసన కార్యక్రమాలు చేపట్టింది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి న నాటినుంచి మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్న నేపథ్యంలో అన్ని జిల్లా కేంద్రాల్లో అంబేడ్కర్ విగ్రహాలకు వైఎస్సార్సీపీ మహిళా విభాగం నేతలు వినతిపత్రాలు సమర్పించారు. కూటమి పాలనలో రాష్ట్రంలో స్త్రీలు, బాలికల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండాపోయిందని మహిళలంతా నినదించారు. హోం మంత్రి అనిత మహిళ అయి ఉండి కూడా మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, ఆమె వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
పోలీస్ ఆంక్షల నడుమ పోటెత్తిన ర్యాలీలు
గుంటూరులో నిరసన తెలిపేందుకు వెళుతున్న మహిళలను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు, నిరసనకారుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. మహిళలు బారికేడ్లను నెట్టుకుని వెళ్లి నిరసన తెలియజేశారు. లాడ్జి సెంటర్లో అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, మహిళా విభాగం అధికార ప్రతినిధి శ్రీదేవిరెడ్డి పాల్గొన్నారు.
విజయవాడలో పోలీసులు అడుగడుగునా అడ్డుపడినా ‘సేవ్ ఉమెన్.. సేవ్ ఆంధ్రా’ నినాదాలు చేస్తూ మహిళలు అంబేడ్కర్ స్మృతి వనానికి తరలివెళ్లారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి మహిళలపై అఘాయిత్యాలు, హత్యలను నిరసిస్తూ వినతిపత్రం సమర్పించారు. బాపట్లలో అంబేడ్కర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించి వినతిపత్రం సమర్పించారు.
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ‘సేవ్ ఉమెన్.. సేవ్ ఆంధ్రా’ నినాదాలతో కూడిన ప్లకార్డులు, బ్యానర్లు చేతబట్టి మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు. నెల్లూరులోని వీఆర్సీ సెంటర్లో భారీ ర్యాలీ జరిగింది. ఏలూరు పాత బస్టాండ్ సెంటర్లో అంబేడ్కర్ విగ్రహం వద్ద మహిళలు భారీఎత్తున నిరసన తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో అంబేడ్కర్ విగ్రహానికి క్షీరాభిõÙకం చేసి వినతిపత్రం సమర్పించారు.
భీమవరంలోనూ పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు జరిగాయి. కాకినాడ ఇంద్రపాలెం బ్రిడ్జి వద్ద అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మహిళలు భారీ నిరసన చేపట్టి గోకవరం బస్టాండ్ వద్ద అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో జిల్లా నలుమూలల నుంచి మహిళలు తరలివచ్చి ‘సేవ్ ఉమెన్.. సేవ్ ఆంధ్రా’ కార్యక్రమం చేపట్టారు. ఒంగోలులో అంబేడ్కర్ భవన్ నుంచి ప్లకార్డులు పట్టుకుని మహిళలు పెద్దఎత్తున నినాదాలు చేస్తూ కలెక్టరేట్కు చేరుకుని నిరసన తెలిపారు.
ఉత్తరాంధ్రలో నిరసనల వెల్లువ
విశాఖపట్నంలో మహిళలు, వైఎస్సార్సీపీ నేతలు భారీ ర్యాలీ నిర్వహించి అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. అనకాపల్లిలో మహిళలు రింగ్ రోడ్ నుంచి ర్యాలీగా రైల్వే జంక్షన్కు వెళ్లి అంబేడ్కర్ విగ్రహం వద్ద ‘రెడ్బుక్ పాలన పోవాలి.. మహిళలు, బాలికలపై అత్యాచారాలు, హత్యలు అరికట్టాలంటూ వినతిపత్రం అందజేశారు. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో నిరసనలు వెల్లువెత్తాయి. శ్రీకాకుళంలోని అంబేడ్కర్ కూడలి వద్ద మహిళలు ప్లకార్డులతో నినాదాలు చేస్తూ నిరసన ప్రదర్శన చేశారు.
రాయలసీమ జిల్లాల్లో నిరసన గళం
మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై అనంతపురం అంబేడ్కర్ విగ్రహం ఎదుట రోడ్లపై బైఠాయించారు. రాప్తాడు, హిందూపురంలో మహిళలు నిరసన తెలిపారు. కడప కోటిరెడ్డి సర్కిల్లో మహిళలకు రక్షణ కల్పించాలని మహిళలు నినదించారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ర్యాలీ జరిపారు.
కర్నూలులో నల్లబ్యాడ్జీలు ధరించి కొండారెడ్డి బురుజు నుంచి పాతబస్టాండ్ సెంటర్లోని అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ చేశారు. మహిళలపై అఘాయిత్యాల విషయం కూటమి ప్రభుత్వ తీరును ఎండగడుతూ తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసనకు దిగారు. చిత్తూరు జిల్లాలోనూ నిరసన కార్యక్రమాలు జరిగాయి.