QR కోడ్‌తో బాబు మోసాలను నిలదీద్దాం.. ప్రజలకు వైఎస్‌ జగన్‌ పిలుపు | YSRCP President YS Jagan Mohan Reddy Key Press Meet At 11 AM | Sakshi
Sakshi News home page

QR కోడ్‌తో బాబు మోసాలపై పోరాడుదాం.. ప్రజలకు వైఎస్‌ జగన్‌ పిలుపు

Jun 19 2025 10:18 AM | Updated on Jun 19 2025 3:43 PM

YSRCP President YS Jagan Mohan Reddy Key Press Meet At 11 AM

సాక్షి,గుంటూరు: ఏపీలో ఏడాదిగా కూటమి పాలనలో.. టీడీపీ, ఎల్లో మీడియాతో  యుద్ధం చేస్తున్నామని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం తాడే పల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వైఎస్‌ జగన్‌ మాట్లాడారు.

రాష్ట్రంలో దిగజారిన లాండ్‌ ఆర్డర్‌, పాలన వైఫల్యాలు, మోసాల మధ్య చంద్రబాబు పాలన కొనసాగుతోంది. చంద్రబాబు అరాచక పాలనకు వ్యతిరేకంగా మే4న ప్రజలు, వైఎస్సార్‌పీ శ్రేణులు భారీ ఎత్తున పాల్గొని వెన్నుపోటు దినాన్ని విజయవంతం చేశారు. టీడీపీ నేతలు, పోలీసుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించేందుకు రెంటపాళ్ల వెళ్లా. కర్ఫ్యూలాంటి పరిస్థితుల మధ్య  నా రెంటపాళ్ల పర్యటన జరిగింది. అయినా విజయవంతమైంది. మా పార్టీ శ్రేణుల్ని పరామర్శిస్తే తప్పా?  మొన్నటి పొదిలి పర్యటనలో 40వేల మందిపై రాళ్లేసే ప్రయత్నం చేశారు. రైతులు సంయమనం పాటించారు. అయినా కేసులు పెట్టారు. రైతుల సమస్యల గురించి ఎవరూ మాట్లాడకూడదు. సంఘీభావం తెలపకూడదా? అని ప్రశ్నించారు.   

చంద్రబాబు భయం.. ఎందుకు?
చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారు. ఓ టీవీ ఛానెల్‌లో చంద్రబాబు అహంకార మాటలు వినండి. ప్రతిపక్షను భూస్థాపితం చేస్తారట. ప్రశ్నిస్తున్న వ్యక్తిని భూస్థాపితం చేస్తారా?. ఏడాది కాలంలోనే ఎన్నడూ లేని విధంగా ప్రజల్లో చంద్రబాబు పాలనపై అసహనం పెరిగింది. ఆ అసహనాన్ని డైవర్ట్‌ చేస్తూ వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులపై, నేతలపై కేసులు పెడుతున్నారు. టాపిక్‌ డైవర్ట్‌ చేస్తున్నారు. 

మద్యం కేసులో అక్రమ అరెస్టులు 
డైవర్షన్‌ పాలిటిక్స్‌లో భాగంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు, నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారు. మద్యం కేసులో అక్రమ అరెస్టులు జరుగుతున్నాయి. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని అరెస్ట్‌ చేశారు. చెవిరెడ్డి అరెస్ట్‌ నిజంగా అశ్చర్యకరం. ‌తప్పుడు స్టేట్‌మెంట్‌ ఇవ్వాలని గన్‌మెన్‌ను బలవంతం చేశారు. తప్పుడు స్టేట్‌మెంట్‌ ఇవ్వనందుకు గన్‌మెన్‌పై దాడి కూడా చేశారు. తనపై జరిగిన దాడిని గురించి ప్రస్తావిస్తూ రాష్ట్రపతి, గవర్నర్‌, డీజీపీకి గన్‌మెన్‌ లేఖ రాశారు. మరో గన్‌మెన్‌ను ప్రలోభాలకు గురిచేసి వారికి అనుకూలంగా స్టేట్‌మెంట్‌ ఇప్పించుకున్నారు. 

వైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమ కేసులు.. అరెస్టులు  
చెవిరెడ్డితో పాటు ఆయన కొడుకును కేసులో ఇరికించారు. సొంత నియోజవకర్గంలో గెలవలేని వ్యక్తి. చంద్రగిరిలో ఇబ్బంది ఉండకూడదనే చెవిరెడ్డిని అరెస్ట్‌ చేశారు.  తప్పుడు కేసులో పిన్నెల్లిని అరెస్ట్‌ చేశారు. మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను అక్రమంగా అరెస్ట్‌ చేశారు. సుప్రీంకోర్టుకు వెళ్లి బెయిల్‌ తీసుకొచ్చాం. మళ్లీ తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. సురేష్‌ భార్యపైనా కేసులు పెట్టారు. వల్లభనేని వంశీపై 11 కేసులు పెట్టారు. జోగి రమేష్‌ కొడుకు, కాకాణిపై తప్పుడు కేసులు. కృష్ణమోహన్‌రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్‌రెడ్డిపైనా అక్రమ కేసులు పెట్టారు.  కొడాలి నాని, సజ్జల రామకృష్ణారెడ్డి, పేర్నినాని, వైవి సుబ్బారెడ్డి,ఆయన కుమారుడిపై తప్పుడు కేసులు. దేవినేని అవినాష్‌, మాజీ ఎమ్మెల్యే ఆర్కే,అంబటి రాంబాబు, విడదల రజినిపై తప్పుడు కేసులు దళిత ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌పైనా అక్రమ కేసులు. బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డిపై, ఉషశ్రీచరణ్‌, తోపుదుర్తి ప్రకాష్‌, గోరంట్ల మాధవ్‌పై కేసులు. ఇలా వైఎస్సార్‌సీపీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్‌ చేయాలని చూస్తున్నారు. 

కొమ్మినేని ఏం పాపం చేశారు.. చంద్రబాబూ?
సీనియర్‌ జర్నలిస్ట్‌ కొమ్మినేని శ్రీనివాసరావు ఏం పాపం చేశారు? ఏం చేశారని కొమ్మినేనిని అరెస్ట్‌ చేశారు?టీవీ డిబెట్‌లో అనలిస్ట్‌ మాటలకు కొమ్మినేనికి ఏం సంబంధం? గతంలో కేఎస్‌ఆర్‌ ఉద్యోగాన్ని చంద్రబాబు ఊడగొట్టించారు. కేఎస్‌ఆర్‌ అరెస్ట్‌ అక్రమమేనన్న సుప్రీంకోర్టు.. తనకున్న విచక్షణాధికారాల్ని ఉపయోగించి ఆయన్ను వెంటనే విడుదల చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలించింది. సుప్రీం కోర్టు తీర్పు చంద్రబాబుకు చెంపపెట్టులాంటిది. 

మహిళల పట్ల చంద్రబాబుకు  గౌరవం ఉందా?
మహిళల పట్ల చంద్రబాబుకు  గౌరవం ఉందా అని వైఎస్‌ జగన్‌ ప్రెస్‌మీట్‌లో ప్రశ్నించారు. ఈ సందర్భంగా    అరాచకాలు, దౌర్జన్యాలు, దోపిడీలకు కేరాఫ్‌గా మారిన ఉమ్మడి అనంతపురం జిల్లా రామగిరి ప్రాంతంలో  మాజీ మంత్రి పరిటాల సునీత స్వగ్రామం వెంకటాపురానికి కూతవేటు దూరంలోని ఏడుగుర్రాలపల్లిలో ఓ దళిత బాలికపై కొందరు టీడీపీ నేతలు సామూహిక అత్యాచారం చేశారు.  బాలిక గర్భం దాలిస్తే ఈ విషయం బయటకొచ్చింది. కనీసం ఫిర్యాదు కూడా ఇవ్వకుండా భయపెట్టారు. కనీసం చర్యలు తీసుకునే దమ్ము చంద్రబాబుకు లేదా? న్యాయం  చేయాలనే తపన చంద్రబాబుకు లేదు. న్యాయం వైపు నిలిచే వ్యక్తి చంద్రబాబు కాదు. మరో ప్రాంతంలో ఇంటర్‌ గిరిజన బాలిక కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. తర్వాత బాలిక శవమై కనిపించింది. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో అప్పు చెల్లించలేదని మహిళను చెట్టుకు కట్టేసి దాడి చేశారు. టీడీపీ నేత.. మహిళను చెట్టుకు కట్టేసి కొట్టారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

వెన్నుపోటు పొడవటంలో చంద్రబాబుకు ఆయనే సాటి
ప్రజల కోసం ఆలోచన చేసిన ప్రభుత్వం మాది. 32లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాం. 22 లక్షల ఇళ్లను మంజూరు చేసి 10లక్షల ఇళ్లు పూర్తి చేశాం. చట్టం చేసి మరి నామినేటెడ్‌ పదవుల్లో మహిళలకు అవకాశం కల్పించ్చాం. మహిళలపై ఎవరికి గౌరవం ఉంది?. మహిళలంటే చంద్రబాబుకు గౌరవం లేదు. వెన్నుపోటు పొడవటంలో చంద్రబాబుకు ఆయనే సాటి.

కరెంట్‌ బిల్లుల బాదుడే.. బాదుడు
15వేల కోట్లు కరెంట్‌ బిల్లుల బాదుడు,గవర్నమెంట్‌ స్కూళ్లు కాలేజీ కాలేజీల్ని నిర్విర్యం చేశాడు. ప్రైవేట్‌ స్కూల్స్‌, కాలేజీల్లో ఫీజుల పేరిట బాదుడే బాదుడే. రేషన్‌ వెహికల్స్‌ వాహనాల్ని తీసేశాడు. రేషన్‌ ద్వారా ఇచ్చే పప్పు దాన్యాల్ని ఎగనామం పెట్టాడు. ఫలితంగా పప్పు దాన్యాల రేట్లు పెంచి బాదుడే బాదుడు. కొత్త ఉద్యోగాలు ఇవ్వాల్సింది పోయి.. సుమారు 3లక్షలపై చీలూకు ఉద్యోగాల్ని తొలగించారు.

ప్రభుత్వ ఉద్యోగుల సంగతి సరేసరి
పంటలకు సరైన మద్దతు లేదు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఏమైనా ఒరిగిందా అంటే? అదీ లేదు. వచ్చీ రాగానే పీఆర్సీ అన్నారు. పీఆర్సీని ఆపేశారు. ఈ జులై 1వ తారీఖుతో కలిసి నాలుగు డీఏ ఇవ్వాలి. ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన 20 వేలకోట్ల వరకు ఆపేశారు.  

చంద్రబాబు పెట్టిన తాకట్టు..  
చంద్రబాబు తాను అబద్ధమాడుతూ.. తానెప్పుడూ ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టడం లేదన్నాడు. మద్యం ఆదాయం తాకట్టుపెట్టడం లేదు. కానీ 4-4-2025 నాడు విడుదల చేసిన జీవో 69 కింద ఏపీఎండీసీ కింద 436 మినరల్‌ ప్రాజెక్ట్‌ను తాకట్టు పెట్టారు. వాటి విలువ 191,000 కోట్లు  

రాష్ట్ర ప్రజలకు వైఎస్‌ జగన్‌ విజ్ఞప్తి 
ప్రెస్‌మీట్‌లో రాష్ట్ర ప్రజలకు వైఎస్‌ జగన్‌ విజ్ఞప్తి చేశారు. ఎన్నికల మ్యానిఫెస్టో, బాండలను అందరూ రెడీగా పెట్టుకోవాలి. చంద్రబాబు తన పాలన గురించి తెలుసుకునేందుకు  మీ ఇంటికి ఎమ్మెల్యేలు, ఇతర నేతల్ని పంపిస్తున్నారు. నేతలు వచ్చినప్పుడు మ్యానిఫెస్టో, బాబుష్యూరిటీ.. భవిష్యత్తు గ్యారెంటీ పేరుతో బాండును అందించారు. ఆ బాండు, ఎన్నికల మ్యానిఫెస్టో చూపిస్తూ ఎంత వరకు ఎన్నికల హామీలు నెరవేర్చారో అడగండి. అప్పుడైనా చంద్రబాబుకు ఎన్నికల హామీలు నెరవేర్చుతారో చూడాలి. ఒకవేళ మీ వద్ద ‘బాబు మ్యానిఫెస్టోని గుర్తు తెచ్చుకుంటూ’ అనే పేరుతో చంద్రబాబు మ్యానిఫెస్టోను డౌన్‌లోడ్‌ చేసుకునేలా క్యూఆర్‌ కోడ్‌ను వైఎస్సార్‌సీపీ అందుబాటులోకి తెస్తుంది’ అని అన్నారు. ప్రభుత్వంపై ఫైట్‌ చేయండి. రాష్ట్ర ప్రజల తరుఫున వైఎస్సార్‌సీపీ నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుందని వైఎస్సార్‌సీపీ అధినేత, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement