సీఎం జగన్ పాలనకు ప్రజలు బ్రహ్మరథం
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారని రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఆదివారం ఆయన విజయవాడ సీతారాంపురంలోని 24వ డివిజన్లో ప్రజా సమస్యలు గడపగడపకు వెళ్లి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సీఎం జగన్ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. (చదవండి: నిమ్మగడ్డ.. చంద్రబాబు ఏజెంట్: గౌతమ్రెడ్డి)
దేశంలోని అభివృద్ధిలో మూడోవ ముఖ్యమంత్రిగా కీర్తి ప్రతిష్టలు దక్కాయన్నారు. పంచాయతీ ఎన్నికలలో ఎస్ఈసీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలోని పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ విజయాన్ని ఎవరు అడ్డుకోలేరని తెలిపారు. రాష్ట్రంలోని రేషన్ డోర్ డెలివరీ వాహనాల రంగులు మార్చాలనే ఎస్ఈసీ ఆదేశాలను ఎమ్మెల్యే మల్లాది విష్ణు తప్పుబట్టారు. (చదవండి: హైకోర్టులో నిమ్మగడ్డకు భారీ ఎదురుదెబ్బ)