‘నేనున్నాను..’ పులివెందుల ప్రజాదర్బార్‌లో వైఎస్‌ జగన్‌ | YSRCP Chief EX CM YS Jagan Reached Pulivendula For Three Days Tour | Sakshi
Sakshi News home page

‘నేనున్నాను..’ పులివెందుల ప్రజాదర్బార్‌లో వైఎస్‌ జగన్‌

Nov 25 2025 3:54 PM | Updated on Nov 25 2025 10:01 PM

YSRCP Chief EX CM YS Jagan Reached Pulivendula For Three Days Tour

సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి రాకతో పులివెందుల జనసందోహంగా మారింది. భాకరాపురంలోని తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన ప్రజా దర్బార్‌ నిర్వహించారు. కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో మమేకమయ్యారు. వారి బాధలు, కష్టాలు, సమస్యలు వింటూ.. ‘నేనున్నాను’ అంటూ భరోసాతో పాటు ధైర్యాన్ని కల్పించారు. 

పులివెందుల చుట్టుపక్కల వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించిన వైఎస్‌ జగన్‌.. వారి యోగక్షేమాలు తెలుసుకుని, వారి సమస్యలు ఓపిగ్గా విన్నారు. వారికి భరోసా కల్పించారు. స్వయంగా పరిష్కరించగల వాటికి తక్షణమే స్పందించారు. వారి సమస్య పరిష్కారానికి ఏం చెయ్యాలో పక్కనే ఉన్న కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డికి సూచించారు. 

ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి మేలు ఒకటి కూడా జరగలేదని వచ్చిన వారంతా తమ గోడు వెళ్ళబోసుకున్నారు. అన్ని వర్గాలకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని భరోసానిచ్చిన వైఎస్‌ జగన్, వారి పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు.

గోడు వెల్లబోసుకున్న రైతులు
వరుస తుపాన్లు, వర్షాలతో తాము అల్లాడిపోతున్నా చంద్రబాబు ప్రభుత్వం నుంచి కనీస సాయం కూడా అందడం లేదని ఈ సందర్భంగా పలువురు రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో తామంతా భరోసాగా బ్రతికామని, కానీ ఇప్పుడు వ్యవసాయం అంటేనే అన్నదాతలు భయపడే పరిస్ధితికి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు సంక్షేమాన్ని గాలికొదిలేసిన ప్రభుత్వంపై రైతుల తరుపున పోరాడతామని.. వారికి అండగా ఉంటామని జగన్‌ భరోసానిచ్చారు.

మేం సీట్లు కోల్పోయాం: వైద్య విద్యార్థులు
చంద్రబాబు సర్కార్‌ మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణపై పలువురు వైద్యవిద్యార్థులు వైఎస్‌​జగన్‌ను కలిసి వాపోయారు. పులివెందుల, పాడేరుతో మరో వంద సీట్లు వచ్చేవని.. అయితే కూటమి సర్కార్‌ నిర్ణయంతో సీట్లు కోల్పోయామని జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఒక్క మార్కుతో సీటు కోల్పోయానని చరణ్‌ అనే విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో కేంద్రం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తానని జగన్‌ భరోసా ఇచ్చారు. 

ఆప్యాయ పలకరింపులు.. సెల్ఫీలు
వైఎస్‌ జగన్‌పై అభిమానంతో కొందరు భాకరాపురం క్యాంప్‌ కార్యాలయానికి తరలి వచ్చారు. దివ్యాంగులు, చిన్నారులు, అక్కచెల్లెమ్మలు, యువకులను ఆయన అప్యాయంగా పలకరించారు. తిరిగి వెళ్లే క్రమంలో.. అక్కడే ఉన్న కొందరి యువకుల ఫోన్లలో స్వయంగా సెల్ఫీలు తీశారు. 

 

పులివెందుల చేరుకున్న జగన్

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement