సాక్షి, తూర్పుగోదావరి: ఏపీలో ప్రజాస్వామ్యం ఉందా? లేక ఉత్తరకొరియా పాలన చేస్తున్నారా? అని ప్రశ్నించారు మాజీ ఎంపీ మార్గాని భరత్. డీఎస్సీ అవకతవకలపై ప్రశ్నిస్తే కేసులు పెట్టమని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటన చేయటం దారుణమని మండిపడ్డారు. ఏపీలో అన్ని వేళ్లు విద్యాశాఖ మంత్రివైపు చూస్తున్నాయి. నారా లోకేష్ రాజీనామా చేయాల్సిందే. ఎల్లకాలం చంద్రబాబు ప్రభుత్వమే ఉండదు అని హెచ్చరించారు.
వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘డీఎస్సీలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వ్యక్తికి ఎందుకు జాబ్ ఇవ్వలేదు?. దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. డీఎస్సీ అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో గాని సీబీఐతో గానీ పూర్తిస్థాయి విచారణ నిర్వహించాలి. డీఎస్సీలో స్పోర్ట్స్ కోట పేరిట ఎలా ఉద్యోగాలు ఇస్తారు. నీట్లో జరిగిన అక్రమాలు బయటపడి దేశవ్యాప్తంగా ఎలా కలకలం రేపాయో.. ఏపీలో డీఎస్సీ వ్యవహారం కూడా అదే స్థాయిలో బయటపడుతోంది.
చంద్రబాబు ముందే అప్రమత్తమై హుకుం జారీ చేస్తున్నారు. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలనే ఉద్యమం ఊపందుకుంటుంది. అన్ని వేళ్ళు విద్యాశాఖ మంత్రి వైపే చూపిస్తున్న తరుణంలో ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ జరగాలి. ఎల్లకాలం చంద్రబాబు ప్రభుత్వమే ఉండదు. డైవర్షన్ పాలిటిక్స్కు ఆద్యుడు చంద్రబాబే. రష్యాలో లోకేష్ మాట్లాడిన మాటలు చూస్తే ఆశ్చర్యం కలుగుతోంది. ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్లు ఎకానమీ చేస్తామంటున్నారు. అందులో పదో వంతు కూడా రాష్ట్ర ఎకానమీ లేదు. సంపద సృష్టి అని చెప్పిన చంద్రబాబు మాటలు ఎక్కడికి వెళ్ళిపోయాయి. రాష్ట్రం అప్పుల కుప్పగా మారిపోయింది. దారుణమైన విధానాలు అవలంబిస్తున్న ఈ ప్రభుత్వానికి ఇంకా ప్రజలు ఓటేస్తున్నారంటే మనల్ని మనం ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు రెండు నాల్కల ధోరణి అనుసరిస్తారు’ అని వ్యాఖ్యలు చేశారు.


