తాడేపల్లి: ఏపీ హోంమంత్రి అనితకు మేకప్ మీద ఉన్న ప్రేమ మనుషుల ప్రాణాల మీద లేదని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి ఆరె శ్యామల అన్నారు. జ్ఞానేశ్వరి, సాయికృష్ణ కేసులపై హోంమంత్రి ఎందుకు మాట్లాడబోరని నిలదీశారు. సాయికృష్ణ మీద కేసులుంటే అతన్ని లాకప్ డెత్ చేస్తారా అని ప్రశ్నించారు. మరి ఇంకా ఎక్కువ కేసులున్న టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కు కూడా అదే ట్రీట్మెంట్ ఎందుకు ఇవ్వలేదని అడిగారు.
తాడేపల్లిలో బుధవారం ఆరె శ్యామల మీడియాతో మాట్లాడుతూ.. ‘‘హోంమంత్రి అనిత మహిళల గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది. అనిత అధికార మదంతో ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల గురించి అనిత అత్యంత నీచంగా మాట్లాడారు.
మేము ఏదైనా మాట్లాడితే మహిళకు అవమానం అంటూ రచ్చ చేస్తారు. ఇదేనా మీ ఎల్లోమీడియా, ఐ-టీడీపీ చేసే నీచ రాజకీయం? రాష్ట్రంలో రాజకీయ సంభాషణను మార్చేసింది టీడీపీనే. రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలపై హోంమంత్రి ఎందుకు మాట్లాడటం లేదు? హోంమంత్రి బాధ్యత మహిళలకు రక్షణ కల్పించటం. అది వదిలేసి నోటికి వచ్చినట్టు మాట్లాడితే జనమే తగిన బుద్ది చెబుతారు. కాకినాడలో చిన్నారి మిస్సింగ్ ఐతే హోంమంత్రి మాట్లాడరు’’ అని విమర్శలు గుప్పించారు.


