AP: వికేంద్రీకరణే ముద్దు

YSRCP Activists And People Prayers All Over For three Capitals - Sakshi

ఒకే రాజధాని వద్దు.. మూడు రాజధానులతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి

రాష్ట్ర వ్యాప్తంగా అందరి నోటా ఇదే మాట.. విజయదశమి పర్వదినాన ఊరూరా ప్రజలు, వైఎస్సార్‌సీపీ శ్రేణుల పూజలు

విఘ్నాలు, ఆటంకాలు తొలగిపోవాలి.. దుష్టశక్తుల కుట్రలు భగ్నం కావాలి..

రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్న వారికి మంచి బుద్ధి ప్రసాదించాలి

ప్రముఖ ఆలయాల వద్ద కొబ్బరికాయలు కొట్టి వేడుకోలు  

ముస్లింలు సైతం ప్రత్యేక ప్రార్థనలు

సాక్షి నెట్‌వర్క్‌: ఒకే ప్రాంతంలో అభివృద్ధిని కేంద్రీకరించడం తగదని, వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యమని రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు పునరుద్ఘాటించారు. ఇందులో భాగంగా మూడు రాజధానులు ఏర్పాటయ్యేందుకు అడ్డుగా ఉన్న విఘ్నాలను తొలగించాలని విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు బుధ, గురువారాల్లో ఆలయాల వద్ద కొబ్బరి కాయలు కొట్టి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు.

వైఎస్సార్‌సీపీ పిలుపు మేరకు పార్టీ నేతలు, శ్రేణులతో పాటు పెద్ద ఎత్తున ప్రజలు స్వచ్ఛందంగా ఈ పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయాల మేరకు పాలనా వికేంద్రీకరణకు అమ్మవారి ఆశీస్సులు కోరారు. విజయవాడ ఇంద్రకీలాద్రిలోని శ్రీకనకదుర్గమ్మ, తిరుపతిలోని గంగమ్మ, శ్రీశైలంలో భ్రమరాంబ, విజయనగరంలో పైడి తల్లి, విశాఖలో కనక మహాలక్ష్మీ ఆలయాలతో పాటు ఇతర ప్రముఖ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు.


గుంటూరులోని పోలేరమ్మ గుడి వద్ద 303 కొబ్బరికాయలు కొడుతున్న ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్, స్థానికులు

నియోజకవర్గ స్థాయిలో ఈ ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పార్టీ నేతలు, స్థానిక ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలంటే ప్రాంతాలకు అతీతంగా అభివృద్ధి జరగాలని, అందుకు పాలనా వికేంద్రీకరణ ఒక్కటే మార్గమని ఇందుకోసం దుర్గమాత ఆశీస్సులు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు ఉండాలని వారు ఆకాంక్షించారు. మూడు రాజధానులకు అడ్డు పడుతున్న వారికి దేవుడు మంచి బుద్ధి ప్రసాదించాలని ప్రార్థించారు. అన్ని నియోజకవర్గాల్లోనూ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, ప్రజలు పూజలు నిర్వహించారు. 

ద్రాక్షారామంలోని మాణిక్యాంబ సన్నిధిలో కొబ్బరికాయ కొడుతున్న మంత్రి వేణుగోపాల్‌

విఘ్నాలు తొలగించమ్మా..
► ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ ఇంద్రకీలాద్రిపై మంత్రి జోగి రమేష్‌ కొబ్బరికాయలు కొట్టి పూజలు నిర్వహించారు. రాష్ట్ర అభివృద్దికి కలిగే విఘ్నాలు, ఆటంకాలు పోవాలని, దుష్టశక్తులు కలిగించే విఘ్నాలు తొలగిపోవాలని దుర్గమ్మను ప్రార్థించానన్నారు. మంత్రి రోజా రాజగోపురం ఎదుట 108 కొబ్బరి కాయలు కొట్టారు. వికేంద్రీకరణ జరిగిన తర్వాత మళ్లీ వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటానన్నారు. 

► వేమూరు నియోజకవర్గంలోని చుండూరులో శ్రీ బాల కోటేశ్వర స్వామి ఆలయంలో మంత్రి మేరుగ నాగార్జున, రేపల్లెలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఎంపీ మోపిదేవి వెంకట రమణారావు పూజలు నిర్వహించారు.  

► విశాఖపట్నం, అమరావతి, కర్నూలు ప్రాంతాల్లో రాజధానులు ఏర్పాటు వేగవంతంగా జరిగేలా దీవించాలంటూ విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. అనకాపల్లిలో నూకాంబిక దేవాలయంలో మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు.   

తణుకు మండలం సజ్జాపురంలోని శ్రీఏవుళ్లమ్మ తల్లి ఆలయంలో కొబ్బరికాయలు కొడుతున్న మంత్రి కారుమూరి

► విశాఖను పరిపాలనా రాజధాని చెయ్యాలంటూ వైఎస్సార్‌సీపీ మైనార్టీ నాయకులు కేవీ బాబా, మాజీ ఎమ్మెల్యే ఎస్‌.ఎ.రెహమాన్, ఐ.హెచ్‌.ఫరూఖ్‌ అక్కయ్యపాలెం మెయిన్‌రోడ్‌లోని తాజ్‌బాగ్‌ దర్గాలో చాదర్‌ సమర్పించి ప్రార్థనలు చేశారు. 

► శ్రీకాకుళంలోని ఏడురోడ్లు కూడలి వద్ద దుర్గాదేవి ఆలయంలో, బలగలోని శ్రీ బాల త్రిపుర కాల భైరవ ఆలయంలో, గైనేటి వీధి నీలమ్మ తల్లి ఆలయంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధి శ్రీ పాల పోలమ్మ తల్లి ఆలయంలో రాష్ట్ర శాసనసభాపతి తమ్మినేని సీతారాం 108 కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు.  

దుర్గమ్మ సన్నిధిలో టెంకాయలు కొడుతున్న మంత్రి రోజా

► విజయనగరంలో శాసనసభ డిప్యూటీ స్పీకరు కోలగట్ల వీరభద్రస్వామి, సాలూరు శ్యామలాంబ ఆలయంలో  ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక రాజన్నదొర ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

► ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఆలయాల వద్ద పెద్ద ఎత్తున కొబ్బరికాయలు కొట్టారు. మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తణుకు నియోజకవర్గంలో పూజలు నిర్వహించారు. పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు కొయ్యలగూడెంలో ర్యాలీ నిర్వహించారు. ఏలూరులో మేయర్‌ షేక్‌ నూర్జహాన్‌ ర్యాలీ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. తాడేపల్లిగూడెంలో బలుసులమ్మ ఆలయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ కొబ్బరి కాయలు కొట్టారు. 


ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేటలో 3 రాజధానులకు మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయభాను

► తూర్పుగోదావరి జిల్లా చాగల్లులోని ఆంజనేయస్వామి ఆలయం వద్ద మంత్రి తానేటి వనిత, ఎంపీ మార్గాని భరత్‌ కొబ్బరికాయలు కొట్టారు. తునిలో కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ద్రాక్షారామంలోని మాణిక్యాంబ సన్నిధిలో మంత్రి వేణు వేపాలకృష్ణ కొబ్బరికాయలు కొట్టారు. 

► తిరుపతిలోని శ్రీతాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, మేయర్‌ డాక్టర్‌ శిరీష, డెప్యూటీ మేయర్‌ భూమన అభినయ్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 


అనంతలో మల్లాలమ్మ ఆలయం వద్ద  టెంకాయ కొడుతున్న ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి

► కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం గూళ్యం గ్రామంలోని గాదిలింగేశ్వరస్వామికి కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం 101 కొబ్బరి కాయలు కొట్టారు. కర్నూలు వినాయక ఘాట్‌లో కర్నూలు, నంద్యాల ఎంపీలు సంజీవ్‌కుమార్, పోచా బ్రహ్మానందరెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు పూజలు నిర్వహించారు. వికేంద్రీకరణకు మద్దతుగా నంద్యాల జిల్లా అయ్యలూరు మసీదులో ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా ప్రార్థనలు చేశారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top