
దైవదర్శనానికి వెళ్లి వస్తూ మృత్యుఒడికి
దంపతుల మృతితో విషాదం
కుప్పిగానిపల్లెలో విషాదఛాయలు
ఆ దంపతులు అన్యోన్యంగా ఉన్నారు. వివాహమైన ఎనిమిదేళ్లకు కవల పిల్లలు జన్మించారు. భర్త ఆర్మీలో ఉద్యోగ విరమణ పొందాడు. ప్రస్తుతం ప్రైవేటు గన్మెన్గా చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఈ క్రమంలో తమ కలల రూపాలైన కవలలను ఉన్నతంగా చదివించాలని ఆరాట పడ్డారు. ఈ నేపథ్యంలో సొంతూరి నుంచి చిత్తూరుకు మకాం మార్చారు. ఆ దంపతులు పిల్లల భవిష్యత్తుపై ఎన్నో కలలుకన్నారు. కానీ ఆ కలలను దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం చిదిమేసింది. దంపతులిద్దరినీ మృత్యువు కబళించింది. ఈ ప్రమాదంలో కుమారుడు, కుమార్తె గాయపడి స్పృహ కోల్పోయారు. గాయపడిన ఆ కుటుంబ ఆశాదీపాలను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లిదండ్రులకు ఏం జరిగింది.. ఎలా ఉన్నారో..ఎక్కడ ఉన్నారో ఆ పసి హృదయాలకు పాపం తెలియదు.
చిత్తూరు: గుడిపాల మండలంలోని కుప్పిగానిపల్లె గ్రామానికి చెందిన మాజీ సైనికుడు సిద్దయ్య(47), అతడి భార్య జ్యోతిలక్ష్మి (43) మృతి చెందగా, కొడుకు, కుమార్తె గాయపడ్డారు. దీంతో కుప్పిగానిపల్లె గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తన పుట్టినరోజు సందర్భంగా తిరుమల దైవదర్శనానికి కుటుంబంతో కలిసి వెళ్లి వస్తుండగా పనపాకం సమీపంలోని గడ్డకిందపల్లె వద్ద ఆవును తప్పించబోయి డివైడర్ను ఢీకొని అక్కడికక్కడే దంపతులు మృతి చెందారు. దంపతుల ఇద్దరిదీ కుప్పిగానిపల్లె గ్రామమే. వీరికి ఇద్దరు కవల పిల్లలు. పిల్లల చదువు కోసం చిత్తూరులో నివాసం ఉంటున్నారు. గిరి(13), గాయత్రి(13) బివిరెడ్డి ప్రైవేట్ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నారు.
తండ్రి అడుగుజాడలోనే ఆర్మీలో చేరి..
కుప్పిగానిపల్లె గ్రామానికి చెందిన నాగరత్నం, సరస్వతీలకు 1978లో సిద్దయ్య జన్మించాడు. నాగర త్నం ఆర్మీలో పనిచేసి రిటైర్డ్ అయ్యి టీటీడీలో పనిచే శాడు. నాగరత్నం చొరవతో కుమారుడు సిద్దయ్య 1998లో ఆర్మీలో ఉద్యోగం చేస్తూ కుప్పిగానిపల్లె గ్రామానికి చెందిన నరసింహులు, జగద కుమార్తె జ్యోతి లక్ష్మిని 2002లో వివాహం చేసుకున్నాడు. వీరికి సుమారు ఎనిమిదేళ్ల వరకు పిల్లలు కలగలేదు. అనంతరం ఇద్దరు కవల పిల్లలు జన్మించారు.
పిల్లలను ఉన్నతంగా చదివించాలని..
పిల్లలు జన్మించిన అయిదు సంవత్సరాలకు వారి చదువు కోసం చిత్తూరులో కాపురం పెట్టారు. సిద్దయ్య 2020 సంవత్సరంలో ఆర్మీ నుంచి ఉద్యోగ విరమణ పొందారు.ఈక్రమంలో చిత్తూరులోని ప్రైవేట్ పాఠశాలలో చదివించుకుంటూ సాఫీగా జీవనం సాగిస్తున్నారు.
పుట్టిన రోజే మృత్యుఒడిలోకి
సిద్దయ్య పుట్టిన రోజుకి ఎప్పుడూ తిరుమల దైవద ర్శనానికి వెళ్లేవాడు. ఈ నేపథ్యంలో ఆదివారం తిరు మలలో స్వామిని దర్శించుకొని పిల్లలు, భార్యతో కలిసి కారులో తిరిగి వస్తున్న నేపథ్యంలో వారిని మృత్యువు వెంటాడడంతో దంపతులు మృత్యుఒడికి చేరుకోగా పిల్లలు తిరుపతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మాజీ సైనికుడిగా ఉన్న సిద్దయ్య ప్రస్తుతం చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి కుమారుడు చెవిరెడ్డి మోహిత్రెడ్డికి ప్రైవేట్ గన్మెన్గా ఉంటున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మోహిత్రెడ్డి తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి వెళ్లి మెరుగైన వైద్యం అందించాలని కోరారు.