సాయికృష్ణ లాకప్డెత్ కేసులో నిజాన్ని వెలికి తీయండి
9 నుంచి 16 వరకు నిష్పక్షపాతంగా, శాస్త్రీయంగా విచారణ జరపండి
ప్రత్యేక దర్యాప్తు బృందానికి హైకోర్టు ఆదేశం
సీఐ నాగరాజు పోలీస్ కస్టడీపై విజయవాడ కోర్టు షరతులకు పాక్షిక సవరణ
సాక్షి, అమరావతి : దేశ జాతీయ నినాదమైన ‘సత్యమేవ జయతే’ సమగ్రతను కాపాడుతూ నిజాన్ని వెలికి తీసేందుకు కాపు యువకుడు గాదె సాయికృష్ణ లాకప్డెత్ కేసును నిష్పక్షపాతంగా, శాస్త్రీయ పద్ధతిలో విచారించాలని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులను హైకోర్టు ఆదేశించింది. సాయికృష్ణ లాకప్డెత్ కేసులో ప్రధాన నిందితుడు నాగరాజును రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో విచారించాలంటూ విజయవాడ రెండో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు విధించిన షరతులను హైకోర్టు పాక్షికంగా సవరించింది.
సాక్ష్యాధారాల సేకరణ, సీన్ రీకన్స్ట్రక్షన్ నిమిత్తం నాగరాజును రాజమహేంద్రవరం జైలు నుంచి కృష్ణలంక పోలీస్స్టేషన్తో సహా నేర ఘటనలు జరిగిన చోట్లకు తీసుకెళ్లేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)కు హైకోర్టు అనుమతినిచ్చింది. ఈ నెల 9వ తేదీ నుంచి నాగరాజును కస్టడీలోకి తీసుకుని ఈ నెల 16 వరకు విచారించాలని సిట్ను ఆదేశించింది. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుండి విజయవాడకు, తిరిగి విజయవాడ నుంచి రాజమహేంద్రవరం జైలుకు నాగరాజును తరలించే సమయంలో అతని ప్రతి కదలికను తప్పనిసరిగా వీడియో రికార్డింగ్ చేయాలని సిట్ను ఆదేశించింది.
ఆ ఒరిజినల్ వీడియో రికార్డింగ్లను ఈ నెల 17న విజయవాడ మేజిస్ట్రేట్ కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. కస్టడీ సమయంలో నమోదైన సీసీటీవీ ఫుటేజీని ఒరిజినల్ రూపంలో 17న విజయవాడ మేజిస్ట్రేట్ కోర్టుకు సమర్పించాలని రాజమహేంద్రవరం జైలు సూపరింటెండెంట్కు తేల్చి చెప్పింది. కస్టడీ కాలంలో నాగరాజు ప్రాణానికి, శారీరక భద్రతకు, వ్యక్తిగత గౌరవానికి భంగం కలగకుండా రాజ్యాంగ నిబంధనల ప్రకారం అన్ని చర్యలు తీసుకోవాలని సిట్ అధికారులకు స్పష్టం చేసింది. సీఐ కస్టడీ విషయంలో విజయవాడ మేజిస్ట్రేట్ కోర్టు విధించిన మిగతా అన్ని షరతులు యథాతథంగా కొనసాగుతాయని న్యాయమూర్తి జస్టిస్ కుంచం మహేశ్వరరావు మంగళవారం తీర్పుచెప్పారు.
జైలులోనే విచారించాలన్న విజయవాడ కోర్టు
సాయికృష్ణ లాకప్డెత్ కేసులో నిందితుడు నాగరాజును పోలీస్ కస్టడీకి కోరుతూ సిట్ అధికారులు దాఖలు చేసిన పిటిషన్ను విజయవాడ రెండో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు ఇటీవల అనుమతించింది. ఈ నెల 10 వరకు నాగరాజును పోలీసు కస్టడీకి ఇచ్చింది. రాజమహేంద్రవరం జైలులోనే నాగరాజును విచారించాలని, విచారణకు న్యాయవాదిని అనుమతించాలని సిట్ అధికారులను ఆదేశించింది. వీటితో పాటు పలు షరతులు విధించింది. పారదర్శకత, నిష్పాక్షికత, జవాబుదారీతనం నిమిత్తం మొత్తం విచారణ జైలు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు లేదా ఇతర వీడియో రికార్డింగ్ సిస్టం ఉన్న ప్రాంతంలోనే నాగరాజును విచారించాలని సిట్కు స్పష్టం చేసింది.
పోలీస్ కస్టడీ సమయంలో జైలు ప్రాంగణంలో రికార్డ్ చేసిన సీసీటీవీ ఫుటేజీని కోర్టు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు భద్రపరచాలని, దానిని తొలగించడానికి, ఓవర్ రైట్ చేయడానికి లేదా ట్యాంపరింగ్ చేయడానికి ఎవరినీ అనుమతించకూడదని జైలు సూపరింటెండెంట్ను ఆదేశించింది. నాగరాజు భద్రతకు దర్యాప్తు ఆఫీసర్, అదనపు ఎస్పీ, సిట్ సభ్యులు, జైలు సూపరింటెండెంట్ సంయుక్తంగా, వ్యక్తిగతంగా బాధ్యత వహించాలని పేర్కొంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పోలీస్ కస్టడీని 10వ తేదీ తర్వాత పొడిగించబోమని స్పష్టం చేసింది. విజయవాడ కోర్టు విధించిన ఈ షరతులను, ఆదేశాలను సిట్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ గతవారం హైకోర్టులో అత్యవసరంగా పిటిషన్ దాఖలు చేసింది.
నాగరాజును కృష్ణలంక పోలీస్స్టేషన్లో విచారించేందుకు అనుమతించాలని కోరింది. ఈ వ్యాజ్యంపై సోమవారం సిట్ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) మెండ లక్ష్మీనారాయణ, నాగరాజు తరఫున చల్లా అజయ్ కుమార్ వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ మహేశ్వరరావు తీర్పును రిజర్వ్ చేసి మంగళవారం నిర్ణయం వెలువరిస్తానని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇందుకు అనుగుణంగా ఆయన మంగళవారం తన తీర్పును వెలువరించారు.
అప్పుడు ధ్వంసం చేసి.. ఇప్పుడు సీసీటీవీ కెమెరాల రక్షణ కోరతారా?
‘నిందితుడు నాగరాజు విజయవాడ కృష్ణలంక మాజీ ఇన్స్పెక్టర్. అతనిపై హత్య, సాక్ష్యాల నాశనం కింద తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. సాయికృష్ణ మృతదేహం ఇంకా లభ్యం కాలేదు. అక్రమ కస్టడీలో హత్య జరిగినట్లు భావిస్తున్న కాలానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ, హార్డ్ డిస్క్ను ఉద్దేశ పూర్వకంగా మాయం చేశారన్న తీవ్రమైన ఆరోపణలు నాగరాజుపై ఉన్నాయి. ఇటువంటి తరుణంలో, కేవలం రాజమహేంద్రవరం జైలులోనే నాగరాజును విచారించాలనడం దర్యాప్తు సంస్థల చట్టబద్ధమైన అధికారాలకు అడ్డుకట్ట వేయడమే అవుతుంది.
నిందితుడు ఒకప్పుడు తానే సీసీటీవీ కెమెరాలను మాయం చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటూ, ఇప్పుడు తన విచారణకు అవే సీసీటీవీ కెమెరాల రక్షణ కావాలని కోరడం పరస్పర విరుద్ధంగా ఉంది. రాజ్యాంగ బద్ధమైన ఈ కోర్టు, నిందితుడి హక్కులను కాపాడటంతో పాటు దర్యాప్తు సంస్థల అధికారాలను కూడా సమతుల్యం చేయాల్సి ఉంది. అందువల్ల విజయవాడ రెండో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు విధించిన షరతులను పాక్షికంగా సవరిస్తున్నాం’ అని జస్టిస్ మహేశ్వరరావు తన తీర్పులో పేర్కొన్నారు.


