
అభిప్రాయ సేకరణలో రైతుల స్పష్టీకరణ
‘‘మా ప్రాణాలైనా వదులుకుంటాం గానీ భూములు ఇచ్చేది లేదు’’ అంటూ చిత్తూరు జిల్లా కుప్పంలో ‘విమానాశ్రయం నిర్మాణ భూ సేకరణకు సంబంధించిన అంశంతో సంబంధమున్న’ రైతులు తేల్చి చెప్పారు. జాయింట్ కలెక్టర్ (జేసీ) విద్యాధరి, స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ వెంకట్సాయి తదితర అధికారులు గురువారం శాంతిపురం మండల కేంద్రంలో ప్రతిపాదిత విమానాశ్రయ నిర్మాణం కోసం ఉద్దేశించిన మూడు (దండికుప్పుం, తర్టీసొన్నేగానిపల్లి, అమ్మవారిపేట) రెవెన్యూ గ్రామాల ప్రజల అభిప్రాయాలను సేకరించారు.
ఈ సందర్భంగా 23 మందిలో 17 మంది రైతులు తమ భూములు ఇచ్చేందుకు విముఖత వ్యక్తం చేశారు. భూములు ఇవ్వాలని అధికారులు తమను వేధిస్తున్నారని, బెదిరిస్తున్నారని జేసీ దృష్టికి తెచ్చారు. – శాంతిపురం
వివిధ గ్రామాల రైతుల అభిప్రాయాలు వారి మాటల్లోనే..
వేధిస్తున్నారు..
మర్యాదగా భూమి ఇస్తే ఎకరాకు రూ 16 లక్షల పరిహారం ఇస్తామని, కోర్టుకు పోతే రూ.10 లక్షలు మాత్రమే ఇస్తామని ఒత్తిడి చేస్తున్నారు. మాకు ఉన్న 85 సెంట్లలో వ్యవసాయం, పశుపోషణతో ముగ్గురు ఆడబిడ్డలను చదివిస్తున్నాం. ప్రాణం పోయినా భూములు ఇవ్వం. మమ్మల్ని వదిలేయండి. – పద్మమ్మ, సిద్దారెడ్లపల్లి
ఎలా బతకాలి?
మా అన్నదమ్ముల రెండు కుటుంబాలకు ఉన్న ఏడు ఎకరాలను పూర్తిగా విమానాశ్రయానికి ఇచ్చి ఎలా బతకాలి. భూములు ఇవ్వటానికి మాతోసహా రైతులు ఎవరూ సిద్ధంగా లేరు. – కుమార్, సిద్దారెడ్లపల్లి
ఇచ్చేదే లేదు..
ఏమి చేసినా, ఎంత పరిహారం ఇచ్చినా భూములు ఇచ్చేది లేదు. – వెంకటేష్, దండికుప్పం
కూలీలుగా వలస పోవాలా?
ఉన్న భూములను పోగొట్టుకుని రైతులు వలస కూలీలుగా వెళ్లాల్సిందేనా? వ్యవసాయంపై ఆధారపడ్డ మా కుటుంబంలోని 11 మంది భూములను కోల్పోయి బతకలేము. రెక్కల కష్టాన్ని నమ్ముకుని బతికే మేము ప్రభుత్వం నుంచి ఏమీ కోరుకోవటం లేదు. – జయప్పగౌడు, సిద్దారెడ్లపల్లి
ఎక్కడికి వెళ్లాలి..?
వ్యవసాయం, మామిడి తోటలతో కుటుంబాన్ని లాక్కొస్తూ కొడుకును చదివిస్తున్నా మా భూమిని వదిలి ఎక్కడికి వెళ్లాలి. ప్రభుత్వం డబ్బుల రూపంలో ఇచ్చే పరిహారం ఖర్చయిపోతే, లేదా పిల్లలు లాక్కుంటే తల్లిదండ్రులు దిక్కులేని వారిగా మారతారు. – లక్ష్మి, దండికుప్పం