
సాక్షి, విజయవాడ: జిల్లా జైలులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. జిల్లా జైలు అధికారులు.. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వంశీని తరలించారు. వాంతులు, విరోచనాలు, డీ హైడ్రేషన్తో వంశీ బాధ పడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వంశీకి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. వంశీ ఆరోగ్య విషయమై ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. ఆయన గత నెలలో కూడా తీవ్ర అస్వస్థత గురయ్యారు. ఆయుష్ ఆసుపత్రిలో వల్లభనేని వంశీకి చికిత్స అందించిన ఆయుష్ ఆస్పత్రి వైద్యులు పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, కార్డియాలజీకి సంబంధించిన టెస్టులు చేశారు. పలు రక్త పరీక్షలతో స్లీప్ మానిటరింగ్ టెస్ట్, ఎమ్మారై నిర్వహించారు. అయితే, ఆయుష్ ఆసుపత్రి వైద్యులు నిర్వహించిన టెస్టుల్లో వంశీ ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వల్ల నీరు చేరినట్లు నిర్థారించారు.
ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వల్ల వంశీ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించారు. ఆస్పత్రిలో చికిత్స పొందిన వల్లభనేని వంశీ ఆస్పత్రి నుంచి సోమవారం (జూన్2న) డిశ్చార్జ్ అయ్యారు. అనంతరం వంశీని పోలీసులు జిల్లా జైలుకు తరలించారు.
కాగా, వల్లభనేని వంశీకి వైద్య సాయం అందకుండా ఇబ్బందులు పెడుతున్న పోలీసులకు, జైలు అధికారులకు హైకోర్టు గట్టి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. వంశీకి ప్రభుత్వ ఆసుపత్రిలో కాకుండా విజయవాడ ఆయుష్ ఆసుపత్రిలో వైద్య సాయం అందించాలని స్పష్టం చేసింది. వంశీ ఆరోగ్య పరిస్థితిపై పూర్తిస్థాయి నివేదిక తమకు ఇవ్వాలని ఆయుష్ ఆసుపత్రి డైరెక్టర్ను హైకోర్టు ఆదేశించింది.