
కొందరి నిర్ణయాన్ని విజయవాడ పోలీసులు అమలు చేశారు
రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న అసలైన నిందితుడు ఎక్కడ?
ఈ కేసు కల్పితమనడానికి ఇదే నిదర్శనం
వంశీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే బెయిలివ్వండి
బెయిల్ పిటిషన్లో న్యాయస్థానానికి వివరించిన న్యాయవాది
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ‘గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ను అరెస్ట్ ముందస్తు వ్యూహమే. ఆయన్ని∙అరెస్టు చేయాలని, జైల్లో పెట్టాలని ముందుగానే కొందరు తీసుకున్న నిర్ణయాన్ని విజయవాడ పోలీసులు అమలు చేశారు. వంశీపై ఫిర్యాదు చేసిన వ్యక్తిని, ఫిర్యాదులో పేర్కొన్న అంశాలపై విచారణ చేయకుండానే కేసులు పెట్టారు. ఇదంతా ఆయన్ని ఉద్దేశపూర్వకంగా కేసుల్లో ఇరికించేందుకు పన్నిన కుట్ర మాత్రమే.
వీటన్నింటినీ పరిశీలించి బెయిల్ మంజూరు చేయండి’ అని వంశీ తరపున దాఖలు చేసిన బెయిల్పిటిషన్లో న్యాయవాది తానికొండ చిరంజీవి కోరారు. ‘రెండేళ్ల క్రితం గన్నవరంలో జరిగిన ఓ ఘటనపై సత్యవర్ధన్ అనే వ్యక్తి వల్లభనేని వంశీమోహన్, మరికొందరిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన ఫిర్యాదును ఈ నెల పదో తేదీన న్యాయమూర్తి ఎదుట వాపసు తీసుకున్నాడు. అతన్ని వంశీ బెదిరించి ఫిర్యాదును ఉపసంహరించుకునేలా చేశాడంటూ అతని సోదరుడు కిరణ్ ఈ నెల 12న పటమట పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఫిర్యాదు చేసిన కిరణ్ను, బాధితుడిగా అందులో పేర్కొన్న సత్యవర్ధన్ను విచారించకుండానే అదే రోజు హడావుడిగా కిడ్నాప్, ఎక్స్ట్రాక్షన్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయడం విజయవాడ పోలీసులకే చెల్లింది. అదే రోజు (12వ తేదీ) రాత్రే విజయవాడ పోలీసులు హైదరాబాద్ చేరుకున్నారు. వంశీ ఇంటి వద్ద రాత్రంతా పహారా కాసి 13వ తేదీ తెల్లవారుజామునే బెడ్రూంలో ఉన్న ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. మధ్యాహ్నం విజయవాడ భవానిపురం పోలీస్ స్టేషన్కు తెచ్చారు. అక్కడి నుంచి కృష్ణలంక పోలీసు స్టేషన్కు తీసుకొచ్చి రాత్రి 9 గంటల వరకు విచారణ పేరుతో కూర్చోబెట్టారు. ఆ తరువాత న్యాయస్థానంలో హాజరుపర్చారు. ఇదంతా కొందరు పెద్దల మెప్పు కోసం పోలీసులు పడిన ఆరాటం మాత్రమే.
పోలీసుల అభియోగంలో ఎలాంటి వాస్తవం లేదు. సత్యవర్థన్తో పోలీసులు బలవంతంగా సెకండ్ ఏసీఎంఎం కోర్టులో వాంగ్మూలం చెప్పించినట్లు అనుమానాలు ఉన్నాయి. సత్యవర్ధన్ను బెదిరించేందుకు వంశీ, అతని అనుచరులు ఓ వ్యక్తిని పురమాయించినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. అదే నిజమైతే అసలైన ఆ నిందితుడు ఎక్కడున్నాడు? ఈ కేసు పూర్తిగా కల్పితమనడానికి ఇదే నిదర్శనం. కొన్నేళ్లుగా వంశీ అనారోగ్యంతో, టెయిల్ బోన్ గాయంతో బాధపడుతున్నారు.
కరోనా సమయం నుంచి బ్రీతింగ్ సమస్యలు ఉన్నాయి. నేలపై కూర్చోవడం, పడుకోవడానికి కష్టంగా ఉంటుంది. అందువల్ల ఆయనకు వెంటనే బెయిల్ ఇవ్వండి’ అని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ఈలోగా ఆయనకు టాయిలెట్, బెడ్, ఇంటి నుంచి ఆహారం, మందుల సౌకర్యం కల్పించాలని కోరారు. జైల్లోని బ్యారక్లో వంశీని ఒంటరిగా ఉంచి మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని, రూమ్లో అసిస్టెంట్ను ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
పది రోజుల కస్టడీ కోరుతూ పోలీసుల పిటిషన్
జ్యుడిíÙయల్ రిమాండ్లో ఉన్న వల్లభనేని వంశీమోహన్ను తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ విజయవాడ పోలీసులు కోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో వంశీ, అతని అనుచరుల నుంచి మరిన్ని వివరాలను రాబట్టాల్సి ఉందని, పది రోజులు కస్టడీకి అప్పగించాలని ఆ పిటిషన్లో పేర్కొన్నారు.