
గత ఏడాది టీడీపీ కూటమి ప్రభుత్వం ఎగ్గొట్టిన పెట్టుబడి సాయం రూ.10,717 కోట్లు
ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా ఆ ఊసేలేదు
గడిచిన సీజన్కు సంబంధించి అందని పంట నష్టపరిహారం..
రూ.1,000 కోట్లకు పైగా ధాన్యం బకాయిలూ చెల్లించలేదు
అదునుకు సబ్సిడీ విత్తనం అందక అన్నదాతల అగచాట్లు
పూర్తిగా అటకెక్కిన ఉచిత పంటల బీమా పథకం
ఉసూరుమంటూ ఖరీఫ్ సాగుకు రైతుల శ్రీకారం
సాక్షి, అమరావతి: ఏరువాక పౌర్ణమి.. మరోపేరు జ్యేష్ట పౌర్ణమి.. ఇది తెలుగు రైతుల పండుగ. తొలకరి పంట సాగుకు సన్నద్ధమయ్యే సందర్భంగా రైతులు సంప్రదాయబద్ధంగా ఉత్సాహంగా జరుపుకునే వేడుక.. కాడెద్దులను సిద్ధంచేసి వ్యవసాయ పరికరాలను అలంకరించుకుని పూజలుచేసి సాగును ఆరంభిస్తారు. అలాంటి సంప్రదాయ పండుగ వాతావరణం ఈ ఏడాది రైతుల లోగిళ్లలో ఎక్కడా కన్పించడంలేదు. గడిచిన ఏడాదిగా టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్య ధోరణి రాష్ట్రంలోని రైతులందరి పాలిట శాపంగా మారింది. ప్రభుత్వ నిర్వాకంవల్ల సాగుభారంగా మారడంతో రైతులు తొలకరి సాగుకు ఉసూరుమంటూ బుధవారం ఏరువాకకు శ్రీకారం చుట్టారు.
పెట్టుబడి సాయం లేకుండా ఏరువాక ఎలా?
తాము అధికారంలోకి వస్తే ఏటా ప్రతీ రైతు కుటుంబానికి రూ.20వేల చొప్పున అన్నదాత సుఖీభవ పథకం కింద పెట్టుబడి సాయం అందిస్తామని టీడీపీ కూటమి ఎన్నికల్లో ఊదరగొట్టింది. ఎన్నికల్లో గెలిచాక 2024–25 సీజన్కు ఇవ్వాల్సిన రూ.10,717 కోట్ల పెట్టుబడి సాయాన్ని ఎగ్గొట్టింది. కనీసం ఈ ఏడాదైనా సీజన్కు ముందు ఇస్తుందేమోనని రైతులంతా ఆశగా ఎదురుచూసారు.
కానీ, ఇప్పటివరకు ఆ ఊసేలేదు. ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు కూడా ఇప్పటివరకూ జారీచేయలేదు. మరోపక్క.. గడిచిన ఖరీఫ్, రబీ సీజన్లలో వరదలు, అకాల వర్షాలు, కరువు ప్రభావంతో పంటలు నష్టపోయిన దాదాపు ఏడు లక్షల మంది రైతులకు రూ.850 కోట్లకు పైగా పంట నష్టపరిహారం సీజన్ ముగిసినా చెల్లించలేదు.
రూ.వెయ్యి కోట్లకు పైగా ధాన్యం బకాయిలు
ఇక 48 గంటల్లోనే.. కాదు కాదు 24 గంటల్లోనే ధాన్యం సొమ్ములు జమచేస్తున్నామంటూ గొప్పలు చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం.. గడిచిన రబీ సీజన్కు సంబం«ధించి పేరుకుపోయిన రూ.1,000 కోట్ల బకాయిల చెల్లింపు ఊసెత్తడం లేదు. అలాగే, 2023–24 సీజన్కు సంబంధించి ప్రీమియం బకాయిలు రూ.930 కోట్లు చెల్లించకుండా ఎగ్గొట్టడం వల్ల రైతులకు రూ.1,385 కోట్ల పంటల బీమా పరిహారం అందకుండాపోయింది.
కనీసం ఖరీఫ్–2024 సీజన్కు సంబంధించిన పంటల బీమా ప్రీమియం మొత్తం రూ.838 కోట్లు చెల్లించి ఉంటే బీమా పరిహారమైనా ఈపాటికి చేతికొచ్చేది. ఇలా దాదాపు రూ.25 వేల కోట్లకు పైగా రైతులకు అందాల్సిన సాయం జమకాకుండా టీడీపీ కూటమి ప్రభుత్వం మోకాలడ్డింది. పైగా.. రబీ సీజన్ నుంచి ఉచిత పంటల బీమా పథకాన్ని రద్దుచేసింది.
స్వచ్ఛంద బీమా నమోదు చేయాలని చెప్పడంతో ఆ భారం భరించలేక రైతులెవరూ రబీలో నమోదు చేసుకోలేదు. మరోపక్క.. ధాన్యం, పత్తి, మిరప, పొగాకు, టమాటా ఇలా ఏ ఒక్క పంటకూ మద్దతు ధర దక్కక రైతన్నలు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ప్రభుత్వ నిర్వాకంవల్ల రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. కనీసం అదునుకైనా విత్తనం అందించారా అంటే అదీ లేదు.
విత్తనం అందక అగచాట్లు
ఇదిలా ఉంటే.. గత సీజన్ నుంచే నాన్ సబ్సిడీ విత్తన సరఫరాకు మంగళం పాడేశారు. 6.32 లక్షల క్వింటాళ్ల సబ్సిడీ విత్తనం అవసరం కాగా.. నిధులలేమి సాకుతో 5.38 లక్షల క్వింటాళ్లకు పరిమితం చేశారు. వేరుశనగ విత్తనం 30 శాతానికి కుదించారు. కనీసం ఆ విత్తనమైనా సీజన్కు ముందు అందుబాటులో ఉంచారా అంటే అదీలేదు. ఇప్పటివరకు కనీసం 30 శాతం విత్తనాన్ని కూడా పొజిషన్ చేసిన పాపాన పోలేదు.
రైతు సేవా కేంద్రాల్లో సబ్సిడీ విత్తనమే కాదు.. ఎరువులూ కానరావడంలేదు. అయినాసరే, ఏరువాక పౌర్ణమిని పండుగ వాతావరణంలో చేసుకోవాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయడం విస్మయానికి గురిచేస్తోంది. రైతులు చేసుకోవాల్సిన ఈ పండుగను అంతా బాగుందంటూ వారిని ఏమార్చి మంత్రులు, ఎమ్మెల్యేల సమక్షంలో కూటమి కార్యకర్తలు హంగామా చేశారు.