విశాఖ రైల్వే జోన్‌కు కేంద్ర కేబినెట్‌ ఆమోదం | Union Cabinet approves Visakhapatnam Railway Zone | Sakshi
Sakshi News home page

విశాఖ రైల్వే జోన్‌కు కేంద్ర కేబినెట్‌ ఆమోదం

Feb 8 2025 4:42 AM | Updated on Feb 8 2025 4:43 AM

Union Cabinet approves Visakhapatnam Railway Zone

‘పోస్ట్‌ ఫ్యాక్టో ఆమోదం’ తెలిపిన కేబినెట్‌

వాల్తేర్‌ డివిజన్‌ పేరు విశాఖ డివిజన్‌గా మార్పు 

ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే జోన్‌లో కొత్తగా రాయగడ డివిజన్‌ ఏర్పాటు 

వెల్లడించిన కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌

సాక్షి, న్యూఢిల్లీ : విశాఖపట్నం కేంద్రంగా సౌత్‌ కోస్ట్‌ రైల్వ్‌ జోన్‌(South Coast Railway Zone) ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం పోస్ట్‌ ఫ్యాక్టో (అప్పటికే మొదలుపెట్టిన పనికి) అమోదం తెలిపింది. ప్రధాని మోదీ(Narendra Modi) అధ్యక్షతన శుక్ర­వారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం–2014 ప్రకారం విశాఖ కేంద్రంగా సౌత్‌ కోస్ట్‌ రైల్వే జోన్‌పై చర్చించి ఆమోదం తెలిపారు. వాల్తేర్‌ డివిజన్‌ పేరును విశాఖపట్నం రైల్వే డివిజన్‌గా మార్చేందుకు కూడా కేంద్ర కేబినెట్‌(Union Cabinet) ఆమోదం తెలి­పింది. 

గతంలో కుదించిన వాల్తేర్‌ డివిజ­న్‌ను కొనసా­గించడం ద్వారా విశాఖ­పట్నం(Visakhapatnam ) వద్ద ప్రతి­పాదిత సౌత్‌ కోస్ట్‌ రైల్వే జోన్‌ డివిజ­నల్‌ అధికార పరిధిని సవరించినట్లు మంత్రివర్గ సమా­వేశం అనంతరం కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ మీడియాకు తెలిపారు. వాల్తేర్‌ డివిజ­న్‌లో భాగమైన పలాస–విశాఖపట్నం– దువ్వాడ, కూనేరు – విజయ­నగరం, నౌపాడ జంక్షన్‌ – పర్లాకి­మిడి, బొబ్బిలి జంక్షన్‌– సాలూరు, సింహాచలం నార్త్‌ –­దువ్వాడ బైపాస్, వడ్లపూడి – దువ్వాడ,  విశాఖ­ స్టీల్‌ ప్లాంట్‌ – జగ్గయ­పాలెం (సుమారు 410 కి.మీ) విభాగాలు సౌత్‌ కోస్ట్‌ రైల్వే కింద విశాఖ డివిజన్‌లో కొనసాగుతాయి. 

ఇప్పటి­వరకు వాల్తేర్‌ డివిజన్‌లో భాగమైన కొత్తవలస – బచేలి, కూనేరు – తేరువలి జంక్షన్, సింగాపుర్‌ రోడ్‌– కోరాపుట్, పర్లాకిమిడి – ఘన్‌పూర్‌ (సుమారు 680 కి.మీ) విభా­గాలు ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే పరిధిలో రాయగడ ప్రధాన కేంద్రంగా ఏర్పడుతున్న రాయ­గడ డివిజన్‌లో ఉంటాయి.

Advertisement
 
Advertisement
Advertisement