తుని రూరల్: చిన్నారి అడుగుజాడలు ఇంకా చిక్కలేదు.. తొమ్మిది రోజులైనా ఎటువంటి ఆధారాలు లభించలేదు.. కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ చిక్కుళ్ల అగ్రహారం గ్రామానికి చెందిన రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి ఆచూకీ దొరకలేదు. ప్రభుత్వ ఆదేశాలతో ఆదివారం ఎన్డీఆర్ఎఫ్, ఫారెస్ట్ రాఫిడ్ రెస్పాన్స్ అండ్ రెస్క్యూ టీమ్, ఎస్డీఆర్ఎఫ్, సబ్ డివిజన్ పోలీసు బృందాల సభ్యులు విస్తృతంగా గాలింపు చేపట్టారు. అత్యాధునిక థర్మల్ డ్రోన్లతో అణువణువూ పరిశీలించారు.
అడవి జంతువులు సమీప చెరువులు, కుంటల వద్దకు తాగునీటికి వచ్చినప్పుడు దాడి జరిగిందా అనే కోణంలోనూ దర్యాప్తు చేశారు. అయితే అలాంటి జాడలేమీ కనిపించలేదని అధికారులు పేర్కొన్నారు. దట్టమైన అటవీ ప్రాంతం కాదని, చిట్టడవి కావడంతో క్రూర మృగాలు సంచరించే అవకాశం లేదన్నారు. అడవి, ముళ్ల పందులు, కొండ చిలువలు, ప్రమాదకర పాములు సంచరించే అవకాశం ఉందన్నారు. ఇప్పటి వరకూ ఈ ప్రాంతంలో అడవి జంతువులతో ఎటువంటి నష్టం జరగలేదన్నారు. అడవిలో తప్పిపోవడం, అడవి జంతువుల వల్ల చిన్నారికి ప్రమాదం జరిగిన ఆనవాళ్లు లభించలేదన్నారు.
వేర్వేరుగా నియమించిన వివిధ బృందాలు పలు కోణాల్లో ముమ్మరంగా దర్యాప్తు కొనసాగిస్తున్నాయి. దారితప్పిన జ్ఞానేశ్వరిని కంచె వద్ద చూసిన వ్యక్తి నేరుగా తమకు చెప్పకుండా గ్రామానికి వెళ్లి విషయం చెప్పడంపై చిన్నారి తల్లి సుంకర భవానీ అనుమానం వ్యక్తం చేశారు. ఎక్కడ ఉన్నా తమ బిడ్డ ఇంటికి చేరుతుందన్న నమ్మకంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఉన్నారు. తల్లి అనుమానం, అటవీశాఖ అధికారుల అంచనాల ప్రకారం జ్ఞానేశ్వరి అడవిలో తప్పిపోలేదని, ఎవరో అపహరించి ఉంటారని భావిస్తున్నారు.
కుక్క కళేబరానికి పోస్టుమార్టం
చిన్నారి జ్ఞానేశ్వరితో పాటు అదృశ్యమై మూడు రోజుల తర్వాత ఇంటికి చేరిన పెంపుడు కుక్క శనివారం మధ్యాహ్నం మృతి చెందిన విషయం తెలిసిందే. కుక్క కళేబరాన్ని ఎన్.సూరవరం వెటర్నరీ ఆస్పత్రికి తరలించి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. మృతికి కారణాలపై దర్యాప్తు చేస్తున్న అధికారులు నమూనాలు సేకరించి విశాఖపట్నంలో ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. ల్యాబ్ నివేదికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.


