ఈనెల ఒకటోతేదీన ఆలయంలో దర్శనం కోసం వచ్చిన నిందితులు(సీసీ ఫుటేజీ చిత్రం)
అనకాపల్లి జిల్లా: ప్రముఖ పుణ్యక్షేత్రం, టీటీడీ అనుబంధ దేవాలయం ఉపమాక వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈనెల 3వ తేదీ రాత్రి హుండీలను కొల్లగొట్టి భక్తులు సమర్పించిన కానుకలను చోరీచేసిన ఇద్దరు దొంగలు దొరికారు. ఈ దుర్మార్గానికి పాల్పడింది హోంమంత్రి, స్థానిక ఎమ్మెల్యే వంగలపూడి అనితకు అత్యంత సన్నిహితులైన టీడీపీ నాయకుల కుటుంబసభ్యులని తెలుస్తోంది. ఉత్తరాంధ్రలో కోట్లాదిమంది భక్తులు తమ ఇలవేల్పుగా కొలిచే ఉపమాక వేంకటేశ్వరస్వామికి భక్తులు సమర్పించిన కానుకలను దోచుకుంది టీడీపీ కార్యకర్తలేనన్న ప్రచారం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది.
ఈ నెల 3వ తేదీ అర్ధరాత్రి ఉపమాక వేంకటేశ్వరస్వామి ఆలయంలోకి ఇద్దరు దుండగులు ప్రవేశించి ఉత్సవమూర్తులున్న గర్భాలయం ఎదురుగాగల ఆస్థాన మండపంలో ఒక హుండీ, ఆండాళ్లమ్మ సన్నిధిలో మరో హుండీని కట్టర్లతో ధ్వంసంచేసి లక్షలాది రూపాయలు దోచుకెళ్లిన సంగతి తెలిసిందే. నిందితులు స్పష్టంగా కనిపిస్తున్న సీసీ కెమెరాల ఫుటేజీలను పోలీసులు వివిధ గ్రూపుల్లో షేర్ చేసి, గ్రామాల్లో యువకులకు చూపించి ఆరా తీశారు. ఈ దురాగతానికి పాల్పడింది నక్కపల్లి మండలం రేబాక గ్రామానికి చెందిన ఇద్దరు యువకులని తేలడంతో వారిద్దరిని పోలీసులు శనివారం రాత్రి అన్నవరంలోని ఒక రిసార్ట్స్లో అదుపులోకి తీసుకుని కొంత నగదును స్వా«దీనం చేసుకున్నారు.
తరువాత వారిని రేబాక తీసుకెళ్లారు. నిందితుల్లో ఒకరి ఇంటి సమీపంలోని తుప్పల్లో దాచిన నగదుమూటను పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. పోలీసులు మొత్తం రూ.2.30 లక్షలకుపైగా స్వా«దీనం చేసుకున్నట్లు తెలిసింది. నిందితుల్లో ఒకరు హోంమంత్రి వంగలపూడి అనితకు అత్యంత సన్నిహితుడు, నియోజకవర్గ ఐటీడీపీలో కీలక నాయకుడికి సోదరుడని, మరో నిందితుడు గ్రామంలో పార్టీ సీనియర్ నాయకుడి కుమారుడని ప్రచారం జరుగుతోంది.
ఆరేళ్లలో 56 గ్రాముల బంగారమేనా?!
ఉపమాక వేంకటేశ్వరస్వామి ఆలయంలో హుండీల లెక్కింపు సమయంలో నగదును లెక్కించిన తరువాత బంగారు, వెండి ఆభరణాలు, వస్తువులను మూటగట్టి మళ్లీ హుండీలోనే ఉంచుతారు. ఆరేళ్లుగా వచ్చిన బంగారు, వెండి ఆభరణాలు, వస్తువులను కట్టిన మూటను దొంగలు ఎత్తుకెళ్లి ఆలయం వెనుక తోటలో పడేశారు. దీన్లో కేవలం 56 గ్రాముల బంగారు, 2.5 కిలోల వెండి ఆభరణాలు మాత్రమే ఉండటం అనుమానాలు కలిగిస్తోంది. ఆరేళ్లుగా భక్తులు సమర్పించిన బంగారం ఈ కొద్దిమొత్తమేనా అనే చర్చసాగుతోంది. ఈ వ్యవహారంలో టీటీడీ అధికారుల పాత్రను కూడా భక్తులు అనుమానిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తులో బంగారానికి సంబంధించిన వ్యవహారాలు కూడా బయటపడే అవకాశం ఉంది.
రెక్కీ..ఆపై చోరీ
సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలను పరిశీలిస్తే ఈ నెల ఒకటోతేదీ మధ్యాహ్నం నిందితులు యూనికార్న్ మోటారు సైకిల్పై ఆలయానికి వచ్చి ఆస్థాన మండపంలో ఉన్న హుండీ వద్ద నుంచి స్వామిని దర్శించుకుని, పరిసరాలను పరిశీలించారు. పాయకరావుపేటలో ఐరన్ కట్టర్ను కొనుగోలు చేసిన నిందితులు ఈ నెల 3వ తేదీ అర్ధరాత్రి రెండుగంటల సమయంలో ఆలయం వెనుక వైపున్న కొండపైనుంచి మామిడి చెట్టు మీదుగా ఆలయంలోకి ప్రవేశించారు.
రెండు హుండీలను ఎలక్ట్రిక్ కట్టర్లతో కట్చేసి వాటిలో ఉన్న నగదు, బంగారు, వెండి ఆభరణాలను దోచుకెళ్లారు. మార్చి నెల నుంచి ఆ రోజువరకు హుండీల్లో ఉన్న నగదుతోపాటు, ఆరేళ్లనుంచి భక్తులు స్వామికి కానుకలుగా సమరి్పంచిన బంగారు, వెండి ఆభరణాల మూటను కూడా వీరు ఎత్తుకెళ్లారు. అయితే ఈ ఆభరణాల మూటను ఆలయం వెనుక తోటలో పడేశారు. ఈ మూటలో 56 గ్రాముల బంగారు, 2.5 కిలోల వెండి ఆభరణాలున్నట్లు పోలీసులు గుర్తించారు. చోరీ జరిగినరోజు రాత్రి ఆలయానికి సమీపంలో మనబానవానిపాలెంలో జాతీయ రహదారిపై దుర్గాదేవి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా భారీగా బాణసంచా కాల్చారు.
ఈ బాణసంచా మోతల్లోనే హుండీలను కట్చేసినట్లు భావిస్తున్నారు. నిందితుల్ని పట్టుకోవడంలో డీఎస్పీ శ్రీనివాసరావు పర్యవేక్షణలో నక్కపల్లి సీఐ జె.మురళి, ఎస్ఐ సన్నిబాబు కీలకపాత్ర పోషించారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలను పోలీసులు సోమవారం విలేకరులకు తెలిపే అవకాశం ఉంది. గతంలో రేబాక గూడుపుమ్మ ఆలయం, రమణయ్యపేట, ముకుందరాజుపేట, కాగిత, ఒడ్డిమెట్ట తదితర గ్రామాల్లోని ఆలయాల్లో జరిగిన చోరీల్లో కూడా ఈ నిందితుల ప్రమేయం ఉండవచ్చని ఆయా గ్రామాల ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.


