రైల్వేట్రాక్ పక్కన సతీష్ కుమార్ మృతదేహం లభ్యం
ప్రస్తుతం జీఆర్పీ సీఐగా పనిచేస్తున్న సతీష్
టీటీడీ పరకామణి కేసులో కీలక వ్యక్తి
తాడిపత్రిటౌన్/గుంతకల్లు/అనంతపురం సెంట్రల్/ తిరుమల తిరుపతి దేవస్థానం/పత్తికొండ: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మాజీ ఏవీఎస్ఓ, ప్రస్తుత గుంతకల్లు రైల్వే పోలీస్ (జీఆర్పీ) సీఐ వై. సతీష్కుమార్ (38) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం కోమలి సమీపంలోని రైల్వేట్రాక్ పక్కన శుక్రవారం ఆయన మృతదేహం లభించింది. టీటీడీ పరకామణి కేసులో కీలక సాక్షిగా ఉన్న సతీష్ కుమార్ గుంతకల్లు నుంచి తిరుపతికి రైల్లో వెళుతూ ఇలా మృతి చెందడంపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
పరకామణి కేసులో విచారణకు వెళుతున్న ఆయను ఎవరైనా రైలు నుంచి తోసి హత్య చేశారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సతీష్ కుమార్ 2023లో టీటీడీలో ఏవీఎస్ఓగా ఉన్న సమయంలో పరకామణి ఉద్యోగి రవికుమార్ వ్యవహారాలను వెలుగులోకి తెచ్చి ఆ కేసులో కీలక సాక్షిగా మారారు. ఈ ఏడాది జూలైలో జీఆర్పీ సీఐగా గుంతకల్లుకు బదిలీ అయ్యారు. ఈయన స్వస్థలం కర్నూలు జిల్లా పత్తికొండ. గుంతకల్లుకు బదిలీపై వచి్చన తర్వాత పట్టణంలోని ఉరవకొండ రోడ్డులోని విశాల్ మార్టు సమీపంలో ఇల్లు అద్దెకు తీసుకుని కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. ఈయనకు భార్య మమత, కుమార్తె తారా (8), కుమారుడు రోహిత్(3) ఉన్నారు.
విచారణకు వెళుతూ..
పరకామణి కేసులో ఈ నెల ఆరో తేదీన తిరుపతిలో సీఐడీ విచారణకు హాజరైన సతీష్ కుమార్.. మరోసారి హాజరయ్యేందుకు గురువారం అర్ధరాత్రి 12.30 గంటలకు నిజాముద్దీన్–తిరుపతి (రాయలసీమ ఎక్స్ప్రెస్) రైల్లో టూ టైర్ ఏసీలో తిరుపతికి బయలుదేరారు. శుక్రవారం ఉదయం ఆరు గంటల సమయంలో తాడిపత్రి సమీపంలోని కోమలి గ్రామం రైల్వేట్రాక్ వద్ద ముఖం, శరీర భాగాలపై తీవ్రగాయాలతో మృతిచెందిన వ్యక్తిని గుర్తించిన రైల్వేట్రాక్ మెన్ షంషీర్ రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
రైల్వే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతుడి వివరాల కోసం ఆరా తీయగా.. గుంతకల్లు రైల్వే రిజర్వ్డు ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్గా తేలింది. దీంతో పై అధికారులకు సమాచారం చేరవేశారు. అనంతపురం రేంజ్ డీఐజీ షీమోíÙ, జిల్లా ఎస్పీ జగదీష్ , ఏఎస్పీ రోహిత్కుమార్ ఘటన స్థలానికి చేరుకుని.. మృతికి కారణాలు, ఆధారాల కోసం విచారణ చేపట్టారు. డాగ్స్కా్వడ్, ఫొరెన్సిక్ నిపుణులతో పరిశీలించారు. గుంతకల్లు రైల్వేస్టేషన్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను సైతం పరిశీలించారు. ఆయన ప్రయాణించిన బోగీలోని ప్రయాణికుల వివరాలనూ ఆరా తీస్తున్నారు. దీంతోపాటు సహచర ఉద్యోగులతో సతీష్ కుమార్ వ్యవహారశైలిపై విచారిస్తున్నట్లు సమాచారం. మృతికి కారణాలు విచారణలో తేలాల్సి ఉందని రైల్వే డీఎస్పీ శ్రీనివాసులు ఆచారి విలేకరులకు తెలిపారు. సతీష్ కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
2012 బ్యాచ్ అధికారి
కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణానికి చెందిన బ్రహ్మయ్య, చిదంబరమ్మ దంపతుల మొదటి కుమారుడు సతీష్ కుమార్. ఈయనది పేద కుటుంబం, తండ్రి మరణంతో తమ్ముడు శ్రీహరితో కలిసి కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తూ కష్టపడి చదవి పోలీసుశాఖలో ఉద్యోగం సంపాదించారు. సతీష్ కుమార్ 2012 బ్యాచ్ అధికారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పోలీసు అకాడమీలో శిక్షణ తీసుకున్న చివరి బ్యాచ్ వీరిదే. తొలిపోస్టింగ్ చిత్తూరు జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్డ్ సబ్ ఇన్స్పెక్టర్గా వచి్చంది. తర్వాత చాలా ఏళ్ల పాటు తిరుమల తిరుపతి దేవస్థానంలోనే పనిచేశారు.
2012 బ్యాచ్లో రిజర్వ్డ్ ఇన్స్పెక్టర్గా పదోన్నతి పొందిన వారిలో కూడా సతీష్కుమార్ ముందు వరుసలో ఉన్నారు. ఆయన బ్యాచ్మేట్స్ చాలా మంది ఇంకా ఆర్ఎస్ఐలుగానే ఉన్నారు. పరకామణి చోరీ కేసు నమోదైన సమయంలో ఈయన ఏవీఎస్ఓగా పనిచేస్తున్నారు. ఈనెల ఆరున సీఐడీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. శుక్రవారం మరోసారి హాజరుకావాల్సి ఉందని గుంతకల్లు నుంచి తిరుపతికి బయలుదేరారు. అంతలోనే ఇలా జరగడంపై చాలా మంది బ్యాచ్మేట్స్, అధికారులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆరో తేదీ విచారణకు హాజరై వచ్చిన తర్వాత కొందరు సహచరులతో మాట్లాడుతూ తనకు మెమో ఇస్తారని, లేదా సస్పెండ్ చేస్తారని వాపోయినట్లు తెలిసింది.
నిష్పక్షపాతంగా విచారణ చేయాలి
సతీష్ కుమార్ మృతిపై నిష్పక్షపాతంగా విచారణ చేయాలని కుమ్మర శాలివాహన సంఘం నాయకులు గోపాల్, ఓబుళపతి, నాగేంద్ర, రామాంజనేయులు తదితరులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు శుక్రవారం అనంతపురం సర్వజనాస్పత్రి మార్చురీ వద్ద ఆందోళన చేశారు. సతీష్కుమార్ మృతిపై తమకు అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. సీఐడీ అధికారులతో సిట్ ఏర్పాటు చేసి పారదర్శకంగా దర్యాప్తు చేయాలంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీనిపై సతీష్ కుమార్ భార్య మమతను సంప్రదించాలని ‘సాక్షి’ ప్రయతి్నంచగా ఆమె సెల్ఫోన్ను పోలీసు అధికారులు స్వా«దీనం చేసుకున్నట్లు బంధువుల ద్వారా తెలిసింది. ఆమెను మీడియాతో మాట్లాడనీయకుండా కట్టడి చేశారు. పోలీసులు ఆమె సెల్ఫోన్ను తీసుకోవాల్సిన అవసరం ఏమి ఉందని బంధువులు ప్రశ్నిస్తున్నారు.
పోస్టుమార్టం పూర్తి
సతీష్కుమార్ మృతదేహానికి అనంతపురం సర్వజనాస్పత్రిలో పోస్టుమార్టం పూర్తి చేశారు. శుక్రవారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో మృతదేహాన్ని స్వగ్రామం కర్నూలు జిల్లా పత్తికొండకు తరలించారు. తొలుత మృతదేహానికి సీటీస్కాన్ చేశారు. అనంతరం వైద్యులు పోస్టుమార్టం చేశారు. మొత్తం ప్రక్రియను వీడియో తీశారు. జిల్లా ఎస్పీ జగదీష్ దగ్గరుండి పర్యవేక్షించారు. ఇదిలా ఉండగా సతీష్ వినియోగిస్తున్న సెల్ఫోన్ను విజయవాడ ఫొరెన్సిక్ ల్యాబ్కు పంపినట్లు అధికార వర్గాల ద్వారా సమాచారం. దాదాపు 3 గంటలకు పైగా జిల్లా ఎస్పీ జగదీష్ ప్రభుత్వ సర్వజనాసుపత్రిలోనే ఉన్నప్పటికీ చివరకు మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. కాగా, సతీష్ కుమార్ మృతి ఘటనకు సంబంధించి వివరాలు ఆరా తీసేందుకు సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ అనంతపురానికి చేరుకున్నట్లు సమాచారం.
హత్య కోణంలో దర్యాప్తు చేయాలి: బీజేపీ
సాక్షి, అమరావతి: తిరుపతి పరకామణి చోరీ కేసులో కీలక వ్యక్తి సతీష్కుమార్ అనుమానాస్పద మరణం ఆందోళనకరమని బీజేపీ ఒక ప్రకటనలో పేర్కొంది. ‘రైల్వే ట్రాక్పై మృతదేహం లభించడం దర్యాప్తును మరింత తీవ్రమైన కోణంలో పరిశీలించాల్సిన అవసరాన్ని సూచిస్తోంది. ఈ ఘటనను హత్య కోణంలో దర్యాప్తు చేయమని ప్రభుత్వాన్ని, పోలీసులను కోరుతున్నాం. ఈ కేసుకు సంబంధించిన సాక్షులకు రక్షణ కల్పించడం ప్రభుత్వ బాధ్యత. ఈ మరణం వెనుక ఎవరి హస్తం ఉన్నా కఠినంగా శిక్షించాలి. నిజం వెలుగులోకి రావాలి’ అంటూ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్నారాయణ ప్రకటనలో పేర్కొన్నారు.


