
15వేల మందికిపైగా అవకాశం
రెండేళ్ల సర్వీసు పూర్తిచేసుకుంటే ‘రిక్వెస్ట్’కు అర్హత
మూడేళ్లు పూర్తిచేసుకున్న పాలనా సిబ్బందికి..
ఒకేచోట ఐదేళ్లు దాటిన ఇతర ఉద్యోగులందరికీ తప్పనిసరి బదిలీ
ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు కూడా..
సాక్షి, అమరావతి : వైద్యశాఖలో ఆదివారం నుంచి సాధారణ బదిలీల ప్రక్రియ మొదలైంది. 15 వేల మందికి పైగా శాశ్వత ఉద్యోగులకు స్థానచలనం అవకాశం ఉంది. ఖాళీల ప్రకటన, బదిలీ దరఖాస్తుల స్వీకరణకు మంగళవారం వరకూ గడువు విధించారు. 6–8 తేదీల్లో దరఖాస్తులు పరిశీలించి, 9న సీనియారిటీ జాబితాలు ప్రదర్శిస్తారు. 10–11 తేదీల్లో వినతుల స్వీకరణ, 12–14 తేదీల్లో తుది మెరిట్ జాబితా ప్రదర్శన అనంతరం 15–17 తేదీల్లో బదిలీల ఉత్తర్వులు జారీచేస్తారు. 19లోపు బదిలీల ప్రక్రియ పూర్తిచేస్తారు. 23న.. బదిలీ అయిన వారందరినీ ప్రస్తుత స్థానాల్లో రిలీవ్ అయినట్లుగా పరిగణిస్తారని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.
ఒకేచోట ఐదేళ్లయితే తప్పనిసరి బదిలీ..
ఈ ఏడాది మే 31 నాటికి రెండేళ్లు సర్వీసు పూర్తిచేసుకున్న వారికి రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్కు అర్హత కల్పించారు. మూడేళ్లు సర్వీస్ పూర్తిచేసుకున్న పాలనా సిబ్బందికి, ఒకేచోట ఐదేళ్లు పైబడిన ఇతర ఉద్యోగులందరినీ తప్పనిసరి బదిలీల్లోకి తెచ్చారు. అలాగే, ఒకేచోట మూడు నుంచి తొమ్మిదేళ్ల సర్వీస్ ఉండి గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల ప్రతినిధుల్ని అదే ఊర్లో వేరే కార్యాలయాలకు బదిలీ చేయనున్నారు.
అక్కడ ఖాళీలు లేనిపక్షంలో ఇతర ప్రదేశాలకు మారుస్తారు. అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (ఏడీఎంఈ) స్థాయి వైద్యులకు పరిపాలన అవసరాలకు అనుగుణంగా బదిలీలు ఉంటాయని ఆ మార్గదర్శకాల్లో వెల్లడించారు. 30న బదిలీలకు ఆమోదం తెలిపినట్లు ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వైద్యశాఖలోని బదిలీల ప్రక్రియలో జిల్లాస్థాయి అధికారులు తీసుకునే నిర్ణయాల్ని విభాగాధిపతులు పర్యవేక్షించాలని ఆదేశించారు. పొరపాట్లకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.