
కార్మికుల సంక్షేమం పట్టని కూటమి ప్రభుత్వం
ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ గాలికి
భవన నర్మాణ బోర్డు పునరుద్ధరణ మాటే లేదు
మృతి చెందిన, గాయపడిన వారికి అందని బీమా సాయం
పేదలకు భరోసా ఇచ్చిన పథకాలన్నీ నిలిపివేత
ఎక్కడికక్కడ కాలనీల్లో ఆగిన ఇళ్ల నిర్మాణం
పనుల కోసం ఊరూరా పడిగాపులు
నేడు ప్రపంచ కార్మిక దినోత్సవం
సాక్షి, అమరావతి: భవన నిర్మాణ, ఇతర అంసఘటిత రంగ కార్మికులు, కూలీల జీవితాలు కొద్ది నెలలుగా దుర్భరంగా మారాయి. అరకొర పనులు, అప్పుల బాధలు, కష్టాల సుడిగుండాల్లో చిక్కుకుని కొట్టుమిట్టాడుతున్నారు. పిల్లల చదువులు, ఇంటి అద్దెలు, ఇతర ఖర్చులకు సైతం డబ్బు పుట్టక బతుకు భారంగా ఈడుస్తున్నారు. కష్టాన్ని నమ్ముకున్న కోట్ల మంది అర్ధాకలితో అలమటిస్తున్నారు. సూపర్ సిక్స్, సెవెన్ అంటూ అలవిగాని హామీల వర్షం కురిపించి గద్దెనెక్కిన చంద్రబాబు ప్రభుత్వం కార్మికుల సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేసింది.
కొత్త పథకాలు అమలు చేయకపోగా, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అమలైన పథకాలకు సైతం గండి కొట్టింది. కార్మిక శాఖ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 1.80 కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికులు ఉన్నారు. లెక్కల్లోకి రాని వారు మరికొన్ని లక్షల్లో ఉంటారు. వీరిలో ఎక్కువ మంది నిర్మాణ రంగంపై ఆధారపడిన తాపీ మేస్త్రీలు, కూలీలు, రాడ్ బెండర్లు, ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, వడ్రంగులు, పెయింటర్లు ఉన్నారు.
గతేడాది సార్వత్రిక ఎన్నికలప్పుడు భవన నిర్మాణ బోర్డ్ను పునరుద్ధరిస్తామని టీడీపీ మేనిఫెస్టోలో చంద్రబాబు హామీ ఇచ్చారు. ‘డ్రైవర్ సాధికార సంస్థ ఏర్పాటు చేస్తాం. అన్ని వర్గాల డ్రైవర్లకు ప్రమాద బీమా, హెల్త్ ఇన్సూరెన్స్, రుణాలు తదితర సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తాం. ముఠా కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక బోర్డ్ ఏర్పాటు చేస్తాం’ అని కూడా హామీ ఇచ్చారు. నేటి వరకు ఆ ఊసే ఎత్తలేదు.
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ సాయం ఇలా
» వైఎస్సార్ కళ్యాణమస్తు కింద ఎస్సీ, ఎస్టీలకు రూ.లక్ష.. ఎస్సీ, ఎస్టీ కులాంతర వివాహాలకు రూ.1.2 లక్షలు, బీసీలకు రూ.50 వేలు, బీసీల కులాంతర వివాహాలకు రూ.75 వేలు, షాధీ తోఫా కింద ముస్లింలకు రూ.1 లక్ష.. భవన, ఇతర నిర్మాణ కార్మికులకు రూ.40 వేలు చొప్పున అందించారు.
» వైఎస్సార్ బీమా పథకం కింద ప్రమాద మరణాల్లో బాధిత కుటుంబాలకు రూ.5 లక్షలు, సహజ మరణాలకు రూ.లక్ష, వైకల్యం సంభవిస్తే రూ.5 లక్షల చొప్పున ఇచ్చి ఆదుకున్నారు.
» రిజిస్టర్ అవ్వని కార్మికులు ప్రమాదాల్లో మరణిస్తే రూ.5 లక్షలు, వైకల్యం సంభవిస్తే రూ.2.5 లక్షలు ఇచ్చారు.
» జగనన్న అమ్మ ఒడి పథకం కింద ఇంటర్మీడియట్ వరకూ రూ.15 వేలు ఇచ్చారు. ఆపై ఉన్నత విధ్యకు ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా మద్దతుగా నిలిచారు. వసతి దీవెన కింద ఇంజినీరింగ్, డిగ్రీ చదివే పిల్లలకు రూ.20 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు చొప్పున సాయం అందించారు.
» అసంఘటిత రంగ కార్మిక కుటుంబాల్లోని వ్యక్తులు అనారోగ్యంబారిన సందర్భాల్లో ఆరోగ్యశ్రీ పథకం కింద రూ.25 లక్షల వరకు వైద్య సేవలను పూర్తి ఉచితంగా అందించారు.
పేరు మార్పు తప్ప సాయం లేదు
» అసంఘటిత రంగ కార్మికులు, ఇతర బలహీన వర్గాల కుటుంబాల్లోని వ్యక్తుల సహజ మరణానికి రూ.5 లక్షలు, ప్రమాదవశాత్తు మరణానికి రూ.10 లక్షలు బీమా అందిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. అధికారం చేపట్టిన వెంటనే గత ప్రభుత్వంలో అమలైన వైఎస్సార్ బీమా పథకానికి చంద్రన్న బీమాగా పేరు మార్చారు. అంతకు మించి పథకం అమలుపై ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.
» దీంతో సంపాదించే వ్యక్తి మరణించిన, అంగ వైకల్యానికి గురైన కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందలేదు. గత ప్రభుత్వంలో వైఎస్సార్ బీమా పథకం కింద 81 వేల కుటుంబాలకు రూ.876 కోట్ల మేర సాయం అందింది. ఈ ప్రభుత్వంలో అది పూర్తిగా నిలిచిపోయింది.
» చంద్రబాబు గద్దెనెక్కిన వెంటనే ఈ పథకాలన్ని ఆగిపోయాయి. ప్రభుత్వం నుంచి కనీస భరోసా కరువై కార్మికుల జీవితాల్లో చీకట్లు అలముకున్నాయి. పిల్లల చదువులు, ఆడ బిడ్డల పెళ్లిళ్లు, అనారోగ్యం, ఇతర అవసరాలకు ప్రభుత్వం నుంచి సాయం లేక ఎన్నో అగచాట్లు పడుతున్నారు.
» రాష్ట్రంలో భవన నిర్మాణ, ఇతర అసంఘటిత రంగ కార్మికులకు పటిష్టమైన జీవన ప్రమాణాలు మెరుగు పరచడం కోసం గత వైఎస్ జగన్ ప్భుత్వం నిర్మాణాత్మక సంక్షేమాన్ని అందించింది. వారి బిడ్డల విద్యకు ఊతమిచ్చింది. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, ఈఎస్ఐ పథకాల కింద ఉచిత వైద్య సేవలతో ఆరోగ్యాలకు భరోసాగా నిలిచింది. భవన నిర్మాణ కార్మికులు ప్రమాదవశాత్తు మృతి చెందినా, వైకల్యం పొందినా.. ఉపాధి కోల్పోయే ఆ కుటుంబానికి బీమా ద్వారా ధీమా కల్పించింది. అమ్మ ఒడి, నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు, వసతి దీవెన, విద్యా దీవెన, చేదోడు, భరోసా, వాహన మిత్ర ఇలా డీబీటీ, నాన్డీబీటీ పథకాలతో వారి జీవితాల్లో వెలుగులు నింపింది.
అరకొర పనులే
కొన్నేళ్లుగా భవన నిర్మాణ కార్మికుడిగా జీవనం సాగిస్తున్నాను. ఈ ప్రభుత్వం వచ్చాక ఉచిత ఇసుక అని ఆర్భాటం చేశారు. వాస్తవానికి ఇసుక ఉచితంగా దొరకడం లేదు. సిమెంట్, ఐరన్, ఇతర నిర్మాణ సామగ్రి ధరలు పెరుగుతున్నాయి. దీంతో కొత్త నిర్మాణాలకు పెద్దగా మొగ్గు చూపడం లేదు. వారం అంతా పని దొరకడం గగనంగా మారింది. దీంతో కుటుంబ పోషణకు అప్పులు చేయాల్సి వస్తోంది. – టి.నాగబాబు, సంతజూటూరు, నంద్యాల జిల్లా
ఆగిన ఇళ్ల నిర్మాణం
గత ప్రభుత్వంలో మా ఊర్లో పేదల ఇళ్ల నిర్మాణం కోసం పెద్ద ఎత్తున లేఅవుట్లు ఏర్పాటు చేశారు. వాటిలో వేలల్లో ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. దీంతో బయటకు ఎక్కడికి వెళ్లే పని లేకుండా ఊర్లోనే పనులు ఉండేవి. ఈ ప్రభుత్వం వచ్చాక కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు నిలిచిపోయాయి. పెయింటింగ్, ఉడ్వర్క్స్, ట్రాన్స్పోర్ట్ రంగ కార్మికులపై ఈ ప్రభావం పడుతోంది. వారాలు, నెలల తరబడి ఇంటి పట్టునే ఉంటే మా కుటుంబాలు ఎలా గడుస్తాయి? నాలుగు వేళ్లు నోట్లోకి వెళ్లడం కూడా కష్టమవుతోంది. – ఆదాం, పెయింటర్, కృష్ణా జిల్లా
ఆదుకునే పథకాలేవీ?
రోజూ ఉదయాన్నే బెంజ్ సర్కిల్ అడ్డా మీదకు పని కోసం వస్తాను. వారంలో మూడు రోజులు పని దొరకడం చాలా కష్టంగా ఉంటోంది. గతంలో ఈ పరిస్థితులు లేవు. పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో జీవనం సాగిస్తున్నాం. ముఖ్యంగా పిల్లల చదువులు భారంగా మారాయి. గతంలో అమ్మ ఒడి, వసతి దీవెన కింద సాయం అందేది. ఇప్పుడు ఆదుకునే ఆ పథకాలు కూడా లేకుండా పోయాయి. – వెంకటేశ్, తాపీ మేస్త్రీ, విజయవాడ