
కూటమి ప్రభుత్వంలో ఆదివాసీలకు అంతులేని అవస్థలు
ఇచ్చిన హామీల అమలుకు అడుగు ముందుకు వేయని సర్కారు
ఏజెన్సీలో రోడ్ల అభివృద్ధి మాటలకే పరిమితం
ఫలితంగా ఆపద సమయాల్లో కొనసాగుతున్న ‘డోలీ’ వేదన
జీవో నెంబర్ 3 పునరుద్ధరణపై కాలయాపన
ఆశ్రమ పాఠశాలల్లో అటకెక్కిన ఏఎన్ఎంల నియామకం
ఒక్క ఉత్పత్తికీ గిట్టుబాటు ధర దక్కని వైనం
మార్కెటింగ్ కల్పించడంలో ఐటీడీఏ, జీసీసీలు విఫలం
విద్య, ఉపాధి, వైద్యం సహా అన్నింటా మాటలకే పరిమితం
గత ప్రభుత్వ పాలనను తలుచుకుంటున్న గిరిజనం
నేడు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం
సాక్షి, అమరావతి : చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో ఆదివాసీలు కష్టాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారు. గిరిజన సమస్యల పరిష్కారంతోపాటు వారి సంక్షేమానికి ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అటకెక్కించింది. దీనికితోడు ఏ కార్యక్రమం అయినా కేంద్ర నిధులే దిక్కన్నట్టుగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటినా ఇంకా సమీక్షలు.. సమావేశాలతోనే కాలయాపన చేయడంతో అడవిలో అలజడి మొదలైంది. ప్రపంచ వ్యాప్తంగా ఆదివాసీల హక్కులు, రక్షణ కోసం పునరంకితమయ్యేలా ఆగస్టు 9న అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవంగా జరుపుకోవాలని 1994లో ఐక్య రాజ్యసమితి ప్రకటించింది.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో గిరిజనుల ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే దయనీయంగా ఉంది. అధికార పీఠమే లక్ష్యంగా వాగ్దానాలు ఇచ్చిన చంద్రబాబు.. వాటిని అమలు చేయడంలో ఏ మాత్రం చిత్తశుద్ధి చూపరని మరోమారు తేటతెల్లమైంది. 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఎస్టీలకు ఇచ్చిన 20 హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. అప్పట్లోనే 50 ఏళ్లు నిండిన ప్రతి గిరిజనుడికీ పింఛన్ ఇస్తానని, ప్రతి జిల్లాలో గిరిజన భవన్ నిరి్మస్తానని ఇచ్చిన హామీలు అమలు చేయలేదు.
గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు, గిరిజన ప్రత్యేక కమిషన్ వంటి హామీలను మరిచిన చంద్రబాబు.. బాక్సైట్ తవ్వకాలను ప్రోత్సహించి, అటవీ సంపదను దోపిడీదారులకు దోచి పెట్టడానికి కొమ్ముకాయడంతో గిరిజనుల ఆగ్రహానికి గురికావాల్సి వచ్చింది. 2024 ఎన్నికల్లోనూ 50 ఏళ్లకే పింఛన్, సబ్ ప్లాన్ నిధులు వారి అభివృద్ధికే ఖర్చు చేయడం, ఏజెన్సీలో ఆదివాసీ ఉపాధ్యాయుల నియామకం, జీవో 3 పునరుద్ధరణ, ఎస్టీలకు సంక్షేమ పథకాల పునరుద్ధరణ, బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ తదితర హామీలు ఇచ్చారు.
అధికారంలోకి వచ్చి 14 నెలలు గడుస్తున్నా వాటి అతీగతీ లేదు. వన్ ఆఫ్ సెవెంటీ, పీసా చట్టాల అమలులోనూ ప్రభుత్వం ఉదాసీనత ప్రదర్శిస్తోంది. నకిలీ గిరిజన ధ్రువపత్రాలపై విచారణ, తుది తీర్పులకు కాలయాపన శాపంగా మారింది. విద్య, ఉపాధి, వైద్యం అన్నింటా ఉత్తుత్తి మాటలతో కూటమి నేతలు మోసం చేయడంపై అడవిలో ఆందోళనలు, ఆవేదనలు వ్యక్తమవుతున్నాయి.
జీవో నెంబర్ 3 పునరుద్ధరణ ఎప్పుడు?
జీవో నెంబర్ 3ను పునరుద్ధరించడంపై ఏడాదికిపైగా కాలయాపనతో సరిపెడుతోంది. ఏజెన్సీలోని షెడ్యూల్డ్ గ్రామాల్లో నూరు శాతం ఉద్యోగాలు గిరిజనులకే ఇచ్చేలా జారీ చేసిన ఈ జీవోను సుప్రీంకోర్టు నిలిపి వేసింది. దాన్ని పునరుద్ధరిస్తామంటూ మాట ఇచ్చిన కూటమి నేతలు ఇప్పటికీ మభ్య పెడుతున్నారు. దీంతో ఈ జీవోను పునరుద్ధరించి, తమకు ప్రత్యేక డీఎస్సీ ప్రకటించాలని గిరిజనులు ఇటీవల పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. తా త్కాలికంగా గిరిజనుల ఆందోళనను విరమించేలా చేసిన ప్రభుత్వం.. ఈ విషయంలో స్పష్టమైన వైఖరి తీసుకోవడంలో మాత్రం తాత్సారం చేస్తోంది.
మంత్రి తొలి సంతకానికి దిక్కులేదు..
గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్ఎంలను నియమిస్తామంటూ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి చేసిన తొలి సంతకానికి దిక్కులేకుండా పోయింది. ఈ విషయమై కొద్ది రోజుల క్రితం పార్వతీపురం కలెక్టర్ వద్ద గిరిజన విద్యార్థులు ఆందోళన నిర్వహించడం గమనార్హం.
గిరిజన ఉత్పత్తులకు దక్కని ధరలు
గిరిజనులకు ప్రధాన ఆదాయ వనరుగా మారిన కాఫీ సాగును కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. మరో లక్ష ఎకరాల్లో కాఫీ సాగును విస్తరిస్తామంటూ సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ అమలుకు నోచుకోలేదు. కాఫీ తోటలను బాగు చేసుకునేందుకు ఉపయోగపడే ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం రద్దు చేయడంతో దాన్ని తిరిగి సాధించేందుకు ఎన్డీఏ పక్షంలోని టీడీపీ ప్రభుత్వం కనీస ప్రయత్నం చేయడంలేదు. గిరిజన ఉత్పత్తుల మార్కెటింగ్లో స్థానిక ఐటీడీఏ, జీసీసీలు సైతం విఫలమయ్యాయి.
ప్రపంచవ్యాప్తంగా కాఫీకి డిమాండ్ ఉన్నప్పటికీ, ఈ ఏడాది అరకు కాఫీకి మంచి ధర సాధించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం గిరిజన రైతులకు శాపంగా మారింది. చింతపండు, తేనె వంటి వాటితోపాటు ఇతర పంటలకు, ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలు కల్పించడంలోనూ వైఫల్యంతో గిరిజనులు తీవ్రంగా నష్టపోతున్నారు. దళారులకు మేలు కలుగుతోంది. గిరిజనులు అధిక ఉత్పత్తులు సాధించేలా తగిన పరికరాలు సబ్సిడీపై అందించడం, వారి ఉత్పత్తులకు సరైన ధర దక్కేవరకు నిల్వ చేసుకునేలా కోల్డ్ స్టోరేజ్ వంటి సౌకర్యాలు కల్పించడంలోనూ ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్లు కన్పిస్తోంది.
జగన్ పాలనలో సంక్షేమ ఫలాలు
రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 34 తెగలకు చెందిన 27.39 లక్షల మంది గిరిజనులు ఉన్నారు. వారి అభివృద్ధి, సంక్షేమానికి వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనలో అనేక విప్లవాత్మక చర్యలు చేపట్టారు. ఫలితంగా వారి బతుకు చిత్రం మారింది. నవరత్నాల సంక్షేమ పథకాలను అందించి ఆర్థికంగా ఆదుకోవడంతోపాటు భూమిపై హక్కులు కల్పించి సాగుకు ఊతమిచ్చారు. 2019–20 నుంచి 2023–24 వరకు ఎస్టీల సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏకంగా రూ.20,948.15 కోట్లు వెచ్చించింది. వివిధ పథకాల ద్వారా ప్రత్యక్షంగా (డీబీటీ), పరోక్షంగా (నాన్ డీబీటీ) రూ.14,712.08 కోట్ల ప్రయోజనం చేకూరింది.
ఏకంగా 3.22 లక్షల ఎకరాలకు అటవీ హక్కుల చట్టం (ఆర్వోఎఫ్ఆర్) ప్రకారం గిరిజనులకు పట్టాలు అందించడం దేశంలోనే రికార్డు. వైఎస్సార్ రైతు భరోసా పథకం ద్వారా 3,40,043 మంది గిరిజన రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించారు. 90 శాతం సబ్సిడీతో విత్తనాలు, బిందు, తుంపర సేద్యం పరికరాలు సమకూర్చారు. అల్లూరి జిల్లాలో 2,58,021 ఎకరాల్లో కాఫీ సాగు చేస్తున్న 2,46,139 మంది గిరిజన రైతులకు అన్ని విధాలా అండగా నిలిచారు.
అంతర పంటగా మిరియాలు, ఇతర పంటల సాగుకు సాంకేతిక పరిజ్ఞానం, శిక్షణ, పెట్టుబడి సాయం, రుణాలు, యంత్రాలు వంటివి అందించారు. గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్యం, ఉపాధిపై ప్రత్యేక చర్యలు చేపట్టడంతో ఆ ఐదేళ్లు గిరిజనులు ఆనందోత్సాహాల మధ్య గడిపారు. ఈ విషయాన్ని తలుచుకుంటూ ప్రస్తుతపరిస్థితిపై ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
డోలీ నిర్మూలన మాటలకే పరిమితం
ఏజెన్సీలోని కొండ ప్రాంతాల్లో రోడ్లు నిర్మించి డోలీ మోతలను నిర్మూలిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఎన్నికల ముందు హామీలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ గతేడాది డిసెంబర్లో ఏజెన్సీలో రెండు రోజులపాటు పర్యటించి, రోడ్లు వేస్తున్నట్టు శంకుస్థాపనలతో హడావుడి చేశారు.
నెలలు గడుస్తున్నా ఒక్క రోడ్డు వేయక పోవడంతో డోలీ కష్టాలు తీరడం లేదంటూ గత నెలలో గిరిజన యువకులు గుర్రాలపై గ్రామాల్లో తిరుగుతూ వినూత్నంగా నిరసన తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి ఏజెన్సీలో మాడ్రేబు నుంచి పినకోట, పెద్దకోట, జీనపాడు పంచాయతీ పరిధిలో రోడ్లు వేసి కష్టాలు తీర్చాలని డిమాండ్ చేశారు.