
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 5 నుంచి 7వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఆగస్టు 4న అంకురార్పణతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికులు లేదా సిబ్బంది వల్ల తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం కలుగకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. కొన్ని ముఖ్యాంశాలు...
⇒ ఉత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు ఆలయంలోని సంపంగి ప్రాకారంలో ఉదయం స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు.
⇒ సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.
⇒ 5న పవిత్రాల ప్రతిష్ట, 6న పవిత్ర సమర్పణ, 7న పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహిస్తారు.
⇒ పవిత్రోత్సవాల్లో భాగంగా సోమవారం సహస్రదీపాలంకార సేవను టీటీడీ రద్దు చేసింది.
⇒ అదేవిధంగా 5వతేదీన అష్టదళ పాద పద్మారాధన సేవ, 7న తిరుప్పావడ సేవతో పాటు 5 నుండి 7వ తేదీ వరకు కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు రద్దయ్యాయి.