
ఉన్నతాధికారుల బదిలీలతో పనుల నిలిపివేత
నెరవేరని పులి పిల్లల సంరక్షణ బాధ్యత
ఇప్పటికే పెరిగి పెద్దవిగా మారిన బెబ్బులులు
పెద్దదోర్నాల: తల్లి నుంచి విడిపోయి తిరుపతి జూ పార్క్లో పెరుగుతున్న పులి పిల్లలను, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎన్క్లోజర్లో ఉంచి సంరక్షించాలన్న అధికారుల లక్ష్యం నెరవేరకుండా పోయింది. తల్లి నుంచి విడిపోయి వేటాడటం తెలియని పులి పిల్లలకు వేట నేర్పేందుకు నల్లమల అభయారణ్యంలో ఏర్పాటు చేస్తున్న భారీ టైగర్ ఎన్క్లోజర్ పనులకు ఉన్నతాధికారుల బదిలీలతో పూర్తి స్థాయిలో అడ్డుకట్ట పడింది. దాదాపు రెండేళ్ల క్రితం నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం పెద్ద గుమ్మడాపురంలో నాలుగు ఆడపులి పిల్లలు తల్లి నుంచి విడిపోయి దిక్కుతోచని స్థితిలో స్థానికుల కంటపడ్డాయి.
ఈ క్రమంలో అవి పెరిగి పెద్దవవుతుండటంతో వాటిని అటవీ ప్రాంత వాతావరణంలో వదిలి పెట్టేందుకు అటవీశాఖ గతంలో నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో రెండేళ్ల క్రితం అధికారులు ప్రకాశం జిల్లా నెక్కంటి రేంజ్లో పెద్దపెంట, ఆరపెంట, గంగారంపెంట, పెద్దదోర్నాల మండలంలోని తెట్టుగూడెంల పరిధిలో దాదాపు రూ.2 కోట్లతో టైగర్ ఎన్క్లోజర్తో పాటు నర్సరీ, హెర్బివోస్ల(జింకలు, దుప్పులు) ఎన్క్లోజర్ పనులు చేపట్టారు.
సొంతంగా వేటాడగలిగేలా..
మొదటగా నర్సరీ ఎన్క్లోజర్లతో ఉంచిన పులి పిల్లలను టైగర్ ఎన్క్లోజర్లలోకి మార్చి, వ్యక్తిగతంగా ఆహారం కోసం అవి 50 వన్యప్రాణులను సొంతంగా వేటాడగలిగినప్పుడే వాటిని అభయారణ్యంలోకి వదులుతారు. ఇందుకోసం ఆయా ఎన్క్లోజర్లలో రూ.2.50 లక్షలతో సోలార్ బోరుతో పాటు, ఎన్క్లోజర్లోకి పైప్లైన్ సదుపాయం, జింకల అవసరాలు తీర్చేందుకు సాసర్పిట్లు, సహజ సిద్ధంగా ఉండే నీటి గుంతలను సైతం ఏర్పాటు చేశారు.
సాధారణంగా కొద్ది రోజుల పాటు వాటిని సంరక్షించి అనంతరం పులుల కోసం ఏర్పాటు చేసిన ఎన్క్లోజర్లలో వదలటం ద్వారా పులులకు వేటాడటాన్ని అలవాటు చేస్తారు. వేటలో వాటి శక్తియుక్తులను గుర్తించి తదుపరి చర్యలను తీసుకుంటారు. అయితే ఇవేమీ జరగకుండానే టైగర్ ఎన్క్లోజర్ పనులు మందగించాయి.
ఎన్క్లోజర్ పనులకు కొత్తగా టెండర్లను పిలుస్తున్నాం
అధికారుల బదిలీలు, గతంలో భారీ వర్షాల కారణంగా పనులు కొంత మేర మందగించాయి. టెండర్ల ప్రక్రియ పూర్తయితే పనులు చురుగ్గా జరిగే అవకాశం ఉంది. కొత్తపల్లి పులి పిల్లలు పెద్దవి కావటంతో వాటిని తీసుకొచ్చే అంశం పరిశీలనలో ఉంది. – ప్రసన్నజ్యోతి, ఫారెస్ట్ రేంజి అధికారి, కొర్రప్రోలు
మందగించిన నిర్మాణ పనులు
నల్లమల అభయారణ్య పరిధిలోని కొందరు ఉన్నతాధికారుల బదిలీలతో పాటు మరి కొన్ని కారణాలతో టైగర్ ఎన్క్లోజర్ పనులతో పాటు నర్సరీ, హెర్బివోస్ల ఎన్క్లోజర్ పనులు నిలిచిపోయాయి. దీంతో తిరుపతి జూలో పెరుగుతున్న పెద్దపులులు సహజ సిద్ధంగా వాటి ఆహారాన్ని అవే వేటాడగలిగేలా చేయటంతో పాటు, పెద్దపులులలో అనాథలు, తీవ్ర గాయాల పాలైన వాటిని ఇక్కడ నర్సరీ ఎన్క్లోజర్లలో పెట్టి సంరక్షించేందుకు అధికారులు తీసుకున్న నిర్ణయం ఆదిలోనే హంసపాదుగా మారింది.