టీడీపీ కార్యకర్తల అరాచకం 

TDP leaders Over Action In Panchayat Elections - Sakshi

చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులు 

అనంతపురం జిల్లాలో రోడ్ల మీద జేసీబీతో గుంతలు 

తాగునీటిపైపులైన్లు, కుళాయిల ధ్వంసం 

పంచాయతీ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేక దుశ్చర్యలు 

టీడీపీ శ్రేణుల దాడిలో పలువురికి గాయాలు 

కేవీపల్లె/అమరావతి/బ్రహ్మసముద్రం: పంచాయతీ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేని తెలుగుదేశం కార్యకర్తలు దాడులకు తెగబడుతున్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేస్తున్నారు. చిత్తూరు జిల్లా కేవీపల్లె మండలం తిమ్మాపురం పంచాయతీ వడ్డిపల్లె, గుంటూరు జిల్లా అమరావతి మండలం దిడుగు గ్రామాల్లో దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో పలువురు గాయపడ్డారు. అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలంలోని నంజాపురం గ్రామంలో రోడ్లమీద జేసీబీతో గుంతలు తవ్వారు. తాగునీటి పైపులైన్లు, కుళాయిలు ధ్వంసం చేశారు.  

చిత్తూరు జిల్లా వడ్డిపల్లెలో టీడీపీ వారి దాడిలో పలువురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు.. పంచాయతీ ఎన్నికల్లో తిమ్మాపురం సర్పంచ్‌గా టీడీపీ మద్దతుదారు అడ్డదారిలో గెలుపొందారని ఆదివారం వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు బత్తుల బాబు, వెంకటరమణ ఆరోపించారు. దీంతో తిమ్మాపురానికి చెందిన మాజీ సర్పంచ్, టీడీపీ నాయకుడు చంద్రారెడ్డి తదితరులు వాగ్వాదానికి దిగారు. తిరిగి సోమవారం ఉదయం టీడీపీ కార్యకర్తలు అధిక సంఖ్యలో చేరుకుని వడ్డిపల్లెలోని వైఎస్సార్‌సీపీ కార్యకర్తల ఇళ్లపై రాళ్లు విసిరారు. అడ్డుకోబోయిన వారిపై కర్రలతో దాడిచేశారు. రెండు ద్విచక్రవాహనాలు, ఒక ట్రాక్టర్‌ను ధ్వంసం చేశారు. ఈ దాడిలో పలువురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు గాయపడ్డారు. తీవ్రంగా గాయపడ్డ చలపతి, ముద్దుకృష్ణ, చిలకమ్మ, లలితలను చికిత్స నిమిత్తం పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మదనపల్లె డీఎస్పీ రవిమనోహరాచారి వడ్డిపల్లెను సందర్శించారు. గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు పోలీస్‌ పికెట్‌ ఏర్పాటు చేశారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కారపాకుల భాస్కర్‌నాయుడు, పార్టీ నాయకుడు ప్రదీప్‌రెడ్డి బాధితులను పరామర్శించారు. తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇరువర్గాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రామ్మోహన్‌ తెలిపారు. 
గాయపడ్డ చలపతి, ముద్దుకృష్ణ, లలిత, శివనాగిరెడ్డి 

వైఎస్సార్‌ సీపీ యువజన నేతపై దాడి 
గుంటూరు జిల్లా దిడుగు గ్రామంలో టీడీపీ వర్గీయులు ఆదివారం రాత్రి దాడిచేయడంతో వైఎస్సార్‌ సీపీకి చెందిన ఇద్దరు గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు..  పంచాయతీ ఎన్నికల సందర్భంగా వైఎస్సార్‌సీపీ అభిమాని అభ్యర్థి వింతా శ్రీలక్ష్మి తరఫున జిల్లా వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి వింతా శివనాగిరెడ్డి, కార్యకర్తలు ప్రచారం నిర్వహించారు. ఎస్టీ కాలనీ దగ్గర వారిపై టీడీపీకి చెందిన పేరిశెట్టి శ్రీనివాసరావు, మంచినేని రాజా, బొబ్బల నరే‹Ù, తోట సాంబయ్య, పేరిశెట్టి శంకర్, నూలు శ్రీనివాసరావు, రామిశెట్టి కాశయ్య, కడియాల రామాంజనేయులు మరికొందరు కలిసి రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో శివనాగిరెడ్డి, కుంజుల భాస్కరరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం అమరావతి కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌కు తరలించారు. సోమవారం శివనాగిరెడ్డి  ఫిర్యాదు మేరకు అమరావతి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.  

ఇవి మా బాబు రోడ్లు.. మీరు తిరగొద్దు.. 
అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలంలోని నంజాపురం గ్రామంలో టీడీపీ నాయకులు తమ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు వేసిన సిమెంటు రోడ్లపై వైఎస్సార్‌సీపీకి ఓట్లు వేసిన వారు తిరగకూడదంటూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు.అటువైపుగా గ్రామస్తులు బయటకు వెళ్లకుండా జేసీబీతో  రోడ్డు మీద గుంతలు తీశారు. గ్రామంలో తాగునీటి పైపులైన్, æకుళాయిలను సైతం ధ్వంసం చేశారు. గ్రామస్తుల దాహార్తి తీర్చే శ్రీరామరెడ్డి నీటిపథకం కొళాయిలను కూడా నేలమట్టం చేశారు. ఇదేమిటని ప్రశి్నంచిన గ్రామస్తులను బూతులు తిడుతున్నారు. ఈ తిట్లు వినలేక అనేకమంది ఇంట్లోంచి బయటకు రావడంలేదు. పలువురు గ్రామస్తులు తమ ఆవేదనను అధికారుల దృష్టికి
తీసుకెళ్లారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top