టీడీపీ ఎమ్మెల్యేల గూండాగిరీ | TDP Leaders Anarchy, Demonic rule under Chandrababu Govt in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

టీడీపీ ఎమ్మెల్యేల గూండాగిరీ

Jun 16 2026 5:20 AM | Updated on Jun 16 2026 7:05 AM

TDP Leaders Anarchy, Demonic rule under Chandrababu Govt in Andhra Pradesh

న్యాయవాది ఈడ్పుగంటి శ్రీనివాస్‌ ఇంట్లోకి చొరబడేందుకు తలుపులు తోస్తున్న టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌

రాష్ట్రవ్యాప్తంగా భయానక వాతావరణం

శ్రుతిమించిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని అరాచకాలు

సొంత పార్టీ నేత ఇల్లు ధ్వంసానికి అర్థరాత్రి పొక్లెయిన్లతో బీభత్సం

కొద్ది నెలల క్రితం సాక్షి కార్యాలయాన్ని తగులబెట్టించి మరీ పైశాచికం

దాడులు, దౌర్జన్యాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా చింతమనేని 

రోజురోజుకీ పేట్రేగిపోతున్న అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌

ఎమ్మెల్యే దగ్గుపాటి తనను చంపడానికి యత్నిస్తున్నాడని సొంత పార్టీ నేత వీడియో విడుదల.. శ్రీశైలం, కళ్యాణదుర్గం, ఆమదాలవలస, గుంటూరు ఈస్ట్, నర్సరావుపేట ఎమ్మెల్యేలదీ దౌర్జన్యపర్వమే

రౌడీయిజానికి కేరాఫ్‌గా మారిన ఎమ్మెల్యేలకు పోలీసుల రాచ మర్యాదలు

ఇదీ చంద్రబాబు ఏలుబడిలో రాక్షస పాలన

సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి ఏలూరు/­అనంతపురం టౌన్‌: వాళ్లు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు.. పేరుకు ఎమ్మెల్యేలైనా రౌడీ­లను మించి చెలరేగిపోతున్నారు. అరాచకాలు, అకృత్యాలతో బరితెగిస్తున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని దౌర్జన్యాలు, దాడులతో రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని తమకు అడ్డుచెప్పే వారే లేరంటూ పేట్రేగిపోతున్నారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు రాష్ట్రంలో ఏ జిల్లా చూసినా టీడీపీ ఎమ్మెల్యేల దౌర్జన్యకాండలే తాండవమాడుతున్నాయి. అర్ధరాత్రి జేసీబీ­లతో సొంత పార్టీకి చెందిన న్యాయవాది ఇంటిపై దండయాత్రకు దిగిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ చట్టాన్నీ, పోలీసు యంత్రాంగాన్నీ ఖాతరు చేయలేదు. తన అక్రమాలు, అవినీతిని ప్రశ్నిస్తున్నాడని న్యాయవాది ఇంటిపై దాడికి యత్నించారు. ‘‘వాడో.. నేనో ఉండాలి’ అంటూ బీభత్సం సృష్టించారు.  అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ కూడా అరాచకాలతో రెచ్చిపోతున్నారు. ఆయన నుంచి తనకు ప్రాణహాని ఉందని సొంత పార్టీ నేత సెల్ఫీ వీడియో విడుదల చేయడం ప్రసాద్‌ అకృత్యాలకు అద్దంపడుతోంది. 

ఓ ఎన్‌ఆర్‌ఐ కష్టార్జితంతో కట్టుకున్న రూ.60 కోట్ల మాల్‌ను చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు కబ్జా చేశారు. తననెవరు అడ్డుకునేది అన్నట్టు పేట్రేగిపోతున్నారు. ఇవే కాదు.. జిల్లా ఎస్పీ కార్యాలయాన్నే 10 గంటలు ముట్టడించిన నర్సరావుపేట ఎమ్మెల్యే అరవింద్‌బాబు, అర్ధరాత్రి వీడియో కాల్స్‌తో కేజీబీవీ మహిళా ప్రిన్సిపాల్‌ను వేధించిన ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్, సొంత పార్టీ మహిళా కార్యకర్త ఆత్మహత్యాయత్నానికి కారణమైన గుంటూరు ఈస్ట్‌ ఎమ్మెల్యే నసీర్, అటవీ శాఖాధికారులను కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లిన శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డిల తీరు రాక్షసకాండను తలపిస్తున్నాయి.. ఇవన్నీ రాష్ట్రంలో చంద్రబాబు పాలన ఎంత దుర్మార్గంగా ఉందో చెప్పడానికి మచ్చుతునకలు.

అరాచకానికి కేరాఫ్‌ అడ్రస్‌ చింతమనేని 
అరాచకాలు, అడ్డగోలు తనానికి మారుపేరైన ఏలూరు జిల్లా దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ మరోమారు రెచ్చిపోయారు. ఆదివారం అర్ధరాత్రి ఏలూరు నగరంలో రచ్చరచ్చ చేశారు. సొంత పార్టీకి చెందిన ప్రముఖ న్యాయవాది ఈడ్పుగంటి శ్రీనివాసబాబు నివాసాన్ని కూలగొట్టడానికి ఏకంగా పొక్లెయిన్లు, వందల మంది అనుచరులతో దండయాత్రగా వెళ్లారు. ఆయన ఇల్లు కూల్చివేస్తానని నానా బీభత్సం చేశారు. అడ్డుకున్న పోలీసులనూ పక్కకు నెట్టేసి దుర్భాషలాడారు. వాడో, నేనో ఉండాలంటూ హల్‌చల్‌ చేశారు. ఇంత చేసినా ఎమ్మెల్యేను పోలీసులు రాచ మర్యాదలతో ఇంటికి పంపించారు. బాధితుడైన  శ్రీనివాస్, ఆయన కుమారుడిని మాత్రం అర్ధరాత్రి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. చివరికి టీడీపీ అరాచకవాది చింతమనేనికే వత్తాసు పలికింది. 

బాధితుడైన న్యాయవాది శ్రీనివాస్‌ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది. చింతమనేని ఇలా చేయడం కొత్త కాదు. కొద్దిరోజుల క్రితం సాక్షి ఏలూరు కార్యాలయంపై దాడి చేశారు. ఆ తర్వాత కార్యాలయానికి తన అనుచరులతో కలిసి నిప్పు పెట్టించారు. వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి ఇంటిపై దాడికి ప్రయత్నించారు. ఆయన వ్యవసాయ తోటలో అరాచకం సృష్టించారు. 2014–19 మధ్య ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకున్న ముసునూరు మహిళా తహశీల్దార్‌ వనజాక్షిపై విచక్షణారహితంగా దాడికి దిగారు. అధికారులపై దాడి చేయడం, ప్రజలపై నోరుపారేసుకోవడం, దుర్భాషలాడడం ఆయనకు నిత్యకృత్యం. ఇసుక, మట్టి దోపిడీ, కోడి పందేలతో దెందులూరు నియోజకవర్గాన్ని చింతమనేని ప్రభాకర్‌ రౌడీరాజ్యంగా మార్చివేశారు.

అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తున్నారనే..!
బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న ఎమ్మెల్యే చింతమనేని మా ఇంటి ముందుకు వచ్చి వందలాది మందితో మాపై దాడి చేయడానికి యత్నించి, ఇల్లు కూల్చడానికి తెగబడ్డారు. అందరినీ దుర్భాషలాడారు. పోలీసులు చింతమనేనిని వదిలివేసి, ఏ తప్పూ చేయని నా భర్తను, కుమారుడిని అర్ధరాత్రి పూట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఇదేమి అన్యాయం? నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను వెలుగులోకి తీసుకువస్తున్నారనే నా భర్తపై కక్షగట్టారు. ఇదేనా చంద్రబాబు సుపరిపాలన? 
– ఈడ్పుగంటి పద్మజ, న్యాయవాది, చింతమనేని బాధితుడి సతీమణి

కబ్జాల ప్రత్తిపాటి 
చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు కబ్జాలకు, అరాచకాలకూ అంతేలేదు. చిలకలూరిపేటలోని ఎన్‌ఆర్‌ఐ రావి మురళీమోహన్‌కు చెందిన రూ.60 కోట్ల విలువైన సాయి కార్తీక్‌ సిటీ సెంటర్‌ను ప్రత్తిపాటి ఆక్రమించారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. గత ఏడాది ఆగస్టు 5న తన మాల్‌ను ఎమ్మెల్యే అనుచరులు అక్రమంగా ఆక్రమించుకున్నారని ఎన్‌ఆర్‌ఐ మురళీమోహన్‌ వెల్లడించారు. రెండు థియేటర్లు, రెండు ఫంక్షన్‌ హాళ్ళు, వాణిజ్య ప్రాంతాలు ఉన్న ఈ కాంప్లెక్స్‌లో ఎవరినీ ప్రవేశించనివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చిలకలూరిపేట పోలీస్‌ స్టేషన్‌లోనూ బాధితుడు ఫిర్యాదు చేశారు. అయినా ఎవరూ పట్టించుకోలేదని, బాధితుడు కోర్టుకు వెళ్లారు. ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చినా ప్రభుత్వం, పోలీసులు పట్టించుకోలేదు.  చంద్రబాబు, లోకేశ్‌కి ఫిర్యాదు చేసినా కబ్జా చేసిన పుల్లారావుకే వత్తాసు పలుకుతుండడం గమనార్హం.

సొంత పార్టీ నేతలనూ వదలని దగ్గుపాటి 
అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ సొంతపార్టీ నేతలనూ వదలడం లేదు. ఎమ్మెల్యే నుంచి తనకు ప్రాణహాని ఉందని టీడీపీ మైనార్టీ నేత మహబూబ్‌ బాషా సెల్ఫీ వీడియో విడుదల చేయడమే దీనికి నిదర్శనం.  తనకు ఏమి జరిగినా ఎమ్మెల్యేదే బాధ్యత అని ఆ వీడియోలో బాధితుడు స్పష్టం చేశారు. మైనార్టీలకు ఇంటి పట్టాలు ఇవ్వాలని అడగడమే తన తప్పులా ఎమ్మెల్యే వ్యవహరించారని వివరించారు. ‘‘నాకు ఎవరూ ఉచితంగా ఓటు వేయలేదని, నేనెందుకు ఇంటి పట్టాలు ఇవ్వాలి’’ అంటూ దగ్గుపాటి ఫోన్‌లో బెదిరించారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి పట్టాలు అడిగితే చంపేస్తారా అని ప్రశ్నించారు. 

పదేళ్లుగా పార్టీకి పనిచేస్తున్నానని, ఎన్నికల్లో రూ.కోట్లు ఖర్చుపెట్టానని వివరించారు. ఎమ్మెల్యే అరాచకాలపై  పార్టీ పెద్దలకు చెప్పినా స్పందన లేదని వివరించారు. అనంతపురం టీడీపీలో మైనార్టీలకు జరుగుతున్న అన్యాయాలపై మంగళవారం ఆర్ట్స్‌ కళాశాల ఎదురుగా ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహం ఎదుట దీక్ష చేపడుతున్నట్లు మహబుబ్‌బాషా తెలిపారు. ఎమ్మెల్యే దగ్గుపాటిపై గతంలోనూ తీవ్ర ఆరోపణలు వచ్చాయి. మద్యం షాపుల వద్దకు నేరుగా తన మనుషులను పంపడం, కమీషన్ల కోసం ఇష్టానుసారం వ్యవహరించడం ఆయనకు అలవాటుగా మారింది. జూనియర్‌ ఎన్టీఆర్‌ సినిమాను తన నియోజకవర్గంలో విడుదల కాకుండా అడ్డుకునేందుకు థియేటర్‌ యజమానులను బెదిరించారు.

ఎస్పీనే బెదిరించిన ఎమ్మెల్యే అరవిందబాబు
నరసరావుపేట టీడీపీ ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు కొద్దిరోజుల క్రితం పోలీసులపైనే చెలరేగిపోయారు. పల్నాడు ఎస్పీ కార్యాలయంలో దాదాపు 10 గంటల పాటు బైఠాయించి అధికారులకే సవాల్‌ విసిరారు. తాను సూచించిన వ్యక్తికి లీగల్‌ అడ్వైజర్‌ పోస్టు ఇవ్వాలని ఏకంగా ఎస్పీనే బెదిరించారు. ఎస్పీ బయటకు వెళ్లిపోవడంతో ఆయన చాంబర్‌లోనే తలుపులు వేసుకుని కూర్చోవడంతో పోలీసులు తలుపులు బద్దలుకొట్టి ఎమ్మెల్యేను బయటకు తీసుకు రావాల్సి వచ్చింది. గతంలోనూ అరవిందబాబు తాను చెప్పిన వారికి కాంట్రాక్టు పోస్టులు ఇవ్వాలని ఎక్సైజ్‌ కమిషనర్‌ కార్యాలయంలో హంగామా సృష్టించారు.

ఎమ్మెల్యే నసీర్‌ వేధింపులకు మహిళా కార్యకర్త ఆత్మహత్యాయత్నం  
గుంటూరు ఈస్ట్‌ టీడీపీ ఎమ్మెల్యే నసీర్‌ అహ్మద్‌ వేధింపులు తట్టుకోలేక ఒక టీడీపీ మహిళా కార్యకర్త ఆయన కార్యాలయం ఎదుటే ఆత్మహత్యాయత్నానికి యత్నించారు. ఇందుకు సంబంధించి ఒక వీడియో బయటకు రావడంతో  ఆ కుటుంబాన్ని ఎమ్మెల్యే వెంటాడి వేధించారు. తన పైశాచికత్వాన్ని ప్రదర్శించారు. అయినా చంద్రబాబు సర్కారు పట్టించుకోలేదు. 

కేజీబీవీ ప్రిన్సిపాల్‌కు కూన రవికుమార్‌ వేధింపులు 
ఆమదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌ తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని కేజీబీవీ మహిళా ప్రిన్సిపాల్‌ బయటపెట్టడం కొద్ది నెలల క్రితం చర్చనీయాంశమైంది. అర్ధరాత్రి వేళ అడ్మిషన్ల పేరిట మీటింగ్‌కు రమ్మని ఫోన్‌ కాల్స్‌ చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయినా ప్రభుత్వం ఎమ్మెల్యేపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.

అటవీ శాఖ ఉద్యోగులనే కిడ్నాప్‌ చేసిన ఎమ్మెల్యే బుడ్డా  
శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి గత ఏడాది చెక్‌పోస్టు వద్ద తన కారును ఆపారని ఏకంగా అటవీ శాఖ ఉద్యోగులనే కిడ్నాప్‌ చేసి చిత్రహింసలకు గురిచేశారు. తన కారులోనే వారిని తీసుకెళ్లి దాడి చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. పలు సందర్భాల్లో నియోజకవర్గంలో ఆయన గొడవలు సృష్టించారు. తనకు తెలియకుండా ఎంపీ రావడాన్ని వ్యతిరేకిస్తూ కార్యకర్తలతో దాడులు చేయించారు. ఇవే కాదు.. అనేక నియోజకవర్గాల్లో అధికార కూటమి ఎమ్మెల్యేలు తాము సర్వాధికారులమనే రీతిలో వ్యవహరిస్తున్నారు. ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడం, దౌర్జన్యంగా అరెస్టు చేయించడం, దాడులు చేయడం ప్రతిచోటా జరుగుతూనే ఉంది. చంద్రబాబు కూడా వారికే వత్తాసు పలుకుతున్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగిస్తున్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement