తూర్పుగోదావరి జిల్లా: ధవళేశ్వరం వద్ద గోదావరికి వరద భారీగా పెరుగుతోంది. దాంతో 4.70 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. ఇవాళ రాత్రికి గోదావరి వరద మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. వరద నీరు మరింత పెరిగే అవకాశం ఉండటంతో కోనసీమ అధికారులు అలెర్ట్ అయ్యారు.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని 19 మండలాలపై వరద ప్రభావం ఉండే అవకాశం ఉంది. సెంట్రల్ డెల్టా పరిధిలోని 16–17 మండలాలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రధానంగా 32 లంక గ్రామాలపై వరద ప్రభావం ఉండే అవకాశం ఉంది. దాంతో బోట్లు, లైఫ్ జాకెట్లు, సహాయక బృందాలను అధికారులు సిద్దం చేశారు. గోదావరికి వరద పోటు ఎక్కువగా ఉండటంతో ఎవరు కూడా నదిలో దిగవద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు.


