
మున్సిపల్ ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఖూనీ!
కుప్పం చైర్పర్సన్ గిరికోసం టీడీపీ బరితెగింపు
ఓటుకు రూ.50 లక్షలు.. ఒకరికి మున్సిపాలిటీలో ఉద్యోగం ఎర
8 మంది కౌన్సిలర్లపై ప్రలోభాల వల
ఇద్దరు కౌన్సిలర్లను ఎన్నికలో పాల్గొనకుండా అడ్డుకున్న టీడీపీ
బలం లేకపోయినా కుప్పం చైర్పర్సన్ కుర్చిని లాక్కున్న టీడీపీ
పాలకొండ, గుంటూరు, తుని, విశాఖపట్నం, మాచర్ల, తాడిపత్రి ఉప ఎన్నికల్లోనూ మాయోపాయాలే
అనైతిక విజయంతో కుప్పంలో టీడీపీ శ్రేణులు హంగామా
అధికార పార్టీ నేతలు ప్రలోభాల వల విసిరారు. ఉద్యోగాలు ఎరవేశారు. మాట వినని వారి అంతుచూస్తామని బెదిరించారు. కుప్పం, మాచర్ల, తుని, పాలకొండ, విశాఖపట్నం, గుంటూరు మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో కౌన్సిలర్లు, కార్పొరేటర్లను అనైతిక మార్గాల్లో లొంగదీసుకున్నారు. సోమవారం జరిగిన మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, మేయర్ ఉప ఎన్నికల్లో మాయా పాచికలనే కూటమి పార్టీలు నమ్ముకున్నాయి. బలం లేకున్నా.. బరిలోకి దిగాయి. మొదట భంగపడినా.. చివరకు మాయతోనే మోసగించాయి. శకునికి మించిన ఎత్తులతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేసి మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో పెత్తనం చెలాయించేందుకు కూటమి నేతలు సిద్ధమయ్యారు.
సాక్షి నెట్వర్క్: సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో అధికారపార్టీ నేతలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. బలం లేకపోయినా కుప్పం మున్సిపల్ చైర్పర్సన్ పీఠాన్ని లాక్కున్నారు. వైఎస్సార్సీపీ గుర్తుతో గెలిచిన కౌన్సిలర్లలో ఒక్కొక్కరికీ రూ.50 లక్షలు, ఒకరికి మున్సిపల్ ఉద్యోగం ఎరవేసి లొంగదీసుకున్నారు. మరో ఇద్దరిని భయపెట్టి ఎన్నికలో పాల్గొనకుండా అడ్డుకున్నారు. 8మంది వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను టీడీపీలోకి లాక్కుని చైర్పర్సన్ కుర్చీని దక్కించుకుని అనైతికంగా విజయం సాధించారు.
కుప్పం మున్సిపల్ చైర్పర్సన్ స్థానానికి సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థి సెల్వరాజ్ను మున్సిపల్ చైర్పర్సన్గా ఎన్నుకున్నారు. మున్సిపాలిటీలో మొత్తం 25 వార్డులు ఉంటే.. అందులో 19 వార్డుల నుంచి వైఎస్సార్సీపీ కౌన్సిలర్లే ఎన్నికయ్యారు. టీడీపీకి కేవలం ఆరుగురు కౌన్సిలర్లు మాత్రమే ఉండగా.. కూటమి అధికారంలోకి వచ్చాక మున్సిపల్ చైర్పర్సన్ పదవి కోసం బెదిరింపులకు తెరలేపారు. మున్సిపల్ చైర్పర్సన్గా ఉన్న డాక్టర్ సుధీర్ రాజీనామా చేయటంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. నలుగురు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరినా.. వైఎస్సార్సీపీకి 15 మంది కౌన్సిలర్లతో చైర్పర్సన్ను ఎన్నుకునేందుకు అవసరమైన పూర్తిస్థాయి బలం ఉంది.
బరితెగించి.. ఇబ్బందులకు గురిచేసి..
టీడీపీ బరితెగింపునకు భయపడి 15 మంది వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు క్యాంప్ ఏర్పాటు చేసుకున్నారు. ఇద్దరు కౌన్సిలర్లకు చెందిన భూములు లాక్కుంటామని బెదిరించగా.. మరికొందరిని కేసులు పెడుతామని హెచ్చరించినట్లు తెలిసింది. తమకు మద్దతు ఇచ్చిన వారికి ఒక్కొక్కరికి రూ.50 లక్షలు ఇస్తామని ఆశ చూపించారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ విప్ జారీ చేసినా అధికారపార్టీ నేతల ప్రలోభాలకు 8 మంది కౌన్సిలర్లు లొంగిపోయారు.
ఇద్దరు కౌన్సిలర్లు మునస్వామి, తిలగవతి టీడీపీ నేతల బెదిరింపులకు భయపడి ఎన్నికల్లో పాల్గొనకుండా గైర్హాజరయ్యారు. ఉప ఎన్నికలో మొత్తం 22 మంది కౌన్సిలర్లు పాల్గొనగా.. టీడీపీ బలపరచిన అభ్యర్థి సెల్వరాజ్కి 13 మంది కౌన్సిలర్లు మద్దతు తెలిపారు. కాగా.. విప్ ధిక్కరించిన కౌన్సిలర్లను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఎమ్మెల్సీ, కుప్పం నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త భరత్ ప్రకటించారు.
పాలకొండలో.. అడ్డదారిలో..
పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నగర పంచాయతీ చైర్పర్సన్ పదవి కోసం జరిగిన ఉప ఎన్నికలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ మున్సిపల్ చైర్పర్సన్ పదవిని ఎస్సీలకు రిజర్వు చేశారు. మొత్తం 20 వార్డులు ఉండగా.. 17 వార్డుల్లో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు ఎన్నికయ్యారు. 19, 2వ వార్డులకు చెందిన ఇద్దరు మాత్రమే ఎస్సీ సభ్యులు ఉండగా.. 19వ వార్డుకు చెందిన యందవ రాధాకుమారిని చైర్పర్సన్గా అప్పట్లో వైఎస్సార్సీపీ ఎంపిక చేసింది.
ఇటీవల వ్యక్తిగత కారణాలతో రాధాకుమారి తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఎన్నిక అనివార్యమైంది. చివరకు 2వ వార్డుకు చెందిన ఎస్సీ సభ్యురాలు ఆకుల మల్లీశ్వరి ఉండగా.. ఆమెనే తదుపరి చైర్పర్సన్గా ప్రకటించాలని వైఎస్సార్సీపీ నాయకులంతా ఏకాభిప్రాయానికి వచ్చారు. ఈ పీఠంపై కూటమి పార్టీలు కన్నేశాయి. సోమవారం మరోమారు ఎన్నిక నిర్వహించగా.. టీడీపీ మాయోపాయంతో స్వతంత్ర అభ్యర్థినంటూ మల్లీశ్వరి నామినేషన్ దాఖలు చేశారు.
టీడీపీకి చెందిన ఇద్దరు సభ్యుల మద్దతు అందించడంతో ఆమె చైర్పర్సన్గా ఎన్నికైనట్టు ప్రకటించారు. ఆ వెంటనే మల్లీశ్వరికి రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, జనసేన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ టీడీపీ కండువా వేసి పాలకొండ చైర్పర్సన్ పదవి తమదేనని ప్రకటించుకున్నారు. ఈ ఎన్నికకు వైఎస్సార్సీపీకి చెందిన 14 మంది కౌన్సిలర్లు హాజరు కాలేదు.
మిగిలిన చోట్ల ఇలా..
⇒ గుంటూరు మేయర్గా కూటమి అభ్యర్థి కోవెలమూడి రవీంద్ర (నాని) గెలుపొందారు. మార్చిలో అప్పటి మేయర్ కావటి మనోహర్నాయుడు రాజీనామా చేయడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. మొత్తం 56 మంది సభ్యుల్లో కూటమి బలం కేవలం 11.. కాగా 18 మందిని చేర్చుకోవడంతో వారి బలం 29కి చేరింది. ఎంపీ, ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ ఎక్స్–అఫిషియో సభ్యులు ఉండటంతో వారి బలం 34 అయ్యింది. వైఎస్సార్సీపీకి ఇద్దరు ఎమ్మెల్సీలతో కలిసి 29 మంది బలం ఉండగా.. ఇద్దరు సభ్యులు హాజరుకాకపోవడంతో 27 ఓట్లు వచ్చాయి.
⇒ కాకినాడ జిల్లా తుని మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికకు వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలో చేరిన 17 మంది కౌన్సిలర్లు హాజరు కాగా.. 11 మంది వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు ఎన్నికను బహిష్కరించారు. పోటీలో మరెవరూ లేకపోవడంతో చైర్పర్సన్గా నార్ల భువనసుందరి ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రిసైడింగ్ అధికారి, డీపీఓ రవికుమార్ ప్రకటించారు.
⇒ గ్రేటర్ విశాఖ మేయర్గా టీడీపీ కార్పొరేటర్ పీలా శ్రీనివాస్ ఎన్నికయ్యారు. ఎన్నిక అనంతరం ప్రిసైడింగ్ అధికారి మయూరి అశోక్ ఆయనకు నియామక పత్రం అందజేశారు.
⇒ మొత్తం మాచర్ల మున్సిపాలిటీలో 31 వార్డులు ఉన్నాయి. 31 వార్డులనూ వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. కూటమి అధికారంలోకి రావడంతో వైఎస్సార్సీపీ సభ్యులపై రకరకాల ఒత్తిళ్లు తెచ్చి.. భయపెట్టి పలుదఫాలుగా 21 మంది కౌన్సిలర్లను టీడీపీ తనవైపు తిప్పుకుంది. వారి సాయంతో వైస్ చైర్పర్సన్గా మదార్ సాహెబ్ను గెలిపించుకుని విలువలకు పాతరేసింది.
⇒ తాడిపత్రి మునిసిపల్ వైస్ చైర్పర్సన్–1గా టీడీపీకి చెందిన 26వ వార్డు కౌన్సిలర్ షెక్షావలి, వైస్ చైర్పర్సన్–2గా సీపీఐకి చెందిన 12వ వార్డు కౌన్సిలర్ అరుణ ఎన్నికయ్యారు. అధికార పార్టీకి సంఖ్యాబలం ఉండటంతో ఈ పదవులకు వైఎస్సార్సీపీ నుంచి ఎవరినీ పోటీకి దింపలేదు.
కూటమి విజయం అనైతికం: ఎమ్మెల్సీ భరత్
కుప్పం రూరల్: ‘కుప్పంలో ప్రజాస్వామ్యానికి బ్లాక్ డే. మున్సిపల్ చైర్పర్సన్ ఉప ఎన్నికల్లో టీడీపీ అనైతికంగా విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం అప్రతిష్ట పాలైంది’ అని ఎమ్మెల్సీ కేఆర్జే భరత్ అన్నారు. సోమవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ‘వైఎస్సార్ సీపీకి 18 మంది సభ్యుల బలముంది. అయినా ఓడిపోవాల్సిన దుస్థితి పట్టింది. అధికార పార్టీ నేతలు మా కౌన్సిలర్లను కూరగాయల్లా రూ.లక్షలకు లక్షలు పోసి కొన్నారు. అధికారం శాశ్వతం కాదు. హుందాతనం ముఖ్యం. సాక్షాత్తు సీఎం ప్రాతినిధ్య వహిస్తున్న నియోజకవర్గంలోనే ఇలా అనైతిక ఎన్నికలు జరుగుతుంటే.. ఇక రాష్ట్రమంతా పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది. ఇప్పుడు కుప్పం మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా జరిగింది.
ప్రజాస్వామ్యం ఖూనీ: ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని, స్థానిక సంస్థల పదవులను చేజిక్కించుకునేందుకు గజారుడు రాజకీయానికి పాల్పడిందని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రలోభాలు, బెదిరింపులతో వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులను తమవైపు తిప్పుకుని పదవులను దక్కించుకోవడం హేయమైన చర్య అని పేర్కొన్నారు.
చంద్రబాబు అరాచక పాలనను చూసి ప్రజాస్వామ్యవాదులు నివ్వెరపోతున్నారని అప్పిరెడ్డి విమర్శించారు. కుప్పం, పాలకొండ, మాచర్ల, తుని, గుంటూరు స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అరాచకాలకు పాల్పడిందని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వంలో తాడిపత్రి మున్సిపాలిటీలో వైఎస్సార్సీపీ కంటే 2 స్థానాలు టీడీపీ అధికంగా గెలుచుకుంటే నాటి సీఎం వైఎస్ జగన్ హుందాగా వ్యవహరించారని గుర్తుచేశారు.