ఏపీ సీఐడీ పరిధి సంగతి తేలుస్తాం | Supreme Court clarifies that it will clarify the jurisdiction of AP CID | Sakshi
Sakshi News home page

ఏపీ సీఐడీ పరిధి సంగతి తేలుస్తాం

May 3 2025 4:02 AM | Updated on May 3 2025 9:29 AM

Supreme Court clarifies that it will clarify the jurisdiction of AP CID

ఎవరైనా సరే చట్ట ప్రకారమే నడుచుకోవాలి

స్పష్టం చేసిన సుప్రీంకోర్టు

సాక్షి, అమరావతి: ఏపీ సీఐడీ పరిధి సంగతిని తేలుస్తామని, సీఐడీ కూడా చట్ట నిబంధనల ప్రకా­రమే నడుచుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంలో పూర్తి­స్థాయిలో విచారణ జరుపుతా­మని పేర్కొంది. మద్యం కొనుగోళ్ల వ్యవ­హా­రంలో విచారణకు హాజరు కావాలంటూ బీఎన్‌­ఎస్‌ఎస్‌ సెక్షన్‌ 179 కింద ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ అధి­కారులు తనకు నోటీసులు జారీ చేయడాన్ని సవాలు చేస్తూ రాజ్‌ కేసిరెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

సీఐడీ నోటీసుల్లో జోక్యానికి నిరాకరిస్తూ హైకోర్టు గత నెల 4న ఇచ్చిన ఉత్తర్వులపై స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ (ఎస్‌ఎల్‌పీ) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయ­మూర్తులు జస్టిస్‌ జేబీ పార్థీవాలా, జస్టిస్‌ ఆర్‌.మహదేవన్‌ ధర్మాసనం శుక్రవారం విచా­రణ జరిపింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, సీఐడీ స్టేషన్‌ హౌజ్‌ ఆఫీసర్, ప్ర­త్యే­క దర్యాప్తు బృందం (సిట్‌) అధికారి, ఎక్సై­­జ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్‌ కు­మార్‌ మీనాలకు నోటీసులు జారీ చేసింది. తదు­పరి విచారణను ఈ నెల 13కి వాయిదా వేసింది.

తెలంగాణ పరిధిలో జోక్యం చేసుకునే అధికారం ఏపీ సీఐడీకి లేదు
అంతకుముందు రాజ్‌ కేసిరెడ్డి తరఫు న్యాయవాది శ్రీహర్ష పీచర వాదనలు వినిపించారు. రాజ్‌ హైదరాబాద్‌లో నివాసం ఉంటారని, అందువల్ల ఆయనకు నోటీసులు జారీ చేసే పరిధి ఏపీ సీఐడీకి లేదని  వివరించారు. ఒక రాష్ట్రం తన పరిధిలోని ప్రాంతాలకు సంబంధించిన వ్యవహారాల్లో మాత్రమే కలగజేసుకునే వీలుంటుందని తెలి­పారు. తాము సీఐడీ నోటీసులను సవాలు చేస్తూ మొదట ఏపీ హైకోర్టులో పిటిషన్‌ వేశామని, అయితే ఏపీ సీఐడీ పరిధిలోకి తెలంగాణ రాష్ట్రం వస్తుందంటూ 2022లో హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా తమ పిటిషన్‌లో జోక్యం చేసుకోవ­డానికి హైకోర్టు నిరాకరించిందని పేర్కొన్నారు. 

ఏపీ, తెలంగాణ సీఐడీలకు ఇరు రాష్ట్రాలు కూడా ఒకదానికొకటి పొరుగు పోలీస్‌ స్టేషన్లు అవుతాయన్న తీర్పు ఇవ్వడం ద్వారా హైకోర్టు పొరపాటు చేసిందని వివరించారు. సీఐడీ పరిధి విషయంలో హైకోర్టు చెప్పిన భాష్యం వల్ల సెక్షన్‌ 179 నిరర్థకం అవుతోందన్నారు. హైకోర్టు తీర్పుతో ఏపీ సీఐడీకి అపరిమిత అధికారులు దఖలు పడ్డాయన్నారు. దీంతో పొరుగు రాష్ట్రంలోని వారికి సైతం నోటీసులు ఇచ్చే అధికారం సీఐడీకి కలిగిందని తెలిపారు. అందులో భాగంగానే పిటిషనర్‌ రాజ్‌ కేసిరెడ్డికి ఏపీ సీఐడీ నోటీసులు ఇచ్చిందని అన్నారు. కేవలం రాజకీయ కారణాలతోనే పిటిషనర్‌ను తప్పుడు కేసులో ఇరికించినట్లు చెప్పారు.

ఇప్పటికే అరెస్ట్‌ చేశారు.. ఈ వ్యాజ్యం నిరర్థకం
రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ, సీఐడీ పరిధి విషయంలో ఏపీ హైకోర్టు చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చిందని.. పిటిషనర్‌ను సీఐడీ ఇప్పటికే అరెస్ట్‌ చేసిందని తెలిపారు. కాబట్టి నోటీసులను సవాలు చేస్తూ దాఖలు చేసిన ఈ వ్యాజ్యం నిరర్థకం అవుతుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీ సీఐడీ పరిధిని తేలుస్తాం అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. 

సీఐడీ స్టేషన్‌ హౌజ్‌ ఆఫీసర్, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) దర్యాప్తు అధికారి, ఎక్సైజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్‌ కుమార్‌ మీనాలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 13కి వాయిదా వేసింది. మద్యం కొనుగోళ్ల వ్యవహారంలో ముందస్తు బెయిల్‌ కోరుతూ ఎంపీ మిథున్‌రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంతో కలిపి ఈ వ్యాజ్యాన్ని విచారిస్తామని తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement