124వ రోజుకు మూడు రాజధానుల మద్దతు దీక్షలు | Support initiations of the three capitals on the 124th day | Sakshi
Sakshi News home page

124వ రోజుకు మూడు రాజధానుల మద్దతు దీక్షలు

Feb 1 2021 5:22 AM | Updated on Feb 1 2021 5:22 AM

Support initiations of the three capitals on the 124th day - Sakshi

దీక్షలలో పాల్గొని నిరసన తెలియజేస్తున్న బహుజన పరిరక్షణ సమితి నేతలు

తాడికొండ: మూడు రాజధానులకు మద్దతుగా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు జంక్షన్‌లో బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు ఆదివారం 124వ రోజుకు చేరుకున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దళితులు, బహుజనులు దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. రాజధాని పేరిట 29 గ్రామాల్లో జరిగిన రూ.3.56 లక్షల కోట్ల దోపిడీపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రజల సొమ్మును సీఆర్‌డీఏ పేరుతో నిలువునా దోచేసిన చంద్రబాబు అండ్‌ కో పేదలకు ఇళ్ల పట్టాలు రానివ్వకుండా సీఆర్‌డీఏ పేరుతో కోర్టుల్లో అడ్డుపడుతున్నారని మండిపడ్డారు.

అడ్డగోలు దోపిడీలు చేసి వ్యవస్థలను తప్పుదారి పట్టిస్తున్న చందబ్రాబు అండ్‌ కోపై కేంద్ర ప్రభుత్వం స్పందించి రాజధాని పేరిట జరిగిన దోపిడీని బయట పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. చంద్రబాబు చేసిన అవినీతిని నిగ్గుతేల్చి శిక్ష విధించకపోతే బహుజనులకు జీవితాంతం అన్యాయం జరుగుతూనే ఉంటుందన్నారు. పంచాయతీ ఎన్నికల్లో పోటీకి దిగిన టీడీపీ, దాని తోక పార్టీలకు డిపాజిట్లు రాకుండా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బహుజన పరిరక్షణ సమితి నాయకులు మాదిగాని గురునాథం, నత్తా యోనారాజు, నూతక్కి జోషి తదితరులు పాల్గొన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement