నేటి నుంచి అత్యవసర సేవలు బంద్
స్టైపెండ్ల పెంపుపై ఆగస్టు 15 వరకూ ప్రభుత్వానికి డెడ్లైన్
ప్రభుత్వం నుంచి స్పందన నిల్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జూనియర్ వైద్యుల (జూడా) సమ్మె తీవ్రరూపం దాలుస్తోంది. సోమవారం నుంచి అత్యవసర వైద్య సేవలను బహిష్కరించనున్నామని ఏపీ జూడా అసోసియేషన్ ఆదివారం ప్రకటించింది. స్టైపెండ్ల పెంపులో చంద్రబాబు ప్రభుత్వం అన్యాయం చేస్తుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా జూడాలు సమ్మెలోకి వెళ్లిన విషయం తెలిసిందే. దశల వారీ సమ్మెలో భాగంగా స్టైపెండ్ పెంపు నిర్ణయంపై ఆగస్టు 15 వరకూ ప్రభుత్వానికి ఏపీ జూడా డెడ్లైన్ ఇచ్చింది. గడువులోగా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో అత్యవసర సేవలను బహిష్కరించి సమ్మె తీవ్రతరం చేస్తున్నామని జూడా రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వర్ శంకర్ ప్రకటించారు. సోమవారం నుంచి అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాస్పత్రుల్లో ఇంటర్న్స్, జూనియర్ రెసిడెంట్స్, పీజీలు, సీనియర్ రెసిడెంట్స్ అత్యవసర సేవల్ని బహిష్కరించి ఆందోళనల్లో పాల్గొంటారు.
వీరి సమ్మెకు ఏపీ ప్రభుత్వ వైద్యుల సంఘం(ఏపీజీడీఏ), ప్రభుత్వ వైద్యుల సంఘం (ఏపీజీడీఏఏపీ), ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) ఏపీ విభాగం, వివిధ సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఈనెల 10 నుంచి జూడాలు సమ్మె ప్రారంభించారు. ప్రభుత్వం ప్రతి రెండేళ్లకొకసారి వీరికిచ్చే స్టైపెండ్ను పెంచాల్సి ఉంది. దీని గురించి గతేడాది డిసెంబర్ నుంచే ఏపీ జూడా ప్రభుత్వానికి వినతులు ఇస్తోంది. అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో గత నెలలో సమ్మె నోటీస్ ఇచ్చారు. ఈ క్రమంలో చర్చలకు పిలిచిన ప్రభుత్వం జూడాలు 30%పెంపు కోరగా కేవలం 3 శాతం పెంచుతామని చెప్పింది. కొన్నేళ్లుగా ఆనవాయితీగా వస్తున్న 15% పెంపును కూడా ప్రభుత్వం ఎత్తేయడంపై నిరసనగా జూడాలు సమ్మెలోకి వెళ్లారు.


