ఉపాధ్యాయుల సర్దుబాటుకు రంగం సిద్ధం | Stage is set for teacher adjustment | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయుల సర్దుబాటుకు రంగం సిద్ధం

Apr 19 2025 3:49 AM | Updated on Apr 19 2025 3:49 AM

Stage is set for teacher adjustment

ఎంఈవోలకు మార్గదర్శకాలు.. 2025–26 విద్యా సంవత్సరం నుంచి నూతన విధానం

సాక్షి, అమరావతి: ఇప్పటికే టోఫెల్‌ ఎత్తేశారు.. అమ్మ ఒడి ఆపేశారు.. విద్యార్థుల ట్యాబ్‌లకు ఎగనామం పెట్టారు. నాడు–నేడు నిలిపివేశారు. గోరుముద్ద నాణ్యత తగ్గించేశారు. ఇప్పుడు సబ్జెక్ట్‌ టీచర్లను ఎత్తివేస్తూ ఉపాధ్యాయుల సర్దుబాటుకు రంగం సిద్ధం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులను పునర్‌ వ్యవస్థీకరించనున్నారు. ఐదు రకాల పాఠశాలలకు తగినట్లుగా టీచర్లను  కేటాయించనున్నట్టు (టీచర్స్‌ రీపోర్షనేట్‌) పాఠ­శా­ల విద్యాశాఖ శుక్రవారం ఎంఈవోలకు మార్గ­దర్శకాలు విడుదల చేసింది. 

2025–26 విద్యా సంవత్సరం నుంచి నూతన విధానం అమల్లోకి రానుంది. దీని ప్రకారం రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఐదు రకాల ప్రభుత్వ పాఠశాలలు ఉంటాయి. ఇందులో ఫౌండేషన్‌ స్కూల్‌ (1, 2 తరగతులు), బేసిక్‌ ప్రైమరీ స్కూల్‌ (1–5), మోడల్‌ ప్రైమరీ స్కూల్‌ (1–5), అప్పర్‌ ప్రైమరీ స్కూల్‌ (1–8), ఉన్నత పాఠశాలలు (1–10) ఉండనున్నాయి.  

టీచర్ల కేటాయింపు ఇలా.. 
» ఫౌండేషన్‌ (1, 2): ఒకటి 30 మంది విద్యార్థులకు ఒక ఎస్‌జీటీ, 31–60 మంది వరకు ఇద్దరు ఎస్‌జీటీలు ఉంటారు.  
»  బేసిక్‌ ప్రైమరీ (1–5): ఒకటి నుంచి 20 మంది విద్యార్థులకు ఒక ఎస్‌జీటీ, 21 నుంచి 60 వరకు విద్యార్థులుంటే ఇద్దరు ఎస్‌జీటీలు బోధిస్తారు. 
»  మోడల్‌ ప్రైమరీ (1–5): 59 మంది విద్యార్థుల వరకు నలుగురు టీచర్లను కేటాయించారు. ఎస్‌జీటీల్లో మిగులు ఉంటే ఐదుగురిని కేటాయిస్తారు. విద్యార్థుల సంఖ్య 60 మంది, ఆపై 150 వరకు ఉంటే ఒక హెచ్‌ఎం, నలుగురు ఎస్‌జీటీలను ఇస్తారు. అలాగే, 120 దాటిన తర్వాత ప్రతి 30 మంది విద్యార్థులకు ఒక ఎస్‌జీటీని కేటాయిస్తారు.  
» ప్రాథమికోన్నత (యూపీ) పాఠశాలలు (1–8): ఈ పాఠశాలల్లోని 1–5 తరగతుల వరకు బోధనా సిబ్బంది నియామకానికి బేసిక్‌ ప్రైమరీ/ మోడల్‌ ప్రైమరీ స్కూళ్ల నిబంధనలే వర్తిస్తాయి. ఆరు నుంచి 8వ తరగతి వరకు 10 మంది విద్యార్థులకు ఒక ఎస్‌జీటీ, 11 నుంచి 30 వరకు ఇద్దరు ఎస్‌జీటీలు 31– 140 వరకు నలుగురు ఎస్‌జీటీలు, 141–175 మంది విద్యార్థుల వరకు ఐదుగురు ఎస్‌జీటీలను మంజూరు చేస్తారు.  
» ఉన్నత పాఠశాలలు (1–10): బేసిక్‌ ప్రైమరీ స్కూల్లో కేవలం ఎస్‌జీటీలే ఉంటారు. ఇందులో 10 మంది విద్యార్థుల వరకు ఇద్దరు టీచర్లు, 11 నుంచి 30 మంది విద్యార్థులకు ముగ్గురు, 31–40 మందికి నలుగురు, 40 మందికి పైన విద్యార్థులకు ఐదుగురు ఎస్‌జీటీలు ఉంటారు. 

6–10 తరగతులకే సబ్జెక్టు టీచర్లు 
గత ప్రభుత్వంలో హైసూ్కళ్లలో విలీనమైన 3–5 తరగతులకు సబ్జెక్టు టీచర్‌ బోధనను రద్దు చేశా­రు. కేవలం 6 నుంచి 10 తరగతులకు మాత్రమే స్కూల్‌ అసిస్టెంట్లు బోధిస్తారు. ఇందులో సెక్షన్‌ బట్టి టీచర్ల కేటాయింపు జరిగింది. సెక్షన్ల ఆధారంగా స్టాఫ్‌ ప్యాట్రన్‌ నిర్ణయించారు. 54 మంది విద్యార్థుల వరకు మొదటి సెక్షన్‌గా పరిగణిస్తా­రు. అనంతరం ప్రతి 40 మందికి ఒక అదనపు సెక­్షన్‌గా లెక్కిస్తారు.  ఇలా 5 నుంచి 25 సెక్షన్ల వర­కు విభజించి, 8 నుంచి 31 మంది ఉపాధ్యాయులను కేటాయించారు. 

ఉన్నత పాఠశాలల్లో 76 మంది కంటే ఎక్కువ మంది విద్యార్థులుంటేనే ప్రధానోపాధ్యాయుడు, పీఈటీని కేటాయిస్తారు. అంతకంటే తక్కువుంటే ఈ పోస్టులు ఉండవు. జనవరిలో విడుదల చేసిన మార్గదర్శకాల్లో 3–5 తరగతులతో ఏర్పాటు చేస్తామన్న మోడల్‌ ప్రైమరీ స్కూళ్ల ప్రస్తావన తాజా ఆదేశాల్లో లేకపోవడంపై టీచర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement