తమదే అనుకుని వేరే బైకులో రూ. 2.80 లక్షలు ఉంచి.. చివరకు..

Sri Sathya Sai District Driver Prasad, Sriramulu Money Missing Scooty - Sakshi

సాక్షి, పుట్టపర్తి టౌన్‌: ఓ వ్యక్తి పొరబడ్డాడు. తమదే అనుకుని వేరే బైకులో రూ. 2.80 లక్షలు ఉంచాడు. కాసేపటికే నాలుక కరచుకుని పోలీసులను ఆశ్రయించాడు. పట్టణంలో శనివారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి సీఐ బాలసుబ్రమణ్యం రెడ్డి వివరాల మేరకు.. పెనుకొండ ఆర్టీసీ డిపోకు చెందిన డ్రైవర్‌ ప్రసాద్‌ కొన్ని రోజుల క్రితం ఎనుములపల్లికి చెందిన శ్రీరాములు ఇంట్లో అద్దెకు దిగారు. ఈ క్రమంలోనే శ్రీరాములు ఇంటి పత్రాలను తాకట్టు పెట్టుకుని రూ. 2.80 లక్షలు అప్పు ఇచ్చారు. డబ్బు తిరిగి చెల్లిస్తానని శ్రీరాములు చెప్పడంతో శనివారం ప్రసాద్‌ స్థానిక ఆర్టీసీ డిపో వద్దకు వచ్చారు.

బాధితులకు నగదు అప్పగిస్తున్న సీఐ బాలసుబ్రమణ్యం రెడ్డి  

శ్రీరాములుకు ఇంటి పత్రాలు తిరిగిచ్చిన ప్రసాద్‌ ఆయన తీసుకొచ్చిన రూ. 2.80 లక్షలను తన స్కూటీలో పెట్టమని చెప్పి వేరే పనిలో నిమగ్నమయ్యారు. ప్రసాద్‌ స్కూటీనే అనుకుని శ్రీరాములు వేరే స్కూటీ డిక్కీలో నగదు పెట్టేశారు. ఇంటికి వెళ్లాక డిక్కీని తెరిచిన ప్రసాద్‌కు నగదు కనిపించలేదు. దీంతో వెంటనే ఆయన పోలీసులను ఆశ్రయించారు. డిపో వద్ద సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు పుట్టపర్తికి చెందిన రామచంద్రప్ప నాయుడు బైక్‌లో డబ్బు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే పట్టణంలోని ఆయన నివాసం వద్దకు వెళ్లి రూ. 2.80 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుస్టేషన్‌లో ప్రసాద్‌కు నగదు అప్పగించడంతో కథ సుఖాంతమైంది. దర్యాప్తులో చాకచక్యంగా వ్యవహరించిన సీఐ, ఎస్సైలు గోపీనాథ్, వెంకటరమణ, పోలీసు సిబ్బందికి బాధితుడు కృతజ్ఞతలు తెలిపారు.  

చదవండి👉 (గంజి ప్రసాద్‌ కుటుంబ సభ్యులను పరామర్శించిన హోంమంత్రి)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top