
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): ప్రయాణికుల డిమాండ్ మేరకు చర్లపల్లి–నర్సాపూర్, జాల్నా–తిరుపతి మధ్య నడిచే ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు విజయవాడ రైల్వే డివిజన్ పీఆర్వో నుస్రత్ మండ్రూప్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. చర్లపల్లి–నర్సాపూర్ (07233) ప్రత్యేక రైలు జూలై 5 నుంచి వచ్చే ఏడాది మార్చి 28 వరకు ప్రతి శనివారం రాత్రి 7.50 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 7 గం.లకు నర్సాపూర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో (07234) జూలై 6 నుంచి వచ్చే ఏడాది మార్చి 29 వరకు ప్రతి ఆదివారం రాత్రి 8 గంటలకు నర్సాపూర్లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 7 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది.
రెండు మార్గాల్లో ఈ రైలు నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, వీరవాసరం, పాలకొల్లు స్టేషన్లలో ఆగుతుంది. ఇక జాల్నా–తిరుపతి (07609) రైలు జూలై 7 నుంచి వచ్చే ఏడాది మార్చి 30 వరకు ప్రతి సోమవారం ఉదయం 7 గంటలకు జాల్నాలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 10.45 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.
తిరుగు ప్రయాణంలో (07610) జూలై 8 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు ప్రతి మంగళవారం మధ్యాహ్నం 3.15 గంటలకు తిరుపతిలో బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 3.50 గంటలకు జాల్నా చేరుకుంటుంది. ఈ రైలు బీదర్, మారపల్లి, వికారాబాద్, లింగంపల్లి, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది.