
ప్రమాద సమయంలో సింహగిరిపైనే అశోక్
మృతుల కుటుంబాలను పరామర్శించలేదు
కనీసం సంఘటనా స్థలానికి రాని వైనం
సింహాచలం: సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి క్షేత్ర చరిత్రలో కనీవినీ ఎరుగని దుర్ఘటన చోటుచేసుకుంది. చందనోత్సవం రోజున షాపింగ్ కాంప్లెక్స్ వద్ద నాసిరకంగా నిర్మించిన గోడ కూలి ఏడుగురు భక్తులు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది.ఈ ఘటన జరిగి మూడు రోజులు గడుస్తున్నా, దేవస్థానం వంశపార ధర్మకర్త పూసపాటి అశోక్గజపతిరాజు మాత్రం ఇంతవరకు సంఘటనా స్థలాన్ని సందర్శించక పోవడం, మృతుల కుటుంబాలను పరామర్శించకపోవడం విమర్శలకు దారితీస్తోంది.
చందనోత్సవం రోజున స్వామివారి తొలి దర్శనం చేసుకునేది వంశపార ధర్మకర్తలే. ఆనవాయితీ ప్రకారం.. అశోక్గజపతిరాజు మే 29న రాత్రి సింహగిరిపై బస చేసి, 30న తెల్లవారుజామున కుటుంబసమేతంగా తొలి దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆయన అక్కడే ఉన్న సమయంలో గోడ కూలి ప్రమాదం జరిగింది. భారీ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగినా, అంబులెన్సులు, పోలీసు వాహనాల సైరన్లు మారుమోగినా అశోక్గజపతిరాజు ప్రమాద స్థలానికి రాలేదు.
మూడు రోజులు గడిచినా ఆయన సంఘటనా స్థలాన్ని సందర్శించకపోవడం, మృతుల కుటుంబాలను పరామర్శించకపోవ డంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో దేవస్థానంలో జరిగిన చిన్న చిన్న విషయాలపై సైతం మీడియా ముందుకు వచ్చి విమర్శలు గుప్పించిన అశోక్గజపతిరాజు, ఇప్పుడు ఇంతటి ఘోర ప్రమాదం జరిగినా స్పందించకపోవడం విడ్డూరంగా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. భక్తుల సౌకర్యాలే ముఖ్యమని నీతులు చెప్పే ఆయన, వారి మరణం పట్ల వ్యవహరించిన తీరు బాధాకరమని అంటున్నారు. మృతుల కుటుంబాలకు దేవస్థానం తరఫున నష్టపరిహారం అందించాల్సిన బాధ్యత కూడా ఆయనపై ఉందని పలువురు పేర్కొంటున్నారు.
ఎంపీదీ అదే దారి..
సింహగిరిపై చందనోత్సవంరోజు గోడ కూలి ఏడుగురు భక్తులు మృతిచెందిన ఘోర ప్రమాదంలో ఎంపీ భరత్ ఇప్పటివరకు మృతుల కుటుంబాలను పరామర్శించలేదు. ఆయన తీరుపై విమర్శలు వెల్లువెత్తున్నాయి.