రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 20 హబ్‌లు | Sidiri Appalaraju: Fish Hubs In AllDdistricts | Sakshi
Sakshi News home page

అన్ని జిల్లాల్లో  చేపల హబ్‌లు

Aug 14 2020 8:58 AM | Updated on Aug 14 2020 8:58 AM

Sidiri Appalaraju: Fish Hubs In AllDdistricts - Sakshi

సాక్షి, అమరావతి : కోవిడ్‌–19 కారణంగా ఇతర రాష్ట్రాలకు చేపల ఎగుమతులు తగ్గిన నేపథ్యంలో స్థానికంగా చేపల మార్కెటింగ్‌ (డొమెస్టిక్‌ మార్కెటింగ్‌) పెంచడం ద్వారా రైతులను ఆదుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర మత్స్య, పశు సంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనమ్‌ మాలకొండయ్య, కమిషనర్‌ కన్నబాబు గురువారం డొమెస్టిక్‌ మార్కెటింగ్‌పై సమీక్షించారు. చేపల వినియోగం పెంచడానికి ప్రభుత్వం సత్వరం చేపట్టాల్సిన అంశాలపై నిర్ణయం తీసుకున్నారు.  (అమరావతికి నిధుల సమీకరణ) 
అదనపు ఆదాయం వచ్చే యూనిట్లు పెట్టించండి 
వైఎస్సార్‌ చేయూత పథకం కింద ఇచ్చిన మొత్తంతో నాటుకోళ్లు, పొట్టేళ్లు, గొర్రెల పెంపకం వంటి యూనిట్లు మహిళలతో పెట్టించి ఆరి్థకంగా వారి బలోపేతానికి  కృషి చేయాలని మంత్రి సీదిరి అప్పలరాజు అధికారులను ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలోని మంత్రి కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు పేర్కొన్నారు. 
► సెప్టెంబర్‌ లోపు పూర్తిస్థాయిలో మహిళలకు వారు కోరుకున్న యూనిట్లను అందించడానికి చర్యలు తీసుకోవాలి. 
► మొదటి విడతగా లక్ష పాడి పశువులు అందించాలి.  
► నెలకు కనీసం రూ. 10 నుంచి 15 వేల వరకు అదనపు ఆదాయం వచ్చేలా ప్రణాళికలు రూపొందించాలి. 
► సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ ముఖ్య కార్యదర్శి రాజబాబు, పాడి పరిశ్రమాభివృద్ధి      శాఖ డైరెక్టర్‌ వాణీ మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.   

ప్రధాన నిర్ణయాలు ఇవీ.. 
► రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 20 హబ్‌లు ఏర్పాటు 
► హబ్‌ల్లో శీతలీకరణ సౌకర్యాలతోపాటు లైవ్‌ఫిష్‌ నిల్వలుంటాయి. 
► వినియోగదారులకు చేపలు డోర్‌ డెలివరీ ద్వారా విక్రయాలు  
► త్వరలో ప్రత్యేక మత్స్య విశ్వ విద్యాలయాన్ని ప్రారంభించడానికి చర్యలు  
► చిన్న, పెద్ద రిజర్వాయర్లలో కేజ్‌ కల్చర్‌ ద్వారా చేపల పెంపకానికి ప్రోత్సాహం  

Advertisement
 
Advertisement
Advertisement