
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీల్లో పైరవీలకే ప్రాధాన్యం
ఖాళీల వివరాలు చెప్పకుండా ఆప్షన్లు అడుగుతున్న వైనం
ఎమ్మెల్యే సిఫారసు ఉన్న వారికే కోరిన చోటుకు బదిలీ
అధికారుల వైఖరిపై కౌన్సిలింగ్ కేంద్రాల్లో ఉద్యోగుల నిరసన
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఇదే తంతు
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీలు కూటమి నేతల ఇష్టారాజ్యంగా సాగుతున్నాయి. ఖాళీ పోస్టుల వివరాలు బహిర్గత పరచకుండా కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే సిఫారసు లేఖలు ఉంటేనే ప్రాధాన్యత ఇస్తున్నారు. డబ్బులు చెల్లించి లేఖలు తెచ్చుకోలేని వారికి మారుమూల ప్రాంతాలు కేటాయించేలా చేతివాటం ప్రదర్శిస్తున్నారు. నిబంధనలకు విరుద్దంగా బదిలీలు సాగుతున్న తీరుపై శనివారం పలు జిల్లాలో సచివాలయాల ఉద్యోగులు నిరసన తెలిపారు.
విశాఖపట్నం, అన్నమయ్య తదితర జిల్లాల్లో కౌన్సిలింగ్ కేంద్రాల్లో బదిలీ అధికారులు వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విడత 72 వేల మంది దాకా సచివాలయాల ఉద్యోగులు ప్రస్తుత బదిలీల ప్రక్రియలో తప్పనిసరిగా బదిలీ అయ్యే పరిస్థితి ఉండగా.. ఆ మేరకు ఖాళీల వివరాలు తెలియ జేయకుండా, కౌన్సిలింగ్ కేంద్రాల అధికారులు మూడు ప్రాంతాల్లో ఆప్షన్లు ఇవ్వాలని సూచిస్తున్నారని ఉద్యోగ సంఘాల నేతలు తప్పు పడుతున్నారు. ఖాళీల వివరాల సమాచారం తెలియని పరిస్థితుల్లో ఉద్యోగులు ఇచ్చిన మూడు ఆప్షన్లు ఖాళీగా లేకపోతే ఎక్కడికి బదిలీ చేస్తారని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.
ఈ విషయం గురించి అడిగితే.. తమకు ఎమ్మెల్యే సిఫారసు ముఖ్యమని, అది లేదంటే ఇష్టమొచ్చిన చోటుకు బదిలీ చేస్తామని కౌన్సిలింగ్ నిర్వహించే అధికారులు చెబుతుండటం దారుణమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. బదిలీల ప్రక్రియలో కేవలం అధికార పార్టీ ఎమ్మెల్యేలు సూచించే పేర్లకు, పైరవీలకే ప్రాధాన్యత ఇస్తున్నారని, ఇది సరికాదని మండిపడ్డారు. సీనియారిటీ అన్నది లేకుండా గ్రామ, మండల టీడీపీ నేతలు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎక్సెల్ షీట్ల రూపంలో సమర్పించిన పేర్లకే ప్రాధాన్యత ఇచ్చిన బదిలీల్లో పోస్టింగ్లు ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు.
దీంతో, చివరకు గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు బదిలీ సిఫార్సు లేఖల కోసం గ్రామాల్లో చిన్న చిన్న టీడీపీ నేతలను సైతం ప్రాధేయపడాల్సి వస్తోందని వాపోతున్నారు. మరోవైపు ప్రాధాన్యత ఇవ్వాల్సిన దివ్యాంగులు, ఇతర ప్రత్యేక కేటగిరీల ఉద్యోగులకు సైతం అధికార పార్టీ ఎమ్మెల్యేలు సూచించిన వారికి పోస్టింగులు ఇచ్చాకే, మిగిలిన ఖాళీల్లో నియామకాలు చేపడుతున్నారని ఉద్యోగ సంఘాల నాయకులు మండిపడుతున్నారు.
తీవ్ర గందరగోళం
ప్రభుత్వ ఉత్తర్వులకు విరుద్ధంగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీల ప్రక్రియను చేపట్టడం అత్యంత బాధాకరమని గ్రామ, వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ తప్పు పట్టింది. బదిలీలకు సంబంధించి విడుదల చేసిన జీవోలోని పాయింట్ నెంబర్ 8లో అత్యంత పారదర్శకంగా, వివాదాలకు ఆస్కారం లేకుండా బదిలీలు నిర్వహించాలని చాలా స్పష్టంగా పేర్కొన్నారని అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జానిపాషా, బత్తుల అంకమ్మరావులు ఒక ప్రకటనలో గుర్తు చేశారు.
అయితే దాదాపు అన్ని జిల్లాల్లో కనీసం ఖాళీల వివరాలు సైతం ప్రదర్శించకుండా సచివాలయాల ఉద్యోగులను తీవ్ర గందరగోళానికి గురిచేస్తూ.. బదిలీల ప్రక్రియను అపహాస్యం చేస్తున్నారని విమర్శించారు. కొన్ని శాఖల అధికారులు మరో అడుగు ముందుకు వేసి, మీకు సిఫారసు లేఖ ఉందా.. లేదా.. అని అడుగుతున్నారని, ఒకవేళ సిఫారసు లేఖ లేని పక్షంలో సంబంధిత ఉద్యోగికి ఎక్కడ పోస్టింగ్ ఇస్తారో కూడా చెప్పని పరిస్థితి ఉందని పేర్కొన్నారు.
అనంతపురం, విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు మరికొన్ని జిల్లాల్లో ఉద్యోగులు అనైతిక బదిలీల కౌన్సిలింగ్ ప్రక్రియను బాయ్కాట్ చేసి కౌన్సిలింగ్ కేంద్రాలలో నిరసన తెలిపారన్నారు. తక్షణం బదిలీల ప్రక్రియపై సచివాలయాల శాఖ ఉన్నతాధికారులు స్పందించి, పారదర్శకంగా నిర్వహించేలా అన్ని జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని వారు డిమాండ్ చేశారు.
అడ్డగోలు పనులతో ఒత్తిడి పెంచొద్దు
జిల్లా కలెక్టరేట్ల ఎదుట పంచాయతీ కార్యదర్శుల ఆందోళన
సాక్షి, అమరావతి: రోజూ ఉదయం ఆరు గంటలకే విధుల్లో పాల్గొనాలంటూ అడ్డగోలు పనులతో పని ఒత్తిడి పెంచేస్తున్నారని రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ కార్యదర్శులు మండిపడ్డారు. తమ సమస్యల పరిష్కారం కోరుతూ శనివారం వారు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు నిర్వహించారు. ఎక్కడికక్కడ మండలాల్లో పంచాయతీ కార్యదర్శులు మూకుమ్మడిగా సెలవు పెట్టి జిల్లా కలెక్టరేట్ల ముందు ఆందోళనలు నిర్వహించి కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేశారు. దాదాపు అన్ని జిల్లాల్లోనూ కలెక్టరేట్ల వద్ద ఆందోళన కార్యక్రమాలు కొనసాగాయి.
ఎక్కడికక్కడ ఉద్యోగులు ముందుకొచ్చి నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారని పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగ సంఘ ప్రతినిధులు వెల్లడించారు. గతంలో వలంటీర్లు చేసే చిన్న చిన్న సర్వే పనులు సైతం గ్రామ సచివాలయాల ఉద్యోగులకే అప్పగించడంతో పాటు సకాలంలో వాటిని పూర్తి చేయకపోతే ఆ సచివాలయాల కార్యదర్శులను బాధ్యులను చేస్తూ సస్పెండ్, తదితర చర్యలకు దిగుతుండడంతో.. తమకు సచివాలయాల డీడీవో బాధ్యతలు వద్దంటూ నినాదాలు చేశారు. ఇదిలా ఉండగా విధులకు హాజరుకాని పంచాయతీ కార్యదర్శుల వివరాలు వెంటనే సమరి్పంచాలంటూ పలు చోట్ల జిల్లా పంచాయతీ అధికారులు (డీపీవో) ఎంపీడీవోలకు ఆదేశాలు జారీ చేశారు.