నిమ్మగడ్డ మరో వివాదాస్పద నిర్ణయం
సాక్షి, విజయవాడ : రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. మెడికల్ లీవ్లో వెళ్లిన అధికారిని ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం జాయింట్ డైరెక్టర్ జీవీ సాయి ప్రసాద్ అనారోగ్య సమస్యలతో నెలరోజులపాటు మెడికల్ లీవు పెట్టారు. సాయి ప్రసాద్తో పాటు రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు పీఎస్గా వ్యవహరిస్తున్న అసిస్టెంట్ సెక్రటరీ రామారావు, మరో అసిస్టెంట్ సెక్రటరీ సాంబమూర్తి కూడా లీవ్ పెట్టారు. అయితే ముగ్గురు లీవ్ పెట్టినప్పటికి జేడీ సాయి ప్రసాద్పైనే నిమ్మగడ్డ చర్యలు తీసుకున్నారు. ( టీడీపీతో నిమ్మగడ్డ చెట్టపట్టాల్ )
ఛార్జి మెమో కూడా ఇవ్వకుండా ఏకంగా ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. పదవీ విరమణ బెనిఫిట్స్ కూడా ఇవ్వకూడదన్న ఎస్ఈసీ ఉత్తర్వులపై ఉద్యోగ సంఘాలు విస్మయం చెందాయి. ఉద్యోగులను బెదిరించడం ద్వారా పంచాయితీ ఎన్నికలు నిర్వహించడానికే ఈ తరహా ఉత్తర్వులు జారీ చేశారంటూ వాపోతున్నాయి.