నిమ్మగడ్డ రమేష్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు | Retd IAS officer Nimmagadda Ramesh accused of harassing faculty at ASCI Hyderabad | Sakshi
Sakshi News home page

మాజీ ఐఏఎస్‌ నిమ్మగడ్డ రమేష్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు

Jun 5 2026 6:30 PM | Updated on Jun 5 2026 9:09 PM

Retd IAS officer Nimmagadda Ramesh accused of harassing faculty at ASCI Hyderabad

సాక్షి, హైదరాబాద్‌: మాజీ ఐఏఎస్‌, ఆంధ్రప్రదేశ్ మాజీ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్‌లోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ASCI)లో డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్న ఆయ‌న త‌మ‌ను వేధింపులు, వివక్షకు గురి చేశారంటూ నలుగురు అధ్యాపకులు ఆయనపై ఫిర్యాదులు చేసినట్లు సమాచారం. ఈ ఫిర్యాదుల్లో ఒకటి లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించినది కాగా, మిగిలినవి తమను పక్కనపెట్టి త‌న‌కు సన్నిహితులైన వారికి రమేష్ కుమార్‌ ప్రాధాన్యం ఇస్తున్నారనే ఆరోపణలతో ఉన్నాయి.

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో ప్రభుత్వానికి, ప్రైవేట్‌ సంస్థలకు మధ్య అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా ఉంది. ఇక్కడ ప్రభుత్వం, పబ్లిక్ సెక్టార్, ప్రైవేట్ రంగాల్లోని ఉద్యోగులకు శిక్షణ ఇస్తూ ఉంటారు. 2024 ఆగస్టులో ఏఎస్‌సీఐ డైరెక్టర్ జనరల్‌గా నిమ్మగడ్డ బాధ్యతలు స్వీకరించారు. కొద్ది రోజులకే త‌న‌కు రమేష్ కుమార్ నుంచి వేధింపులు ప్రారంభ‌మ‌య్యాయ‌ని ఓ మహిళా ప్రొఫెసర్ ఆరోపించారు. ఈ మేర‌కు జాతీయ మహిళా కమిషన్‌ను ఆశ్రయించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కూడా నాలుగు సార్లు ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. 

మహిళా ప్రొఫెసర్‌పై వేధింపులు
డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే రమేష్ కుమార్ తనను ఒంటరిగా కలవాలని కోరిన‌ట్టు బాధితురాలు త‌న ఫిర్యాదులో పేర్కొన్నారు. 15 ఏళ్లకు పైగా ఏఎస్‌సీఐలో పనిచేస్తున్న త‌న‌ను లైంగిక వేధింపుల‌కు గురిచేశార‌ని వాపోయారు. ఉన్నత పదోన్నతుల కోసం 'కొంతమందిని సంతృప్తి పరచాల్సి ఉంటుందని' పెడార్థంతో వ్యాఖ్యానించార‌ని, తాను లొంగ‌క‌పోవ‌డంతో వేధింపులు ప్రారంభమయ్యాయని తెలిపారు. ఇతర సిబ్బంది ఎదుట అవమానించడం, తాను నిర్వహిస్తున్న కేంద్రం డైరెక్టర్ పదవి నుంచి తొలగించడం, పెద్ద కార్యాలయ గదిని తీసేసి చిన్న గదికి మార్చడం వంటి చర్యలు తీసుకున్నారని ఆరోపించారు.

కాంట్రాక్ట్ పునరుద్ధరణలో వివక్ష?
ఏఎస్‌సీఐలో అధ్యాపకులు ప్రభుత్వ శాఖలు, కేంద్ర మంత్రిత్వ శాఖలు, పబ్లిక్ సెక్టార్ సంస్థల కోసం శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి ఆదాయం సమకూర్చాలి. ప్రతి అధ్యాపకుడు సంవత్సరానికి కనీసం రూ.95 లక్షల ఆదాయం తీసుకురావాల్సి ఉంటుంది. గత మూడేళ్లుగా తాను సగటున రూ.1 కోటి ఆదాయం సమకూర్చినా, ఫిర్యాదు చేసిన తర్వాత తనకు పనులు కేటాయించడం నిలిపివేశారని మహిళా ప్రొఫెసర్ ఆరోపించారు. 2025 నవంబరులో ముగిసిన త‌న‌ కాంట్రాక్ట్‌ను కేవలం ఆరు నెలలపాటు మాత్రమే పొడిగించారని వాపోయారు. ఆ గడువు మే 31తో ముగియగా జూన్ 1న కళాశాలకు వెళ్లినప్పుడు భద్రతా సిబ్బంది తనను లోపలికి అనుమతించలేదని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తన ఫిర్యాదుపై విచారణ కొనసాగుతున్న సమయంలో ఈ చర్యలు POSH చట్టానికి విరుద్ధమని పేర్కొంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు వెల్లడించారు. 

మరో ముగ్గురు ప్రొఫెసర్ల ఫిర్యాదులు
నిమ్మ‌గ‌డ్డ రమేష్ కుమార్‌పై 2026లో మరో ముగ్గురు ప్రొఫెసర్లు ఏఎస్‌సీఐ పాలన బోర్డు‌కు ఫిర్యాదులు చేశారు. వారు తమ కాంట్రాక్ట్ రెన్యువల్‌పై ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో పాటు ల్యాండ్‌ అక్విజేషన్‌ సెంటర్‌ను విలీనం చేయడం, సైబర్ ల్యాబ్ మూసివేసేలా ప్రయత్నాలు చేయడం, విస్తరణ పనులపై సమాచారం ఇవ్వకుండా సంబంధిత శాఖ అధికారుల్ని దూరం చేశారని ఆరోపణలు వినిపించాయి. రమేష్‌ ఆగడాలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో తమకు మరిన్ని వేధింపులు ఎదురయ్యాయని చెప్పారు. పబ్లిక్ ఈవెంట్లలో అవమానించడం, అసభ్యంగా మాట్లాడడం, కాలేజీలో జరిగే ఈవెంట్‌ల నుంచి బయటకు పంపి అవమానించడం, బెదిరింపుల‌కు పాల్ప‌డ‌డం చేశార‌ని బాధితులు త‌మ‌ ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. 2029 వ‌ర‌కు ఉన్న త‌న‌ కాంట్రాక్ట్‌ను 2024లో అక‌స్మాత్తుగా రద్దు చేశారని మాజీ మహిళా ప్రొఫెసర్ కూడా ఆరోపించారు. ఇందులో ఏఎస్‌సీఐ చైర్మన్ పద్మనాభయ్య పాత్ర ఉందని పేర్కొన్నారు. 

నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పంద‌న‌
త‌న‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌లు దురుద్దేశపూరితమైనవి, ఆధారరహితమైనవిగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేర్కొన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిగా ఇంత‌కంటే ఎక్కువ మాట్లాడ‌లేన‌ని, ఏఎస్‌సీఐ రిజిస్ట్రార్ సమాధానం ఇస్తారని చెప్పారు. అయితే ఇప్పటివరకు రిజిస్ట్రార్ నుంచి అధికారిక స్పందన రాలేదు.

Advertisement
 
Advertisement
Advertisement