
ఉ.9 నుంచి సా.4 గంటల వరకు పాఠశాలలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గురువారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఉ.9 గంటలకు బడిగంటలు మోగనున్నాయి. ప్రాథమిక పాఠశాలలు మ.3.20 గంటల వరకు, ఉన్నత పాఠశాలలు సా.5 గంటల వరకు కొనసాగుతాయి. హైసూ్కళ్లలో సా.4 గంటల వరకు తరగతులు కొనసాగుతాయి. అనంతరం గంట సమయం (ఐచ్ఛికం) ఆటలు లేదా స్టడీ అవర్కు కేటాయిస్తారు. 2025–26 విద్యా సంవత్సరానికి గాను గతనెలలో ప్రాథమిక స్కూళ్ల విద్యా కేలండర్ను విడుదల చేసిన విద్యాశాఖ.. బుధవారం హైస్కూల్ అకడమిక్ కేలండర్ను కూడా విడుదల చేసింది.
ఈ ఏడాది విద్యా సంవత్సరంలో మొత్తం 316 రోజులకు గాను 83 రోజులను వివిధ సెలవులుగా ప్రకటించింది. మిగిలిన 233 రోజులు పాఠశాలలు పనిచేస్తాయి. ఇక సాధారణ బడులకు సెపె్టంబరు 24 నుంచి అక్టోబరు 2 వరకు దసరా సెలవులు.. వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 18 వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయి. అలాగే, క్రిస్టియన్ మైనారిటీ స్కూళ్లకు సెపె్టంబరు 27 నుంచి అక్టోబరు 2 వరకు దసరా సెలవులు.. డిసెంబరు 21 నుంచి 28 వరకు క్రిస్మస్ సెలవులు, జనవరి 10 నుంచి 15 వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయి. ప్రతి శనివారం అన్ని పాఠశాలల్లోను ‘నో బ్యాగ్ డే’ కొనసాగుతుంది. ఆ రోజు విద్యేతర కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఏడాదికి ఏడు పేరెంట్స్–టీచర్స్ సమావేశాలు
ఇక విద్యార్థులకు పరీక్షలు నిర్వహించే (ఫార్మేటివ్, సమ్మేటివ్ అసెస్మెంట్) ముందు పేరెంట్స్–టీచర్స్ సమావేశం (పీటీఎం) నిర్వహిస్తారు. ఏడాదిలో మొత్తం ఏడు పీటీఎంలు ఉంటాయి. వీటిలో జూన్ 25న, నవంబరు 25న మెగా పీటీఎంలు ఉంటాయి. ఆగస్టులో తెలుగు భాషోత్సవాలు నిర్వహిస్తారు. అలాగే, పదో తరగతి విద్యార్థులకు 2026 మార్చి 16 నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు పబ్లిక్ పరీక్షలు ఉంటాయి. విద్యార్థుల్లో రాజకీయ విజ్ఞానం పెంచేందుకు కొత్తగా అసెంబ్లీ పర్యటనను చేర్చారు.
ఇందులో ప్రభుత్వ పాఠశాలల్లో 8–10 తరగతుల విద్యార్థులకు పోటీలు నిర్వహించి ఎంపికైన వారికి అమరావతిలోని శాసనసభ సందర్శించే అవకాశం కల్పిస్తారు. 9వ తరగతి విద్యార్థులకు కొత్తగా బ్రిడ్జి కోర్సును ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా టెన్త్ విద్యార్థులకు ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించే మార్చిలో తొమ్మిదో తరగతి విద్యార్థులకు కూడా పరీక్షలు నిర్వహించి పబ్లిక్ పరీక్షలపై అవగాహన కల్పిస్తారు.