
ధాన్యం రైతుకు దగా.. ఇక దళారీల సెగ..
పశ్చిమ గోదావరి, ఏలూరులో రోడ్లు, ఖాళీ స్థలాల్లో ధాన్యం కుప్పలు
అకాల వర్షాలకు నీళ్లలో నానుతున్న వరి కంకులు
గోనె సంచులు, హమాలీలు, రవాణా సౌకర్యాలు లేక అగచాట్లు.. ఈ–క్రాప్లో నమోదైనా పీఆర్ 126 రకం కొనుగోలుకు నిరాకరణ
మిషన్లతో కోత కోసేందుకు భారీగా అద్దె
కమీషన్ ఏజెంట్లు ఓకే అంటేనే సరుకు తరలింపు
75 కిలోల బస్తాకు రూ.300– 450 వరకు దోపిడీ
‘మద్దతు’ లేక టన్నుకు సుమారు రూ.6 వేల వరకు నష్టపోతున్న అన్నదాతలు
రూ.800 కోట్లకుపైగా రైతుల కష్టం దళారులు, మిల్లర్ల జేబుల్లోకే..
సాక్షి, అమరావతి: దళారీలు చెప్పిందే ధర.. బస్తాకు రూ.300 – 450 దాకా దగా! పేరుకు మాత్రమే సర్కారు ధాన్యం సేకరణ! పంటను కొనేది, తరలించేది.. మిల్లర్లు, దళారులే. వారి అనుమతి లేనిదే ధాన్యం కల్లాల నుంచి కదలని దుస్థితి. రాష్ట్రంలో అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులను ధాన్యం కొనుగోళ్ల తీరు కన్నీళ్లు పెట్టిస్తోంది. కోసిన పంటను రోజుల తరబడి కాపాడుకోలేక, రోడ్డుపై ఆరబోసిన ధాన్యాన్ని భద్రపరచుకోలేక అన్నదాతలు నిస్సహాయస్థితిలో కూరుకుపోతే సర్కారు చోద్యం చూస్తోంది.
రైతు భరోసా కేంద్రాలు నిర్వీర్యమైపోయాయి. రైతులకు సంపూర్ణ మద్దతు ధర అందించి పంటలను కొనుగోలు చేయాల్సిన ప్రభుత్వమే దళారీల దందాను ప్రోత్సహిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం సేకరణ రైతులకు ఉత్త మట్టి మిగులుస్తుండగా దళారులకు కాసులు కురిపిస్తోంది. మంగళ, బుధవారాల్లో ‘సాక్షి’ బృందం క్షేత్రస్థాయి పర్యటనలో అన్నదాతల అగచాట్లు.. బ్రోకర్ల మాయాజాలం వెలుగులోకి వచ్చింది.
‘పశ్చిమ’లో పీఆర్ 126 కొనేది లేదు..
పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట పరిధిలోని పెనుమంట్ర, జుత్తిగ, వెలగలవారిపాలెం, నత్తా రామేశ్వరం, ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలోని పిప్పర, మొయ్యేరు, ముప్పర్తిపాడు పరిసర ప్రాంతాల్లో రోడ్లపై, ఖాళీ స్థలాల్లో ఎటు చూసినా ధాన్యం రాశులు, వడ్ల బస్తాలే కనిపిస్తున్నాయి. అత్తిలి–వేల్పూరు రోడ్డు, గవర్లపాలెం, తణుకు జాతీయ రహదారికి ఇరువైపులా పట్టాలు కప్పిన ధాన్యం రాశులతో రైతన్నలు దిగాలుగా ఉన్నారు. రోజులు గడుస్తున్నా ప్రభుత్వం కొనుగోలుకు ముందుకు రాకపోవడం, అకాల వర్షాల నుంచి ధాన్యాన్ని కాపాడుకోలేక నరకయాతన అనుభవిస్తున్నారు.
ఇక్కడ పీఆర్ 126 రకం వరిని అధికంగా పండించిన రైతులకు ప్రభుత్వం మొండిచెయ్యి చూపిస్తోంది. ఈ క్రాప్లో నమోదైనప్పటికీ దీన్ని కొనుగోలు చేసేది లేదని చెబుతోంది. జుత్తిగ పరిసరాల్లో 1,800 ఎకరాల్లో వరి సాగు కాగా సగానికిపైగా భూమిలో పీఆర్ 126 రకాన్నే పండించారు. కొనేవారు లేక ధాన్యం బస్తాలన్ని పంట పొలాల్లోనే ఉండిపోయాయి.
ఉమ్మడి తూర్పులో ‘కౌలు’ రైతుల కష్టాలు..
కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి జిల్లాల్లో కౌలు రైతులు పరిస్థితి దయనీయంగా ఉంది. సామర్లకోట, ఉండూరు, తిమ్మాపురం, కరప, వీకే రాయపురం, పెద్దాపురప్పాడు, ద్రాక్షరామం, రామచంద్రపురం, ఆత్రేయపురం మండలాల్లో పంటను కొనే పరిస్థితి లేదు. కొద్ది రోజుల కింద కాకినాడ జిల్లాల్లో పర్యటించిన పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ధాన్యం సేకరణ సరిగా లేదని స్వయంగా ఒప్పుకున్నారు.
ఆ తర్వాత కూడా పరిస్థితిలో మార్పులేదు. పచ్చి ధాన్యాన్ని 75 కిలో బస్తా రూ.1,200కి మాత్రమే కొంటున్నారు. వర్ష సూచన ఉన్నప్పుడు ధర రూ.1,100కి పడిపోతోంది. కౌలు రైతులు రైతు సేవా కేంద్రంలో పంటను అమ్ముకోలేక దళారులను ఆశ్రయించాల్సి వస్తోంది. మిల్లర్లు అడిగిన రేటుకు ఇస్తేనే గోనె సంచుల సరఫరా, సరుకు రవాణా జరుగుతోంది. లేదంటే పంటలు కల్లాల్లో, రోడ్లపై వర్షానికి తడిచి ముద్దవ్వాల్సిందే.
కొనుగోలు అంతా మాయ..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేసి కొనుగోలు కేంద్రాలను కుదించేసింది. మరోవైపు క్షేత్రస్థాయిలో దిగుబడులకు ప్రభుత్వ కొనుగోలు లెక్కలకు పొంతన ఉండట్లేదు. ఈ ఏడాది రబీలో 48–56లక్షల టన్నుల దిగుబడి వస్తుందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేశాయి.
కానీ తొలుత 13 లక్షల టన్నుల సేకరణ టార్గెట్గా మంత్రి మనోహర్ ప్రకటించారు. ఇటీవల సీఎం నిర్వహించిన సమీక్షలో 20 లక్షల టన్నులు ధాన్యం సేకరిస్తామని పౌరసరఫరాల కమిషనర్ సౌరభ్గౌర్ చెప్పారు. తొలుత టార్గెట్ తక్కువగా ప్రకటించి రైతులను భయాందోళనకు గురి చేయడం ద్వారా దళారులతో తక్కువ ధరకు పంటను కొనుగోలు చేస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
రోజూ ఆరబోసుకోవడమే..
కౌలుకు 11 ఎకరాల్లో పీఆర్ 126 రకం వరి సాగు చేశా. పంట కోసి వారం అయింది. ఆరబెట్టిన ధాన్యాన్నికొనమంటే ముక్కిపోతుందని సాకులు చెబుతున్నారు. బస్తాల్లో ఉంటే నిమ్ము చేరుతుంది. ఎన్ని రోజులు ధాన్యం రోడ్డుపై పోసి ఆరబెట్టుకోగలం. – వీరవల్లి శ్రీనివాసు, మొయ్యేరు, ఏలూరు జిల్లా
సర్వం నష్టమే..
నాలుగు ఎకరాల్లో సన్నాలు, బొండాలు సాగు చేశా. వర్షాలకు చేను మొత్తం పడిపోయింది. మిషన్తో కోత కోసేందుకు రూ.30 వేలు ఖర్చయింది. వచ్చే డబ్బుల్లో సగం వాటికే సరిపోతాయి. రెండు పంటలకు రూ.40 వేలు కౌలు చెల్లించాలి. పంట మొత్తం తడిచిపోయింది. ఎండబెట్టాలంటే రోజుకు రూ.2 వేలు కూలి అవుతుంది. అంతా నష్టమే. వ్యవసాయం మానలేక.. – ముమ్ముడి చక్రధర్, గొంచాల, కాకినాడ జిల్లా
అంతా ఏకమయ్యారు..
పది ఎకరాలు కౌలుకు తీసుకుని 126 రకం వరి విత్తనాన్ని సాగు చేశా. పంట కోసి 8 రోజులు అవుతోంది. రోజూ వాతావరణం మారిపోతోంది. వర్షాలు వచ్చేస్తున్నాయి. నిత్యం ధాన్యం బస్తాల్లో నింపి ఆరబోయాల్సి వస్తోంది. కూలీ ఖర్చులు భారంగా మారుతున్నాయి. గతంలో ఇదే పంట సాగు చేస్తే ప్రభుత్వం కొనుగోలు చేసింది. మొన్నటి వరకు రూ.1350కి అడిగిన వాళ్లు ఇప్పుడు కొనుగోలు చేయడం లేదు. కమీషన్దారులు, మిల్లర్లు అంతా ఒక్కటైపోయారు. కడుపు నిండటంతో మా పంటను చౌకగా కాజేయలని చూస్తున్నారు. – పొట్టి ఏసేబు, వెంకటరాజుపురం, ఏలూరు జిల్లా
‘మద్దతు’ మాటే లేదు..
కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వీకే రాయపురం గ్రామానికి చెందిన ఇంటి రమేష్ తొమ్మిది ఎకరాల్లో వరి పండించారు. ఎకరానికి రూ.35 వేలు పెట్టుబడి అయ్యింది. గతేడాది ఎకరానికి 60 బస్తాల దిగుబడి వస్తే ఈ ఏడాది తెగుళ్లతో 50 బస్తాలే వచ్చింది. మద్దతు ధర మాటే లేదు. కూలీ ఖర్చులు, మిల్లుకు చేరవేయడానికి రవాణా ఖర్చుల పేరుతో రూ.200 తగ్గిస్తున్నారు. పొల్లు ఉందని మరో రూ.25 కోసేస్తున్నారు.
ప్రభుత్వం కొనట్లేదు..
ఈ ఫొటోలో కనిపిస్తునది నక్కా చిట్టి వెంకట నారాయణ పశ్చిమ గోదావరి జిల్లా జుత్తిగ గ్రామం. దేశ రక్షణలో మిలటరీలో సేవలందించిన ఆయన రైతుగా మారి సేద్యం చేస్తున్నారు. మద్దతు ధర దేవుడెరుగు.. పంట కొనే నాధుడే లేడని ఆక్రోశిస్తున్నారు. ‘అప్పులు చేసి, ప్రకృతి వైపరీత్యాలకు ఎదురొడ్డి పది ఎకరాల్లో పీఆర్ 126 రకం వరిని సాగు చేశా. కోత కోసి పది రోజులు దాటింది. రోజూ ఆరబెట్టడం.. బస్తాల్లో నింపడం ఇదే పని. ఎంత పట్టాలు కప్పినా అడుగు బస్తాలు తడిచిపోతున్నాయి. తడిచి మొలకలొస్తాయని భయంగా ఉంది.
ప్రభుత్వం ఈ రకాన్ని కొనుగోలు చేయడం లేదు. సంచుల కోసం తిరగ్గా తిరగ్గా పది రోజుల తర్వాత ఇచ్చారు. 75 కిలో బస్తాను దళారులు రూ.1,300కి పట్టుకెళ్తున్నారు. ఒక్కో బస్తాపై రూ.450 నష్టపోతుంటే ఎలా తట్టుకోగలం? ఈ రకం విత్తనానికి ఎకరాకు 8 బస్తాలు ఎరువు వేయాలి. ఐదుసార్లు పురుగు మందులు చల్లాలి. పెట్టుబడి ఎకరానికి సుమారు రూ.30 వేలకుపైగా అవుతుంది. ఏ ఎరువు చూసినా రూ.1500 – రూ.1800 ఉంటోంది. రైతుకు మాత్రం రేటు లేదు. ఇదంతా ప్రభుత్వం చేస్తున్న మోసమే.