అవుకు పవర్ ప్రాజెక్టును ఆర్వీఆర్ సంస్థకు రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు
అవుకు పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు నుంచి తప్పుకున్న ఆర్వీఆర్
కంపెనీ పరిస్థితులు బాగోలేవంటూ భూకేటాయింపులు రద్దు
అధికారం చేపట్టగానే అవుకు టెండర్లు రద్దు చేసిన చంద్రబాబు సర్కారు
రామోజీ సమీప బంధువుకు చెందిన ఆర్వీఆర్ పవర్ ప్రాజెక్టుకు అవుకు ప్రాజెక్టు కట్టబెడుతూ ఉత్తర్వులు
రూ.4,700 కోట్ల పెట్టుబడితో 1,200 ఉద్యోగాలంటూ ప్రచారం
ఆర్థిక కారణాల నెపంతో ఈ ప్రాజెక్టు చేపట్టలేమంటూ ప్రభుత్వానికి ఆర్వీఆర్ లేఖ
రాష్ట్రం నుంచి తప్పుకున్న టాటా పవర్, వెబ్సోల్ సరసన చేరిన ఆర్వీఆర్
సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కారులో ‘పవర్ సెంటర్’ దెబ్బకి రాష్ట్రం నుంచి పవర్ కంపెనీలు పారిపోతున్నాయి. ఇప్పటికే నెల్లూరు జిల్లా నుంచి టాటా పవర్ ఒడిశాకి, తిరుపతి జిల్లా నుంచి వెబ్సోల్ సంస్థ పశ్చిమబెంగాల్కు పారిపోగా.. తాజాగా నంద్యాల జిల్లా అవుకు పంప్డ్స్టోరేజ్ ప్రాజెక్టుకు ఆర్వీఆర్ ప్రాజెక్టు దణ్ణంపెట్టి మరీ తప్పుకుంది. విచిత్రం ఏమిటంటే.. ఏ తేదీన రాష్ట్రంలో ప్రాజెక్టు చేపడతామని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిందో సరిగ్గా ఏడాది తర్వాత అదే తేదీన ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నామంటూ ఆర్వీఆర్ ప్రాజెక్ట్ లేఖ రాయడం గమనార్హం.
1,200 మందికి ఉద్యోగాలంటూ..
2025 జూలై9న రాష్ట్రంలో రూ.4,708 కోట్ల పెట్టుబడితో 1,200 మందికి ఉపాధి కల్పించే విధంగా నంద్యాల జిల్లా అవుకు వద్ద 800 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తామంటూ ఆర్వీఆర్ సంస్థ ప్రభుత్వానికి లేఖ రాసింది. అదే కంపెనీ ఈ ఏడాది జూలై 9న తమవద్ద ఈ ప్రాజెక్టు చేపట్టడానికి అవసరమైన నిధులు లేకపోవడంతో ఈ ప్రాజెక్టు ప్రతిపాదనను రద్దు చేయమంటూ లేఖ రాసింది. ఏడాది క్రితం ఈ లేఖ ఆధారంగా పెట్టుబడులకు ఆమోదం తెలిపిన ప్రభుత్వం ఇప్పుడు ఏడాది తర్వాత కంపెనీ రాసిన లేఖ ఆధారంగానే పెట్టుబడి ప్రతిపాదనను ఉపసంహరిస్తూ రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
పవర్ నుంచి రూ.14,921 కోట్ల పెట్టుబడులు పరార్
హరిత ఇంధన ప్రాజెక్టులను ప్రోత్సహించడంలో భాగంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నంద్యాల జిల్లా అవుకు వద్ద 800 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్టును అరబిందో గ్రూపునకు చెందిన అరో ఇన్ఫ్రాకు అప్పగించారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కారు ఈ ప్రాజెక్టును అరో ఇన్ఫ్రాకు కేటాయింపులను రద్దు చేస్తూ.. ఈనాడు రామోజీ కుటుంబానికి సమీప బంధువులకు చెందిన ఆర్వీఆర్ ప్రాజెక్టుకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గత ఏడాది జూలై 9న ఆర్వీఆర్ లేఖ రాయడం, అదే నెలలో డీపీఆర్ ఇవ్వడం ఎస్ఐపీసీ, ఎస్ఐపీబీ, మంత్రివర్గ ఆమోదాలు తెలుపుకుంటూ 28వ తేదీన ప్రాజెక్టును కేటాయిస్తూ ఆగమేఘాల మీద ఉత్తర్వులు ఇచ్చేశారు.
ఇలా కేవలం నెల రోజుల్లోనే మూడు విద్యుత్ ప్రాజెక్టులు జీవోలు ఇచ్చాక రాష్ట్రం నుంచి వెళ్లిపోవడంతో దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతోంది. కేవలం ఈ మూడు ప్రాజెక్టులు ద్వారా రాష్ట్రం నుంచి రూ.14,921 కోట్ల పెట్టుబడులు రాష్ట్రం విడిచి వెళ్లిపోయాయి. అంతేకాదు చంద్రబాబు సర్కారు అధికారం చేపట్టిన తర్వాత నుంచి ఇప్పటివరకు జీవోలు ఇచి్చన తర్వాత రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన ప్రాజెక్టుల విలువ రూ.20,956 కోట్లకు చేరింది.


